'ఆర్​ఆర్​ఆర్'​కు సీక్వెల్​ ఉందా?.. జక్కన్న సమాధానమిదే!

author img

By

Published : Mar 14, 2023, 10:01 PM IST

rajamouli-clarify-about-rrr-sequel

'ఆర్​ఆర్​ఆర్' సినిమా ఆస్కార్​ అవార్డును సొంతం చేసుకున్నాక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళిని ఆర్​ఆర్ఆర్​ సీక్వెల్​ గురించి అడగ్గా.. ఆయన తనదైన స్టైల్​లో సమాధానం ఇచ్చారు. ఆయన ఎమన్నారంటే?

ప్రపంచమంతటా ఇప్పుడు 'ఆర్​ఆర్​ఆర్'​ మేనియా కొనసాగుతోంది. గత ఏడాది రిలీజైన ఈ సినిమాకు థియేటర్లలో ఓ రేంజ్​లో రెస్పాన్స్​ రావడమే కాకుండా బాక్సాఫీస్​ వద్ద భారీ వసూళ్లును తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డుల వెల్లువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్​తో పాటు ప్రపంచంలోని పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించి చరిత్ర సృష్టించింది. పాన్​ ఇండియా లెవెల్​లో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా పాన్​ వరల్డ్​ రేంజ్​కు ఎదిగి తెలుగోడి సత్తాను చాటింది.

జూనియర్​ ఎన్టీఆర్‌ , రామ్‌చరణ్​లు కథానాయకులుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం కూడా దక్కింది. దీంతో అటు ఆర్​ఆర్​ఆర్​ అభిమానులతో పాటు సినీ ప్రియులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక 'ఆర్​ఆర్​ఆర్'​ టీమ్​ ఆనందం అయితే మాటల్లో చెప్పలేనిది. అవార్డును అనౌన్స్​ చేయగానే స్టేజీ కింద ఉన్న మూవీ టీమ్​ ఒక్కసారిగా గెంతులేశారు. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఇక అవార్డును అందుకున్నాక కార్పెట్​పై కలియ తిరుగుతుమన్న రాజమౌళిని ఓ ఆంగ్ల మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఇక అందులో సినిమా గురించి పలు ఆసక్తికర అంశాలను చెప్పుకొచ్చారు దర్శక ధీరుడు. అయితే ఆ ముఖాముఖిలో యాంకర్​ 'ఆర్‌ఆర్‌ఆర్' సీక్వెల్​ ప్రస్తావన తీసుకొచ్చారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' పార్ట్​ 2 పనులను వేగవంతం చేసేందుకు ఆస్కార్‌ అవార్డులు మీకు స్ఫూర్తినిస్తుందా?' అని యాంకర్​ అడగ్గా.. జక్కన్న తన స్టైల్​లో సమాధానం చెప్పారు. "ఆస్కార్‌ అవార్డు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. అది మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సీక్వెల్‌ స్క్రిప్టు పనుల్ని వేగవంతం చేయడంలో ఇది తప్పక దోహదపడుతుంది" అంటూ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇప్పుడే కాదు గతంలోనూ సీక్వెల్​పై జక్కన్న స్పందించిన సందర్భాలున్నాయి. 'నాటు నాటు'కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన సమయంలోనే.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు కొనసాగింపుగా ఓ మూవీని తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. "ఈ సినిమా సీక్వెల్‌ విషయంలో మా టీమ్​కు కొన్ని ఐడియాలు వచ్చాయి. మొదట దీనికి సీక్వెల్‌ తీయాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయాం. అయితే విదేశాల్లోనూ 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు వచ్చిన ఆదరణ చూసి చిత్ర బృందంతో పాటు, మా నాన్న దగ్గర ఈ ప్రస్థావన తీసుకొచ్చా. అప్పుడే మాకో ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. దాని ఆధారంగా కథ రాయడం మొదలుబెట్టాను. ప్రస్తుతం మా టీమ్​ అంతా అదే పనిలో ఉంది. ఇక స్క్రిప్ట్‌ పూర్తయ్యేంత వరకు మేము ఈ సీక్వెల్‌ విషయంలో ముందుకెళ్లలేం" అంటూ చెప్పుకొచ్చారు.

అయితే రాజమౌళి కంటే ముందే ఆయన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' పార్ట్‌ 2 గురించి పలు ఇంటర్వ్యూలలో మాట్లాడారు. "ఓ రోజు జూనియర్​ ఎన్టీఆర్‌ మా ఇంటికి వచ్చారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సీక్వెల్​ గురించి అడిగారు. నేను తనకు కొన్ని ఐడియాలు చెప్పా. అవి ఎన్టీఆర్​కు, రాజమౌళికి చాలా బాగా నచ్చాయి. దైవానుగ్రహం ఉంటే కచ్చితంగా సీక్వెల్‌ వస్తుంది" అని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరీ ఇక అది సెట్స్​పైకి ఎప్పుడు వెళ్తుందో అంటూ ఫ్యాన్స్​ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక జక్కన్న తన నెక్ట్స్ ప్రాజెక్ట్​ కోసం సూపర్​ స్టార్​ మహేశ్​ బాబుతో చేతులు కలిపారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి క్యారెక్టర్​లో మహేశ్​ కనిపించ​నున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా జరుగుతోంది. ఇక ఈ సినిమా కోసం అమెరికాకు చెందిన క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.