ETV Bharat / entertainment

బుల్లితెరపై అనిల్​ రావిపూడి, నటి స్నేహ సందడి.. ఆ షోకు స్పెషల్​ జడ్జ్​గా

author img

By

Published : Oct 11, 2022, 6:32 AM IST

తెలుగు తెరపై గుర్తుండిపోయే ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయిన నటి స్నేహ.. బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఈటీవీలో ప్రసారం కానున్న సరికొత్త రియాలిటీ షో 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఒకరికి ఒకరు'కు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఈమెతో పాటే దర్శకుడు అనిల్​రావిపూడి కూడా ఈ కార్యక్రమాంలో స్పెషల్​ జడ్జిగా కనిపించనున్నారు.

Sneha Etv reality show
బుల్లితెరపై అనిల్ రావిపూడి స్నేహ.

తెలుగుదనం ఉట్టిపడే అందం స్నేహ సొంతం. బాపు బొమ్మగా మెరిసిన ఆమె తెలుగు తెరపై గుర్తుండిపోయే ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయారు. కథానాయికగా... సహనటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన స్నేహ బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు. ఈటీవీలో ట్రెండీగా రాబోతున్న సరికొత్త రియాలిటీ షో 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఒకరికి ఒకరు'. ఈ షోకి స్నేహతో పాటు శివబాలాజీ న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. నేటి నుంచి ప్రారంభం అవుతుంది. ప్రతి మంగళవారం రాత్రి 9.30నిమిషాలకు ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌' షో గురించి స్నేహ చెప్పిన విషయాలను తెలుసుకుందాం..

ఏ విషయం నచ్చి 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌' రియాలిటీ షోకి న్యాయ నిర్ణేతగా చేస్తున్నారు?
మన సంస్కృతి, ప్రేమ, పెళ్లి, సరసం, కుటుంబం, భావోద్వేగాలు... ఇలా అన్నీ కలగలిసిన షో ఇది. ఈ కాన్సెప్ట్‌ నచ్చే న్యాయ నిర్ణేతగా చేయడానికి ముందుకొచ్చా. దీనికి ముందు చాలా యేళ్ల కిందట కొన్ని షోలకి జడ్జ్‌గా చేశా. చాలా విరామం తర్వాత మళ్లీ తెలుగులో చేస్తున్న షో ఇదే. కచ్చితంగా తెలుగు టెలివిజన్‌ ప్రస్థానంలో ఇదొక విభిన్నమైన షో అవుతుందని నా నమ్మకం.

రియాలిటీ షో అనగానే చాలా మందికి మెలోడ్రామా సంఘటలనే గుర్తుకొస్తాయి. ఈ షోలో కూడా అలాంటి డ్రామాని ఏమైనా మేళవిస్తున్నారా?
రియాలిటీ షో ఇది. రియల్‌గానే ఉంటుంది తప్ప, అదనంగా ఎలాంటి స్క్రిప్ట్‌ ఉండదు. షోలో పాల్గొన్న జంటలు ఆయా టాస్క్‌లు చేస్తూ ఎలాంటి అనుభూతికి గురవుతారో, వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో అదే ఈ షో. ప్రేక్షకులు కూడా అదే చూస్తారు.

