హిట్లర్‌ వాచీ వేలం.. రూ.కోట్లలో పలికిన ధర.. కొన్నది ఎవరంటే?

author img

By

Published : Jul 31, 2022, 10:34 PM IST

adolf-hitler-watch-auction

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్​కు చెందినదని భావిస్తున్న చేతి గడియారానికి వేలంలో భారీ ధర పలికింది. ఓ అజ్ఞాత వ్యక్తి వాచీని సొంతం చేసుకున్నట్లు తెలిసింది.

జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌కు చెందినదిగా భావిస్తున్న ఓ చేతి గడియారం తాజాగా ఓ వేలంలో 1.1 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.8.71 కోట్లు) అమ్ముడుపోయింది. అమెరికాలో నిర్వహించిన ఈ ప్రక్రియలో ఓ అజ్ఞాత వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నట్లు వేలం సంస్థ 'అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్' వెల్లడించింది. ఈ వాచీ వెనుక వైపు స్వస్తిక్‌ చిహ్నంతోపాటు 'ఏ', 'హెచ్‌' ఆంగ్ల అక్షరాలు పొందుపర్చి ఉన్నాయి. ఇది హిట్లర్‌కు 1933లో ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. హిట్లర్ పుట్టిన తేదీ, ఆయన ఛాన్సలర్‌గా మారిన తేదీ, 1933లో నాజీ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తేదీలు వాచీపై ఉన్నాయి.

వేలం సంస్థ వివరాల ప్రకారం.. 1945లో ఫ్రెంచ్ సైనికులు హిట్లర్‌ తలదాచుకున్న 'బెర్‌గాఫ్‌'పై దాడి చేసినప్పుడు ఈ గడియారాన్ని స్మారక చిహ్నంగా సేకరించారు. అనంతరం దాన్ని విక్రయించారని, అప్పటినుంచి అనేక చేతులు మారుతూ వచ్చినట్లు తెలిపింది. అంతకుముందు.. ఈ గడియారాన్ని వేలం వేయడాన్ని యూదు నాయకులు ఖండించారు. దీన్ని అసహ్యకర చర్యగా అభివర్ణించారు. హిట్లర్‌ తన పాలనలో లక్షలాది యూదులను ఊచకోత కోసిన విషయం తెలిసిందే. అయితే.. చరిత్రను భద్రపరిచే లక్ష్యంతో ఈ వేలం నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. చరిత్రను నాశనం చేస్తే.. అది జరిగింది అని చాటే రుజువులూ మాయమైపోతాయని పేర్కొంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.