RRR movie: '30కి పైగా స్వరాలు.. 19 నెలల దీక్ష.. 'నాటు నాటు' పాట'

author img

By

Published : Jan 11, 2023, 4:17 PM IST

Chandra Bose Naatu Naatu Song Interview

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌.. ఇండస్ట్రీలో ఇద్దరు టాప్‌ డ్యాన్సర్లు మీరు రాసే పాటకు డ్యాన్స్‌ చేస్తారు. మీరు రాసే పాట ఎలా ఉండాలో ఇక మీ ఇష్టం. ఇదీ 'నాటు నాటు' పాట రాసేందుకు వెళ్లిన రచయిత చంద్రబోస్‌కు రాజమౌళి చెప్పిన మాట. 'నాటు నాటు' పాట గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం దక్కించుకున్న సందర్భంగా.. ఆ పాటతో ప్రయాణం గురించి చంద్రబోస్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ సంగతులు..

ఆర్​ఆర్​ఆర్​కు గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్​ రావడంపై​ చంద్రబోస్​ హర్షం

ఆర్​ఆర్​ఆర్​లోని నాటు నాటు పాటకు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై.. ఈ పాట రచయిత చంద్రబోస్​ హర్షం వ్యక్తం చేశారు. ఈ పాటకు చిత్ర బృందం ఏ విధంగా కష్టపడిందో ఆయన వివరించారు. ఇక ఈ ఘనతను సాధించినందుకు, పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ పాటకు సంగీత దర్శకుడు కీరవాణి 30కి పైగా స్వరాలు సమకూర్చారని, 19 నెలల పాటు తపస్సులా ఈ గీతం రాశానని వివరించారు.

"తెలుగు పాటలు కచ్చితంగా ప్రపంచ నలుమూలల్లో వెలుగుతుంది, నిలుస్తుంది అని అనుకునే వాడ్ని. అనుకున్నట్లుగానే నాటు నాటు పాటతో ఈ రోజు అది నెరవేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీంతో నా ఊహ, నమ్మకం రెండూ నిజం అయ్యాయి. ఆర్ఆర్​ఆర్ లోని ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించింది. అందరూ దీన్ని పాడుకున్నారు. అలాగే స్టెప్పులూ వేశారు. పాట పట్ల ప్రతి ఒక్కరూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. నిజంగా ఈ పాటకు పురస్కారం వస్తుందని నేనైతే అస్సలు ఊహించలేదు. ఈ సందర్భంగా ఈ పాట రాసేందుకు నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ పాట రాయటానికి 19 నెలలు సమయం పట్టింది నాకు. ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, నిజయతీతో కృషి చేసి ఈ పాట రాశాను. ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా గాయకులు రాహుల్​ సిప్లిగంజ్​, కాలభైరవ గాత్రం అందించారు. అలాగే ఈ పాటను కొరియెగ్రాఫ్​ చేసిన ప్రేమ్​ రక్షిత్​ మాస్టర్​ .. వీరందరితో పాటు పాత్రల్లో ఎంతో లీనమై అద్భుతంగా డ్యాన్స్​ వేసిన రామ్​ చరణ్​, ఎన్టీఆర్​ ప్రతిభకు అభినందనలు. ఇకపోతే ఈ పాటలో అందరికీ భాగం ఉంది. ఈ పాటలో సినిమా యూనిట్​లోని ప్రతి ఒక్కరి కృషి ఉంది. ఈ సందర్భంగా అందరికి ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ పాట రాయడానికి ముందు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు రాజమౌళి, కీరవాణి గారు. కాకపోతే పాట రూపకల్పనలో బ్రిటిష్​ వారిని కించపరిచే విధంగా లిరిక్స్​ ఉండకూడదు అని నిబంధన పెట్టారు. మనం మన గొప్పతనం, పౌరుషం, ఠీవీ చాటిచెప్పాలి అని చెప్పారు. తర్వాత కారులో ప్రయాణిస్తున్న సమయంలో నా మనసులో ఓ హుక్​ లైన్​ తట్టింది.. అదే నాటు నాటు ఊర నాటు, నాటు నాటు వీర నాటు, నాటు నాటు పరమ నాటు, నాటు నాటు పచ్చి నాటు. ఇక వెంటనే ఫోన్​ తీసి రికార్డ్​ చేశాను. ఇంటికి వచ్చి పాట మొత్తం రాసుకొని మరుసటి రోజు కీరవాణి, రాజమౌళి గారికి వినిపించాను. అది విని ఇద్దరూ నన్ను మెచ్చుకున్నారు. ఇక అక్కడి నుంచి ఈ పాటపై కసరత్తు ప్రారంభమైంది. ఈ పాటను 30-35 రకాలుగా కీరవాణి గారు స్వరపరిచారు. 90 శాతం పాట ఆరంభంలోనే అయిపోయింది. ఇక పాటలో మార్పులు చేర్పులు చేయడానికి నాకు 19 నెలల సమయం పట్టింది. ఎంతో ఓపికతో, సహనంతో పాటను పూర్తి చేశాను. నా కోరిక ఏంటంటే బాహుబలి సినిమాల్లో ఎలాగో పాటలు రాసే అవకాశం నాకు రాలేదు. వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని వాళ్ల(రాజమౌళి, కీరవాణి) దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలన్న ఒక్కటే లక్ష్యంతో ఈ పాటకు మెరుగులు దిద్దాను. అలాగే ప్రపంచం దృష్టిలో కూడా నాకు మంచి పేరు రావడం అన్నది మనం నిజాయతీతో చేసిన దైవ ప్రార్థన, తప్పస్సులా భావిస్తున్నాను" అని చంద్రబోస్​ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.