Director Sharath: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు పోలవరపు శరత్ కన్నుమూశారు. 72 ఏళ్ల శరత్.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో శరత్ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శరత్ మరణం పట్ల దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలకృష్ణ సంతాపం: దర్శకుడు శరత్ మృతి పట్ల నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని ప్రకటించారు. చిత్ర పరిశ్రమలో శరత్ తనకు మంచి మిత్రుడు, ఆప్తుడని గుర్తుచేసుకున్న బాలకృష్ణ.. ఆయనను కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. శరత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. శరత్ కుటుంబసభ్యులకు బాలకృష్ణ సానుభూతి తెలిపారు. నందమూరి బాలకృష్ణతో 'వంశోద్ధారకుడు', 'సుల్తాన్' చిత్రాలను తెరకెక్కించి ప్రత్యేకత చాటుకున్నారు. 'చాదస్తపు మొగుడు', 'పెద్దింటి అల్లుడు', 'సూపర్ మొగుడు', 'బంధువులు ఉన్నారు జాగ్రత్త' సహా 10కిపైగా చిత్రాలకు శరత్ దర్శకత్వం వహించారు.
ఇదీ చదవండి: అన్నయ్య అలా ఎందుకయ్యారంటే..?