ETV Bharat / city

'అవసరమైతే పస్తులుంటాం కానీ.. బీసీలెవ్వరూ ఆత్మాభిమానాన్ని చంపుకోరు'

author img

By

Published : Apr 11, 2022, 1:41 PM IST

Updated : Apr 11, 2022, 4:19 PM IST

తెదేపా బీసీ సెల్​ సమావేశం
tdp bc cell on ysrcp

TDP BC Cell Leaders on CM Jagan: ముఖ్యమంత్రి జగన్​.. బీసీలను అన్ని విధాలా మోసంచేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. తెదేపా హయాంలో బీసీలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని.. బలహీనవర్గాల నిధులను దారిమళ్లించిన ఘనత వైకాపాకే దక్కుతుందన్నారు. అవసరమైతే పస్తులుంటాం తప్పా.. ఆత్మాభిమానాన్ని చంపుకుని బీసీలెవ్వరూ జగన్​కు దాసోహం అనరని స్పష్టం చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ బీసీ సెల్​ సమావేశం జరిగింది.

TDP Bc cell Comments on ap New Cabinet: బీసీలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చింది తెదేపా ప్రభుత్వ హయాంలోనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బలహీనవర్గాలను సీఎం జగన్‌ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని ఆరోపించారు. బలహీనవర్గాల నిధులను దారిమళ్లించిన ఘనత వైకాపాకు దక్కుతుందని ఆరోపించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన బీసీ నేతల సదస్సులో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, ఇతర బీసీ నాయకులు హాజరయ్యారు.

వైఎస్‌ కుటుంబానికి బీసీలంటే కోపం: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి బలహీనవర్గాలంటే కోపమని అచ్చెన్నాయుడు విమర్శించారు. నాడు వైఎస్‌ పైసా నిధులు కూడా కేటాయించకుండా బీసీ ఫెడరేషన్లను పెట్టారని.. నేడు బీసీ కార్పొరేషన్ల నిధులు కూడా జగన్‌ లాక్కుని మోసగించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చకు సిద్ధమా? అని అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ముగ్గురికి పంచారని.. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని నిలదీశారు.

బీసీలెవ్వరూ జగన్​కు దాసోహం అనరు: రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగిస్తున్న జగన్​.. బీసీలను అన్ని విధాలా వంచించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్ ద్వారా నామమాత్రపు పదవులే తప్పా.. ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. సొంత సామాజిక వర్గానికి నిధులు, విధులు ఉన్న పదవులు కేటాయించి బీసీలను అవమానపరిచారని మండిపడ్డారు. సీఎం జగన్​.. బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. అవసరమైతే పస్తులుంటాం తప్పా.. ఆత్మాభిమానాన్ని చంపుకుని బీసీలెవ్వరూ జగన్​కు దాసోహం అనరని కొల్లు స్పష్టం చేశారు.

పార్టీలకతీతంగా బీసీలంతా ఒక్కటవ్వాలి: బీసీలకు మాత్రమే ఖర్చు చేయాల్సిన వేల కోట్ల ఉపప్రణాళిక నిధులను ఎవరికి ఖర్చుపెడుతున్నారో ముఖ్యమంత్రిని నిలదీయాల్సిన బాధ్యత బీసీలపై ఉందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం కలిసి ఐక్యంగా పోరాడే సంస్కృతి బీసీల్లో రావాలన్న ఆయన... పార్టీలకతీతంగా బీసీలంతా ఒక్కటవ్వాలన్నారు. బీసీలకు నాలుగు మంత్రిపదవులు ఇస్తే వారినేదో ఆదుకున్నట్లు కాదన్న్ ఆయన.. బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చి వారిని పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం అని స్పష్టంచేశారు. బీసీల ఆలోచనలకు తగ్గట్లుగా పనిచేసే నాయకత్వం తెలుగుదేశంలోనే ఉందన్నారు. బడుగుబలహీన వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్​తో తెలుగుదేశం ముందుకెళ్తుందన్నారు.

బడుగుబలహీన వర్గాలకు జగన్​ ఏం చేశారు: బడుగుబలహీన వర్గాలకు జగన్​ ఏం చేశారో చెప్పాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు దక్కాల్సిన పదవులు సైతం జగన్ రెడ్డి హరించారని ఆయన మండిపడ్డారు. బీసీలు కోల్పోతున్న ఆత్మగౌరవం, గుర్తింపుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

మహాత్మ జ్యోతిబా పూలేకి ఘన నివాళి: అంతకుమంద మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయనకు నేతలు ఘన నివాళులు అర్పించారు. సమసమాజం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు జ్యోతీరావు పూలే అని యనమల రామకృష్ణుడు గుర్తుచేశారు. బీసీల ఆత్మగౌరవం కాపాడి జ్యోతీరావుపూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబు అని అనగాని సత్యప్రసాద్ కొనియడారు. సామాజిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడు జ్యోతీరావు పూలేనని అన్నారు.

ఇదీ చదవండి:

Kotamreddy Sridhar Reddy: మంత్రివర్గంలో కోటంరెడ్డికి దక్కని చోటు.. ఆవేదనతో కంటతడి

Last Updated :Apr 11, 2022, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.