ETV Bharat / entertainment

డైలాగ్‌ లేకుండానే చిరంజీవి సీన్‌.. ఎక్స్​ప్రెషన్స్​తోనే అదరగొట్టేశారుగా!

author img

By

Published : Apr 5, 2023, 8:57 AM IST

'చూడాలని ఉంది' చిత్రంలోని చిరంజీవి-అంజలా ఝవేరిల మధ్య వచ్చే రైల్వేస్టేషన్‌ లవ్‌ సీన్‌ గురించి దర్శకుడు గుణశేఖర్‌ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ఆ సంగతులు..

Chiranjeevi about gunashekar
డైలాగ్‌ లేకుండానే చిరంజీవి సీన్‌.. ఎక్స్​ప్రెషన్స్​తోనే అదరగొట్టేశారుగా!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో గుణశేఖర్ ఒకరు. ఈయన చేసిన సినిమాలు తక్కువే అయినా అందులో చాలా వరకు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమాలు చేసేందుకు గుణశేఖర్ ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అయితే ఆయన దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి హీరోగా తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్ మూవీ 'చూడాలని ఉంది'. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలో చిరు-అంజల ఝవేరిల మధ్య వచ్చే రైల్వేస్టేషన్‌ లవ్‌ సీన్​ అప్పట్లో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఎంతో స్పెషల్‌గా నిలిచింది. చిరు, అంజలిల మధ్య డైలాగ్స్‌ లేకుండానే కేవలం ఎక్స్​ప్రెషన్స్​తో నడిచేలా ఆ సీన్‌ను అద్భుతంగా తెరకెక్కించి ఆకట్టుకున్నారు గుణశేఖర్‌. అయితే తాజాగా 'శాకుంతలం' ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన.. ఆ సీన్‌ వెనక ఉన్న ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

"చూడాలని ఉంది సినిమాలో.. రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించిన ఆ ప్రేమ సన్నివేశం దాదాపు పది నిమిషాల పాటు కొనసాగుతుంది. చిరంజీవికి ఆ సీన్​లో అసలు డైలాగ్‌లు ఉండవు. ఆయన ఆ రైల్వేస్టేషన్​లో చైర్‌ మీద కూర్చొని అమ్మాయిని చూస్తూ ఉంటారు. మెగాస్టార్​కు డైలాగ్​ లేకుండా ఒక నిమిషం పాటు సీన్​ను కొనసాగించడం మామూలు విషయం కాదు. అలాంటిది అంత సేపు చిత్రీకరించాం. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కావాలని నేను అడిగాను. దీంతో నిర్మాత అశ్వనిదత్‌ షాక్​ అయిపోయారు. ఎందుకంటే అప్పట్లో నాంపల్లి స్టేషన్‌ చాలా పెద్దది. అనేక రైళ్లు రాకపోకలు చేస్తుంటాయి. అందులోనూ మూడు రోజుల పాటు చిరంజీవిని పెట్టి చిత్రీకరించడమంటే చాలా కష్టమైన విషయం. పైగా ఆయనతో షూటింగ్‌ చేస్తున్నాం అంటే రైల్వేశాఖ అనుమతి కూడా ఇవ్వదు. ఎందుకంటే అక్కడ షూటింగ్‌ జరుగుతుంటే ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. రైళ్లు నిలిచిపోతాయి. టైమింగ్స్​ మారిపోతాయి. చివరికి అతి కష్టమ్మీద అనుమతి దక్కింది. అసలు ఆ సినిమా షూటింగ్‌ అప్పుడు చాలా మంది రైళ్లు ఎక్కకుండానే స్టేషన్‌లో ఉండిపోయారు" అని గుణశేఖర్‌ తెలిపారు.

ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి సరసన అంజలి ఝవేరి, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. అశ్వనిదత్‌ నిర్మాతగా వ్యవహరించారు. ప్రకాశ్‌రాజ్‌ విలన్​గా నటించి ఆకట్టుకున్నారు. మణిశర్మ అందించిన ప్రతి సాంగ్​ శ్రోతలను బాగా ఆకట్టుకుంది. 'రామ్మా చిలకమ్మా' పాట అయితే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిపోయింది. చిరంజీవికి ఇష్టం లేకపోయినా.. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని కాదని ఈ సాంగ్​ను ఉదిత్‌ నారాయణతో పాడించారు మణిశర్మ. అప్పుడది సూపర్​ హిట్​గా నిలిచింది. చిన్నోళ్ల నుంచి పెద్ద వారి వరకు అందరినీ ఆ పాట తెగ అలరించింది.

ఇదీ చూడండి: అల్లు అరవింద్ మాస్టర్​ ప్లాన్​.. అప్పుడు 'కాంతార'.. ఇప్పుడు 'విడుతలై'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.