ETV Bharat / entertainment

గుణశేఖర్​ అలా అనేసరికి స్టేజ్​ పైనే కన్నీరు పెట్టుకున్న సమంత

author img

By

Published : Jan 9, 2023, 2:51 PM IST

దర్శకుడు గుణశేఖర్ మాటలకు స్టేజ్​పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు హీరోయిన్ సమంత. ఇంతకీ ఆ దర్శకుడు ఏమన్నారంటే..

Samantha emotional in shakuntalam
గుణశేఖర్​ మాటలకు స్టేజ్​పైనే కన్నీరు పెట్టుకున్న సమంత

స్టార్ హీరోయిన్ సమంత భావోద్వేగానికి గురయ్యారు. మయోసైటిస్‌ కారణంగా ఎంతో కాలం నుంచి మీడియాకు దూరంగా ఉన్న ఆమె సోమవారం '‘శాకుంతలం' ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొని కన్నీళ్లు పెట్టుకున్నారు. దర్శకుడు గుణశేఖర్​ మాటలకు ఆమె స్టేజ్​పైనే ఏడ్చారు.

"20 ఏళ్లు అయినా 'ఒక్కడు' చిత్రాన్ని మీరింకా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మంచి కంటెంట్‌ ఉంటే సినిమాలను తప్పకుండా ఆదరిస్తారని చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణ. 'శాకుంతలం'కు ముగ్గురు హీరోలు ఉన్నారు. కథకు హీరో దేవ్‌ మోహన్‌ అయితే.. ఈ సినిమాకు హీరో సమంత. తెర వెనుక హీరో దిల్‌రాజు. ఈ సినిమా క్రెడిట్‌ మాత్రం దిల్‌రాజుకు ఇస్తాను. 'శాకుంతలం' విషయంలో ప్రేక్షకుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయం. దిల్‌ రాజు అండగా ఉండటం వల్ల నేను అనుకున్న చిత్రాన్ని తెరకెక్కించగలిగాను. నా కుమార్తె ఇండియాకు వచ్చిన వెంటనే నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది. అదే విషయాన్ని నాతో చెప్పి కథలు అడిగింది. నేను 'శాకుంతలం' కథ చెప్పాను. పురాణాల్లోని ఇలాంటి ఎన్నో అద్భుతమైన కథలను ఇప్పటివాళ్లకు చెప్పాలని నీలిమ కోరింది. శకుంతలగా సమంత అయితేనే బాగుంటుందని చెప్పింది. దాంతో సామ్‌ను కలిసి కథ చెప్పాను. ఆమెకు కథ ఎంతో నచ్చింది. అనంతరం, దిల్‌రాజు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఒక్క హీరోయిన్‌ని నమ్మి ఆయన ఇన్ని కోట్లు పెట్టారు. అందుకు ధన్యవాదాలు" అంటూ గుణశేఖర్‌ ఎమోషన్​ల్​ అయ్యారు. ఆయన మాటలతో అక్కడే ఉన్న సమంత కన్నీరు పెట్టుకున్నారు.

బాగోకపోయినా వచ్చాను.. "ఈ క్షణం కోసం ఎన్నో రోజులుగా మేము ఎదురుచూస్తున్నాం. త్వరలో మా సినిమా రిలీజ్‌ కానుంది. గుణశేఖర్‌ మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఎలాగైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకుని.. ఓపిక లేకపోయినా బలం మొత్తాన్ని కూడబెట్టుకుని హాజరయ్యాను. కొంతమందికి సినిమా.. వాళ్ల జీవితంలో భాగం. కానీ, గుణశేఖర్‌కు సినిమానే జీవితం. ప్రతి సినిమా మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఆయన ప్రాణం పెట్టి తీశారు. ఆయనపై మీరు చూపించే ప్రేమాభిమానాన్ని చూడాలనుకున్నా. అందుకే వచ్చా. కథ విన్నప్పుడు సినిమా అద్భుతంగా ఉండాలని సాధారణంగా నటీనటులు ఊహించుకుంటారు. కొన్నిసార్లు ఆ ఊహను దాటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. 'శాకుంతలం' చూశాక నాకూ అదే భావన కలిగింది. మాకు సపోర్ట్‌గా నిలిచిన దిల్‌రాజుకు ధన్యవాదాలు. ఇందులో భాగం కావడం నా అదృష్టం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక్కటి మాత్రం మారలేదు. సినిమాని నేను ఎంతలా ప్రేమిస్తానో సినిమా కూడా నన్ను అంతలా ప్రేమిస్తోంది. ఈ సినిమాతో మీ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నా" అని సమంత పేర్కొన్నారు.

కాగా, ఈ చిత్రం కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కించారు. ఈ అజరామరమైన ప్రేమకథలో టైటిల్‌ పాత్రను సమంత పోషించగా.. దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటించారు. ఈ పాన్‌ ఇండియా సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. విజువల్‌ వండర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ఈ సినిమాని త్రీడీలో రూపొందిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాను నీలిమ గుణ నిర్మిస్తుండగా.. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పిస్తున్నారు.

ఇదీ చూడండి: సమంత ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. 'శాకుంతలం' ట్రైలర్​ ​రిలీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.