ETV Bharat / entertainment

సినిమాల మధ్య విరామం రావడానికి కారణం ఇదే: అల్లు శిరీష్‌

author img

By

Published : Nov 6, 2022, 8:58 AM IST

allu sirish
అల్లు శిరీష్‌

తనదైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ కథానాకుడు అల్లు శిరీష్‌. ఆయన నటించిన కొత్త మూవీ 'ఊర్వశివో రాక్షసివో' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా అల్లు శిరీష్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ సంగతులు..

"హారర్‌ థ్రిల్లర్‌ సినిమాలైతే తప్ప... హాస్యం లేకుండా తెలుగు ప్రేక్షకుడికి కథ చెప్పకూడదు. మాతృకలో లేని వినోదాన్ని మేం ప్రత్యేకంగా మేళవించి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది" అన్నారు అల్లు శిరీష్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఊర్వశివో రాక్షసివో' . తమిళంలో విజయవంతమైన 'ప్యార్‌ ప్రేమ కాదల్‌'కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. రాకేష్‌ శశి దర్శకత్వం వహించారు. చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా అల్లు శిరీష్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

"కథ బాగా ప్రేరేపిస్తే తప్ప నేను సినిమా చేయను. సినిమా సినిమాకీ మధ్య విరామం రావడానికి కారణం అదే. రాకేష్‌ శశి, నేను కలిసి సినిమా చేయడం కోసం రెండు మూడుసార్లు కథాచర్చలు కూడా జరిగాయి. కానీ ఆ కథలు కుదరలేదు. 'ఊర్వశివో రాక్షసివో' పట్టాలెక్కడానికి కారణం మా నాన్న. 'ప్యార్‌ ప్రేమ కాదల్‌' ఆయనకి బాగా నచ్చింది.

ఇప్పుడు యువతరం ఇలాగే ఉంటుంది కదా, ఈ కాన్సెప్ట్‌ చాలా బాగుందంటూ సినిమా గురించి పదే పదే చెప్పేవారు. నీకు బాగుంటుందని కూడా నాతో అన్నారు. దాంతో ఆ సినిమాని చూశా. సినిమా చూసినవాళ్లంతా నవ్వుకున్నాం, బాగుందంటూ మెచ్చుకోవడం సంతృప్తినిచ్చింది".

"మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీకుమార్‌ అనే యువకుడి పాత్రలో ఒదిగిపోయావని అభినందిస్తున్నారంతా. అయితే ఆ పాత్ర చేయడానికి తెలుగులో చాలామంది యువ హీరోలే కనిపిస్తారు, కానీ సింధూజ పాత్రలో మాత్రం అను ఇమ్మాన్యుయేల్‌ని తప్ప మరొకరిని ఊహించలేం. తన పాత్రలాగే స్వతంత్య్ర భావాలు, మొండితనం ఉన్న అమ్మాయి తను. అందుకే పాత్రలో అంతగా ఒదిగిపోయిందేమో. మా నాన్న కూడా సినిమా చూశాక అను నటనని మెచ్చుకున్నారు.

'నా పేరు సూర్య...' సమయంలో కానీ, అంతకుముందు కానీ ఎప్పుడూ ఇంత అందంగా కనిపించలేదు, ఇందులో చాలా బాగుందన్నారు. శ్రీ కుమార్‌ పాత్ర విషయంలోనైనా, అనుతో కెమిస్ట్రీ పండటంలోనైనా సెట్స్‌కి వెళ్లడానికి ముందు మేం చేసిన ముందస్తు సన్నాహాలే. అమాయకమైన కుర్రాడిగా నటించాలన్నప్పుడు ఆ తరహా పాత్రల్ని చూడటం కాకుండా, నిజ జీవితంలోని వ్యక్తుల్ని గమనించి చేయాలనుకున్నా. ఆ పాత్రలాగే మా కజిన్‌ ఒకరుంటారు. తనకి తెలియకుండానే వీడియోలు తీసి అందుకు తగ్గట్టుగా నటించా".

"రొమాంటిక్‌ సన్నివేశాల విషయంలో మాలో ఎలాంటి సందేహాలు లేవు. వీటిని కవితాత్మకంగా తెరపైకి తీసుకొచ్చాం తప్ప, ఎక్కడా అసభ్యంగా ఉండవు. నాకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉంది. సహజీవనం నది అయితే, పెళ్లి అనేది సముద్రం అనేది నా అభిప్రాయం. సహజీవనంతో ప్రయాణం మొదలుపెట్టి పెళ్లి చేసుకోవడాన్ని ఇష్టపడతా. నా పెళ్లి విషయంలో ఇంట్లో ఒత్తిడేమీ లేదు. పెళ్లనేది కూడా హిట్‌ సినిమాలాంటిదే. దానంతట అదే రావాలి తప్ప, మనం అనుకుంటే కాదు".

"పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలంటారు కదా. నా తొలి సినిమా 'గౌరవం' సామాజికాంశంతో కూడిన కథ. అప్పుడప్పుడే కాలేజీ నుంచి వచ్చిన నేను నా ఆలోచనలకి తగ్గట్టే ఆ కథని ఎంపిక చేసుకుని నటించా. కానీ అలాంటి కథని ఇప్పుడు చేయాల్సిందని చెబుతుంటారు. నేనూ అదే ప్రయత్నంలో ఉన్నాను. కరోనా తర్వాత సినిమాల్ని థియేటర్లో చూడదగ్గదా లేక ఓటీటీల్లో చూసేదా? అని ఆరా తీశాకే ప్రేక్షకుడు ఓ నిర్ణయానికొస్తున్నాడు. రొమాంటిక్‌ కామెడీ సినిమాలకి ఇదివరకు ఓ మార్కెట్‌ ఉండేది.

ఇప్పుడది ఓటీటీ జోనర్‌ అయ్యింది. సింపుల్‌ డ్రామాలు, పాత్ర ప్రధానమైన కథలు ఓటీటీల్లోనే చూస్తున్నారు. 'కాంతారా' తరహా కొత్త నేపథ్యాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధానంగా సాగే చిత్రాలు, అగ్ర తారల సినిమాలే థియేటర్లకి ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. తదుపరి చేయనున్న సినిమాల కోసం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి". అని తెలిపాడు.

ఇదీ చదవండి: బ్లాక్​ ఔట్​ఫిట్​లో బ్యూటీల అందాల జాతర చూశారా

'నా మాటకు సెట్​లో గౌరవం లేదు.. మనీ చెక్​లు, డాక్యుమెంట్లు పంపించేశా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.