అడివి శేష్​కు అరుదైన గౌరవం.. ఇంటికి పిలిచి 'మేజర్​'ను ప్రశంసించిన మాజీ రాష్ట్రపతి

author img

By

Published : May 16, 2023, 6:09 PM IST

Major Movie Adivi Sesh

Major Movie Adivi Sesh : గతేడాది విడుదలైన 'మేజర్'​ సినిమా ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటోంది. అడివి శేష్​ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై తాజాగా భారత మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు అడివి శేష్​తో పాటు.. చిత్ర బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించారు. ఆ వివరాలు..

Major Movie Adivi Sesh : 26/11 ఉగ్రదాడుల్లో పోరాడి ప్రాణాలను అర్పించిన మేజర్​ సందీప్​ ఉన్నికృష్ణన్​ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్'. ఈ సినిమాలో సందీప్​ పాత్రలో అడివి శేష్ నటించారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. సినీ వర్గాల ప్రశంసలు అందుకుంది. దీంతో అడివి శేష్​కు పాన్​ ఇండియా లెవెల్​లో గుర్తింపు లభించింది. తాజాగా ఈ హీరోకు మరో అరుదైన గౌరవం దక్కింది. 'మేజర్'​ సినిమాపై భారత మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ప్రశంసలు కురిపించారు.​ ఈ మేరకు అడివి శేష్​తో పాటు చిత్ర బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించారు. మంగళవారం ఆయన నివాసంలో కోవింద్​ను కలిసిన అడివి శేష్.. ఆ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

'గౌరవనీయులైన మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌జీని కలవడం విశేషం. 'మేజర్‌' సినిమాపై ఆయన స్పందించిన తీరుతో పొంగిపోయాను. ఆయనతో మంచి సంభాషణ జరిగింది. త్వరలో మేజర్​ మొదటి వార్షికోత్సవం జరగనుంది. ఇప్పటికీ మేజర్​ సందీప్​ ఉన్నికృష్ణన్​ మమ్మల్ని ఆశీర్వదిస్తునే ఉన్నారు. ఎప్పటికీ కృతజ్ఞతలు' అని ట్విట్టర్​లో పోస్టు చేశారు అడివి శేష్​.
అడివి శేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించింది మేజర్' సినిమా. దీంతో ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్​, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిత్ర బృందాన్ని కొనియాడారు.

Major Movie Adivi Sesh
మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో అడివి శేష్​

మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందిన 'మేజర్‌' గతేడాది జూన్‌ 3న తెలుగుతో పాటు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు.. మేజర్‌ సందీప్‌గా నటించడంతో పాటు.. చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చారు కథానాయకుడు అడివి శేష్‌. శశికిరణ్‌ తిక్క దర్శకుడు. ప్రముఖ కథానాయకుడు మహేశ్​ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఇండియా సంస్థ నిర్మించింది.

మేజర్‌ సందీప్‌ బాల్యం, యవ్వనంతో పాటు భారతసైన్యంలో ఆయన అనుభవాలు, ముంబయి దాడుల ఘటనలో చేసిన సహసాలు, త్యాగం వరకు ఆయన జీవితానికి సంబంధించిన విభిన్న కోణాల్ని ఈ చిత్రంతో ఆవిష్కరించారు. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్‌, ప్రకాష్‌రాజ్‌, రేవతి, మురళీశర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్‌ పాకాల స్వరాలు సమకూర్చారు.

Major Movie Adivi Sesh
మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో మేజర్​ చిత్ర బృందం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.