ETV Bharat / crime

MURDER in Bhuvanagiri : పరువు హత్యా..? రియల్ ఎస్టేట్ హత్యా..??

author img

By

Published : Apr 17, 2022, 3:36 PM IST

MURDER in Bhuvanagiri : పరువు హత్యా..? రియల్ ఎస్టేట్ హత్యా..??
MURDER in Bhuvanagiri : పరువు హత్యా..? రియల్ ఎస్టేట్ హత్యా..??

యాదాద్రి భువనగరి జిల్లాకు చెందిన వ్యక్తి.. ఇంటి నుంచి వెళ్లిన రెండు రోజుల తర్వాత సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం లకుడారంలో విగతజీవిగా లభ్యమయ్యాడు. స్థల వివాదాలే అతడి ప్రాణం తీశాయా..? లేక.. రెండేళ్ల క్రితం చేసుకున్న ప్రేమ వివాహమే బలి తీసుకుందా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


యాదాద్రి భువనగిరి వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ.. గతంలో యాదగిరిగుట్టలో హోంగార్డుగా పని చేసేవాడు. గుప్తనిధుల కేసులో సస్పెండ్​ అయ్యాడు. యాదగిరిగుట్టలో హోంగార్డుగా పనిచేస్తున్న సమయంలో(రెండేళ్ల కిందట) రామకృష్ణకు.. గౌరాయిపల్లికి చెందిన వెంకటేశ్వర్లు(రాజపేట మండలంలో వీఆర్​వో) కూతురు భార్గవితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. రామకృష్ణ గౌడ సామాజిక వర్గానికి చెందిన వాడు కాగా.. భార్గవి ముదిరాజ్​ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఈ కారణంగా వీరిద్దరి పెళ్లికి భార్గవి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో.. 2020లో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు.

వివాహం తరువాత.. కొన్ని రోజులకు భార్గవి, రామకృష్ణను వెతికి పట్టుకున్న అమ్మాయి తరఫువాళ్లు మాట్లాడారు. ఆ సమయంలో రామకృష్ణతోనే ఉంటానని.. భార్గవి తెగేసి చెప్పింది. తన తండ్రి ఆస్తిలో వాటా కూడా అడగనని ఓ పత్రంపై రాతపూర్వకంగా స్పష్టం చేసింది. అప్పటి నుంచి అంతా బాగానే ఉంది. 8 నెలల క్రితం భువనగిరి పట్టణంలోనే ఓ గదిని అద్దెకు తీసుకొని సంతోషంగా నివసిస్తున్నారు. వాళ్లిద్దరికి ఓ పాప కూడా పుట్టింది.

ఈ మధ్యే రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. కాగా.. శుక్రవారం(ఏప్రిల్ 15) సాయంత్రం లతీఫ్ అనే వ్యక్తితో రామకృష్ణ ఇంటి నుంచి వెళ్లినట్లు భార్య భార్గవి తెలిపారు. శనివారం ఉదయం వరకు రామకృష్ణ ఇంటికి రాకపోవటం.. ఎన్నిసార్లు ఫోన్​ చేసినా సమాధానం లేకపోవటం వల్ల ఆందోళనతో.. పొలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన భువనగిరి పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈరోజు(ఏప్రిల్​ 17) సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారంలో ఓ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఆరా తీయగా.. గుర్తుతెలియని వ్యక్తులు రామకృష్ణ గౌడ్​ని చంపి శవాన్ని లకుడారంలో పడేసినట్టు తెలిసింది.

అయితే.. ఈ హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ స్థలం విషయంలో ఇంటి నుచి బయటకు వచ్చిన రామకృష్ణ.. రియల్​ ఎస్టేట్​ లావాదేవీల వివాదంలో ఎవరైనా చంపేశారా..? లేక ప్రేమ వ్యవహారంలో తన మామ హత్య చేయించాడా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం.. భార్గవి వాళ్ల తండ్రి వెంకటేశ్వర్లు యాదగిరిగుట్టలోనే నివాసం ఉంటూ రాజపేట మండలంలో వీఆర్​వోగా విధులు నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి:

Rape: గురజాలలో దారుణం.. రెండేళ్ల కొడుకు ముందే తల్లిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.