Drishyam Korean Remake : కొరియాలో 'దృశ్యం' రీమేక్.. హీరోగా 'పారసైట్'​ నటుడు!

author img

By

Published : May 22, 2023, 8:31 AM IST

Updated : May 22, 2023, 9:37 AM IST

Drishyam Korea Remake

విడుదలైన అన్నీ భాషల్లోనూ సంచలనాలు సృష్టించిన 'దృశ్యం' సినిమా ఇప్పుడు కొరియన్​ వెర్షన్​లో రీమేక్​ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్​ కాకముందే ఓ రికార్డు సృష్టించింది. అదేంటంటే..

విడుదలైన అన్నీ భాషల్లోనూ సంచలనాలు సృష్టించిన సినిమా 'దృశ్యం'. మొదట్లో మలయాళంలో రిలీజైన ఈ సినిమా అదే పేరుతో తెలుగులో వచ్చి హిట్​ టాక్ అందుకుంది. ఇక హిందీలో 'దృశ్యం'గా, కన్నడలో 'దృశ్య'గా, తమిళంలో 'పాపనాశనం' పేరుతో తెరకెక్కి అన్నింటిలోనూ సత్తా చాటింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన 'దృశ్యం 2' కూడా బాక్సాఫీస్​ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ 'దృశ్యం' సిరీస్‌ కొరియన్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం కానుంది. దీని కోసం ప్రముఖ ఇండియన్‌ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్‌, దక్షిణ కొరియాకు చెందిన సంస్థ ఆంథాలజీ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 'కేన్స్‌ ఫెస్టివల్‌' వేదికగా అధికారికంగా ఈ ప్రకటన వెలువరించింది మూవీ టీమ్​. పారాసైట్ నటుడు సాంగ్ కాంగ్-హో ఈ చిత్రంలో నటించనున్నారు. కొరియన్‌ చిత్ర పరిశ్రమలో రీమేక్‌ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా 'దృశ్యం' రికార్డు సృష్టించింది.

ముందుగా.. 'దృశ్యం' సినిమాను మోహన్‌లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్‌ మలయాళంలో తెరకెక్కించారు. అయితే ఇదే సినిమాను తెలుగులో వెంకటేశ్‌ హీరోగా శ్రీప్రియ పార్ట్‌ 1 తెరకెక్కించగా, పార్ట్‌ 2ను జీతూ జోసెఫ్‌ రూపొందించారు. ఇక హిందీ దృశ్యంలో అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. వేర్వేరు దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక తమిళంలో కమల్‌హాసన్‌, గౌతమి ప్రధాన పాత్రధారులగా తెరపై కనిపించారు. ఇక ఈ సినిమా కొరియన్​ వెర్షన్​లో హీరో రోల్​లో 'పారసైట్' నటుడు సాంగ్‌ కాంగ్‌ హో కనిపించనున్నారు. ప్రముఖ కొరియన్ దర్శకుడు కిమ్‌ జీ ఊన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

మరోవైపు కొంతకాలంగా కొరియన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అక్కడి థ్రిల్లర్​, హార్రర్​ సినిమాలకు మూవీ లవర్స్​లో విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో క్రమ క్రమంగా కొరియన్ సినిమాలకు ఆడియన్స్ కూడా బాగానే పెరుగుతున్నారు. ప్రముఖ ఓటీటీలు సైతం ఈ సినిమాలను నేటివ్​ భాషల్లోకి డబ్​ చేసి వీక్షకులకు అందుబాటులో ఉంచుతున్నాయి. ఇండియన్​ డైరెక్టర్స్​ కొంత మంది కొరియన్ సినిమాల రీమేక్ రైట్స్ తీసుకొని ఇక్కడ నిర్మిస్తున్నారు. మన తెలుగులో 'ఓ బేబీ', 'శాకిని డాకిని'.. లాంటి సినిమాలు కొరియన్ రీమేక్స్​గా తెరకెక్కినవే.

ఇక దృశ్యం సినిమా విషయానికి వస్తే.. అనుకోకుండా జరిగిన ఓ హత్య చుట్టూ సాగే కుటుంబ కథలు ఇవి. ఈ సినిమాలో హీరో తన తెలివి తేటల్ని ఉపయోగిస్తూ పోలీసుల చేతికి దొరక్కుండా తన కుటుంబాన్ని ఎలా కాపాడాడన్నది ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు మలయాళంలో 'దృశ్యం 3'గా రానుంది.

Last Updated :May 22, 2023, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.