ETV Bharat / city

అమరావతికి నిప్పుపెట్టి జగన్ పబ్జీ ఆడుతున్నారు: తెదేపా నేతలు

author img

By

Published : Aug 1, 2020, 3:24 PM IST

tdp leaders  fires on 3 capitals decison
tdp leaders fires on 3 capitals decison

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఆమోదిస్తూ గవర్నర్‌ సంతకం చేయడాన్ని తెదేపా నేతలు ఖండించారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జగన్‌ తన నియంతృత్వ వైఖరిని నెగ్గించుకొని ప్రజల భవిష్యత్తును అగాధంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ తమ నివాసాల వద్ద తోచిన రీతిలో తెదేపా నేతలు నిరసనలు తెలిపారు.

నిండు శాసనసభలో రాజధానిగా అమరావతికి వైకాపా, భాజపా మద్దతు తెలిపాయని సోమిరెడ్డి గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు రాజధానులు చేయాలనే ఆలోచనతోనే ఉన్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆక్షేపించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తానని చెప్పి ఎన్నికలు ముగిసి ముఖ్యమంత్రి అయిన తరువాత మాటా మార్చారని ఆరోపించారు.

మూడు రాజధానులు ప్రజావ్యతిరేక నిర్ణయమని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను ప్రభుత్వమే నిలబెట్టకపోవటం తగదని ఆయన హితవు పలికారు. దేశమంతా కరోనా విపత్తుపై దృష్టి సారిస్తే ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల మనోభావాలు గౌరవించడం అందరి బాధ్యత అని అశోక్‌గజపతిరాజు అన్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించిన గవర్నర్ రాష్ట్రాన్ని నిట్టనిలువునా దహనం చేశారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. అమరావతి అంగుళం కూడా కదలదన్న భాజపా పెద్దలు ఇప్పుడేం సమాధానం చెప్తారని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అమరావతికి నిప్పుపెట్టి పబ్జీ ఆడుకుంటూ, పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు.

కులపిచ్చితో కొందరు స్వార్థపరులు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యారని తెదేపా నేత గొల్లపల్లి సూర్యారావు మండిపడ్డారు. భూములిచ్చిన రైతులు, ఆడబిడ్డల ఘోష, ఆర్తనాదాలు వినపడటం లేదా అని ప్రశ్నించారు. రాష్టప్రభుత్వం చేసే తప్పులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని వారు తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నారని సూర్యారావు మండిపడ్డారు.

ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి తీరని అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విమర్శించారు. పదే పదే మాట తప్పను మడమ తిప్పనని చెప్పే జగన్... ఎన్నికల ముందు చెప్పిందేంటి ఇప్పుడు చేసిందేంటని నిలదీశారు. మడమ ఎందుకు తిప్పారో జగన్ సమాధానం చెప్పాలని బోడె డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో వైకాపాకు అదే గతి పడుతుందని ధ్వజమెత్తారు. మూడు రాజధానులంటున్న జగన్, రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులను పెడతారా అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిలదీశారు.

మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని కూకటివేళ్లతో పెకలిస్తుంటే, భాజపా నేతలు ఎలా సహిస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కూడా రాజధాని మహిళలకు మద్ధతుగా పోరాడాలని అనిత కోరారు. వైకాపా ప్రభుత్వ తీరును తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన హస్తిన పెద్దలు వేరే చేత్తో గవర్నర్ ద్వారా రెండో పోటు పొడిచారని ఆరోపించారు. వీరందరికి కాలం చెల్లె రోజులు దగ్గర్లోనే ఉన్నాయనడంలో అనుమానం లేదని గోరంట్ల అన్నారు. 'వినాశకాలే విపరీత బుద్ధి' అని గోరంట్ల విమర్శించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలోకి వచ్చేవారికి సడలింపు... ఆటోమేటిక్ ఈ-పాస్​తో ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.