అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు పుట్టారు.. ఒకే రోజు మరణించారు..!

author img

By

Published : Jun 23, 2022, 9:19 AM IST

Brothers Died

Brothers Died: వారిద్దరూ అన్నదమ్ముల కుమారులు.. ఒకే రోజు పుట్టారు.. ఒకేరోజు కన్నుమూశారు. ఒకే తరగతిలో చదువుతున్న ఈ చిన్నారులు కాలకృత్యాల కోసం బడి సమీపంలోని నీటి గుంత వద్దకెళ్లి ప్రమాదవశాత్తు అందులోపడి మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. తెలంగాణలోని మెదక్‌ జిల్లా కొల్చారం మండలం కొంగోడ్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Brothers Died: తెలంగాణలోని మెదక్​ జిల్లా కొల్చారం మండలం కొంగోడ్​కు చెందిన షేకులు, లాలయ్య అన్నదమ్ములు. షేకులు దంపతులకు ఇద్దరు కుమారులు. లాలయ్య దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. షేకులు కుమారుడు అజయ్‌, లాలయ్య కుమారుడు నర్సింలు 2013 మే 22న జన్మించారు. కొంగోడ్‌ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. వారిద్దరూ మధ్యాహ్న భోజనం అనంతరం విరామ సమయంలో పాఠశాలకు సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న నీటి గుంత వద్దకు వెళ్లారు.

అజయ్‌, నర్సింలు ఎంతకూ రాకపోయేసరికి మిత్రుడు లక్ష్మణ్‌ వెళ్లి చూసేసరికి పిల్లలిద్దరూ నీటిలో మునిగిపోతూ అరుస్తున్నారు. లక్ష్మణ్‌ పరుగెత్తుకెళ్లి ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు నవీన్‌కుమార్‌కు చెప్పాడు. హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి కొన ఊపిరితో ఉన్న అజయ్‌ను బయటకు తీసి మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించాడు. పోలీసులు, గ్రామస్థుల సాయంతో గుంతలో నుంచి నర్సింలు మృతదేహం వెలికితీశారు. లాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. బడికి ప్రహరీ నిర్మించినా, సరైన శౌచాలయ సౌకర్యం ఉన్నా.. బాలలు చనిపోయేవారు కాదని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అంటున్నారు.

.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.