కపుల్స్‌ షో అనగానే ఆటలు పాటలే అనే అభిప్రాయం కలుగుతుంది. ఇందులో ప్రేక్షకుడికి నచ్చే విషయాలేమిటి?
సినిమా, టెలివిజన్‌ లక్ష్యం వినోదమే. దానికి తోడుగా ప్రేక్షకుడికి ఇంకా మంచి విషయాలు ఏం చెప్పొచ్చో ఆలోచించి డిజైన్‌ చేసిన షో ఇది. షోలో పాల్గొంటున్న జంటలన్నీ నిజ జీవితాల్లో భార్యాభర్తలే. ఈ ప్రయాణంలో వాళ్లకంటూ స్వీయానుభవాలు కొన్ని ఉంటాయి. అవి చెబుతున్నప్పుడు ప్రేక్షకులు కూడా అన్వయించుకొనే అవకాశం ఉంటుంది. మనకు కూడా ఇలాగే జరిగింది కదా, మనం కూడా ఇలా చేయొచ్చు కదా అనే అభిప్రాయాలు తప్పకుండా కలుగుతాయి. దాంతో ప్రతి ఒక్కరూ ఈ షోతో కనెక్ట్‌ అవుతారనేది నా నమ్మకం. మనం కూడా అలా ప్రపోజ్‌ చేయొచ్చు, అలా ప్రేమించొచ్చు, అలా డ్యాన్స్‌ చేయొచ్చు, జీవిత భాగస్వామిని ఇలా సంతోష పెడితే జీవితం ఇంత అందంగా ఉంటుంది కదా అనే అభిప్రాయాల్ని కలగజేసే షో ఇది. ఇప్పుడందరిదీ యాంత్రికమైన జీవితం. పెళ్లయిన పదేళ్ల తర్వాత కూడా జీవితంలో చెప్పుకోదగ్గ విషయాలు కనిపించవు. ఇదే జీవితం కాదు, ఇంతకుమించిన విషయాలు చాలా ఉన్నాయని గుర్తు చేస్తూ సరదాలు, సంతోషాల్ని పంచుతుందీ షో. ప్రేక్షకులకే కాదు, షోలో పాల్గొంటున్న జంటలు కూడా వాళ్ల వాళ్ల వృత్తుల్లో తీరిక లేకుండా గడుపుతున్నవాళ్లే. ఈ షోలో పాల్గొంటూ వాళ్లు కూడా నా భాగస్వామి నా గురించి ఇంత లోతుగా ఆలోచిస్తుందా? అందులో అంత ప్రేమ ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఈ షోలో పాల్గొంటూ మీరంతా కలిపి గడిపే సమయం మరింత పెరుగుతుందని చెప్పా.

మీ నిజ జీవిత అనుభవాలు ఈ షోకి ఎంత వరకు ఉపయోగపడుతున్నాయి?
ఇప్పుడే మొదలు పెట్టాం షో. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అప్పుడప్పుడూ నా నిజ జీవిత అనుభవాల్ని కూడా పంచుకుంటున్నా. ఇంట్లో కొన్ని విషయాలకి నేనెలా స్పందిస్తాను? దానికి నా భర్త ఎలా స్పందిస్తుంటారో పంచుకుంటున్నా. న్యాయ నిర్ణేతలుగా మేం ఎక్కడా భార్యాభర్తల్ని జడ్జ్‌ చేయడం లేదు. ఆ జంటతో పోలిస్తే ఈ జంట ఎలా చేసింది? మన సంప్రదాయాల్ని ఎవరెలా అర్థం చేసుకున్నారనేదే చూస్తున్నాం.

మార్కుల విషయంలో శివబాలాజీ, మీరూ మాట్లాడుకుని ఇస్తారా?
నేను ఒకరి గురించి ఏం అనుకుంటానో అదే చెబుతుంటాను, వాళ్లకి నేనెంత మార్కులు ఇవ్వాలో అంతే ఇస్తాను. శివ బాలాజీ కూడా అంతే. కానీ మార్కులు మాత్రం ఎవరెవరం ఎంత ఇస్తున్నామో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. శివబాలాజీ చాలా సరదా వ్యక్తి. ఇందులో భాగమైన అనిల్‌ రావిపూడి కూడా అంతే. ఆడవాళ్లతో కష్టం అంటుంటారు కానీ... ఇద్దరికీ మహిళలంటే గౌరవం.

చివరిగా మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గురించి ఒక్క మాటలో...
ఒకరికి ఒకరు... అదే మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అంటే.

ఈ షోకు స్పెషల్‌ జడ్జిగా ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి వ్యవహరించనున్నారు. ఈ షోలో పాల్గొంటున్న జంటలు అందరూ బుల్లితెరపై అందరికీ సుపరిచితులే. ఈ షోలో పాల్గొంటున్న పది జంటల్లో విజేతగా నిలిచినవారు ఫైనల్‌కి వెళ్లి గ్రాండ్‌ ఫినాలే టైటిల్‌తో పాటు భారీ ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

పోటీలో పాల్గొంటున్న జంటలు రవికిరణ్‌-సుష్మా, పవన్‌-అంజలి, సందీప్‌-జ్యోతి, హ్రితేష్‌-ప్రియ, శ్రీవాణి-విక్రమ్, మధు- ప్రియాంక, ప్రీతమ్‌-మానస, సిద్ధు-విష్ణుప్రియ, రాకేష్‌-సుజాత, విశ్వ- శ్రద్ధ

ఇదీ చూడండి: పునీత్ ఆఖరి చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుక.. గెస్ట్​లుగా చిరు, రజినీ, బిగ్​బీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.