ETV Bharat / entertainment

14ఏళ్లకు త్రిష ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్, ఉక్రెయిన్ భామ మిస్సింగ్

author img

By

Published : Aug 22, 2022, 8:33 AM IST

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న విజయ్‌ 67 సినిమాలో కథానాయికగా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇదే కాక, తమిళ కథానాయకుడు శివకార్తికేయన్‌ నటిస్తున్న ప్రిన్స్‌, షారుక్​ ఖాన్ డంకీ సినిమాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీకోసం.

trisha maria
14ఏళ్లకు త్రిష ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్, ఉక్రెయిన్ భామ మిస్సింగ్

Vijay 67 heroine : 'విక్రమ్‌' వంటి విజయవంతమైన చిత్రమిచ్చి హుషారుగా ఉన్న లోకేష్‌ కనకరాజ్‌ తన తర్వాతి ప్రాజెక్టు కోసం సన్నద్ధమవుతున్నాడు. 'విజయ్‌ 67'గా అభిమానులు పిలుచుకొనే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తిచేస్తున్న లోకేష్‌ నటీనటుల ఎంపికపైనా దృష్టి పెట్టాడు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, సమంత, అర్జున్‌ సర్జా, పృధ్వీరాజ్‌ సుకుమారన్‌ తదితరులను సంప్రదించి సినిమాలో కీలక పాత్రల గురించి వివరించినట్లు తెలిసింది. ఇందులో విజయ్‌కు కథానాయికగా త్రిషను ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. విజయ్‌-త్రిషది విజయవంతమైన జోడీ. పద్నాలుగేళ్ల తర్వాత తమ అభిమాన తారలు కలిసి నటిస్తున్నారని వార్తలు రాగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా ఉన్నాయి. అక్టోబరులో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించాలని చిత్రబృందం యోచిస్తోంది.

వీళ్లందర్నీ మిస్‌ అవుతా!
Maria actress Prince movie : తమిళ కథానాయకుడు శివకార్తికేయన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ప్రిన్స్‌'. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న దీన్ని తెలుగు దర్శకుడు అనుదీప్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ఉక్రెయన్‌ నటి మరియా కథానాయిక. ఇప్పుడు ఈమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తైంది. ఈ సందర్భంగా ఈ ఉక్రెయిన్‌ ముద్దుగుమ్మ మాట్లాడుతూ "ఈ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. మంచి సృజనాత్మక బృందంతో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభూతి. అందరూ నాతో స్నేహితుల్లా కలిసిపోయారు. ఇప్పుడు వీళ్లందర్నీ మిస్‌ అవుతాను. సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా" అని చెప్పుకొచ్చింది.
జాతిరత్నాలు తర్వాత అనుదీప్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. ఈ దీపావళికి విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

దుబాయ్‌లో 'డంకీ' షెడ్యూల్‌
Dhunki movie SRK : బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి 'డంకీ'. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుక్‌ ఖాన్‌ కథానాయకుడు. ఈ సినిమా ఇటీవలే బుడాపెస్ట్‌లో చిత్రీకరణ ముగించుకొని వచ్చింది. ఇప్పుడు ఈ బృందం దుబాయ్‌ వెళ్లింది. అక్కడ ఒక షెడ్యూల్‌ జరుపనున్నారు. వేగంగా చిత్రాలను పూర్తిచేస్తున్న షారుక్‌ ఈ షెడ్యూల్‌ కోసం రంగంలోకి దిగిపోయారు. నాలుగేళ్ల తర్వాత ఆయన నటిస్తున్న చిత్రాలు 3 వరుసగా 2023లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసింది. తాప్సి కథానాయికగా నటిస్తున్న 'డంకీ' 2023 డిసెంబర్‌లో విడుదల కానుంది.

'జోగి' కుటుంబాన్ని ఎలా కాపాడాడు?
1984 సిక్కు అల్లర్ల నేపథ్యం కథాంశంగా.. హిమాన్షు కిషన్‌ మెహ్రాతో కలిసి అలీ అబ్బాస్‌ జఫార్‌ నిర్మిస్తూ, తెరకెక్కిస్తున్న చిత్రం 'జోగి'. దిల్జిత్‌ దొసాంజ్‌ టైటిల్‌ పాత్ర పోషించాడు. తాజాగా శనివారం సినిమా టీజర్‌ విడుదల చేశారు. దిల్లీ నగరంలో సంతోషంగా సాగిపోతున్న ఓ సిక్కు యువకుడి కుటుంబంలో మత ఘర్షణలు ఎలాంటి కల్లోలం రేపాయి? వాటి నుంచి అతడు కుటుంబం, స్నేహితుల్ని ఎలా సురక్షితంగా కాపాడుకున్నాడు అన్నది ఇందులో చూపించారు. 'సెప్టెంబరు 16న నెట్‌ఫ్లిక్స్‌లో 'జోగి' మీ ముందుకొస్తున్నాడు. వాస్తవిక సంఘటనలతోపాటు కుటుంబ భావోద్వేగాలకు ఇందులో అత్యధిక ప్రాధాన్యం ఉంది' అంటూ ఓ కామెంట్‌ని జోడిస్తూ చిత్ర గ్లింప్స్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది చిత్రబృందం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.