ETV Bharat / city

5 గ్రామాలు ఇవ్వమంటే భద్రాచలం మాది అంటాం.. ఇస్తారా ?: మంత్రి అంబటి

author img

By

Published : Jul 19, 2022, 6:45 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి గొడవల్లేవు.. కొత్తవి సృష్టించొద్దు
తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి గొడవల్లేవు.. కొత్తవి సృష్టించొద్దు

Minister Ambati Comments: పోలవరం ప్రాజెక్టుతోనే భద్రాచలానికి ముంపు పొంచి ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై పువ్వాడకు విద్యాశాఖ మంత్రి బొత్స కౌంటర్ ఇవ్వగా.. తాజాగా జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవని.. కొత్తవి సృష్టించేందుకు ప్రయత్నించొద్దని కోరారు.

Minister Ambati comments on TS minister Puvvada: పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవని.. కొత్తవి సృష్టించేందుకు ప్రయత్నించొద్దని కోరారు. హైదరాబాద్‌ లేక్‌వ్యూ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడిన అంబటి.. గోదావరికి వరదలు వచ్చినప్పుడు తెలంగాణ, ఏపీలో కొన్ని ప్రాంతాలు నీట మునుగుతాయని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి గొడవల్లేవు.. కొత్తవి సృష్టించొద్దు

"మనిద్దరం తెలుగు వాళ్లమే. తెలంగాణలో మీరు, ఏపీలో మేము పరిపాలన చేస్తున్నాం. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. కొత్త వివాదాలు తీసుకురావొద్దు. నిబంధనల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు కేంద్రమే ఇచ్చింది. 7 మండలాలకు పోలవరం వల్ల ఇబ్బంది ఉంటుందనే వాటిని ఏపీలో కలిపారు. భద్రాచలంలో వరదలు వస్తే పోలవరం ఎలా కారణమవుతుంది ? అన్ని సర్వేలు చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. మీరు 5 గ్రామాలు ఇవ్వమంటే.. భద్రాచలం మాది అంటాం.. ఇస్తారా ? 5 గ్రామాలు తెలంగాణకు కావాలంటే కేంద్రాన్ని అడగండి. పోలవరం ఎత్తు విషయంలో సీడబ్ల్యూసీకి సమాచారం ఇచ్చాకే నిర్ణయం తీసుకున్నాం. గోదావరి (GRMB), కృష్ణా (KRMB) బోర్డులు ఉన్నాయి కదా.. వాటిని సంప్రదించకుండా టీవీలో మాట్లాడితే ఎలా ? పెద్ద ఎత్తున భారీ వర్షం పడినప్పుడు వరదలు రావడం సహజం. భద్రాచలంలో కొత్తగా నీళ్లు రాలేదు. 1986లో 75 అడుగుల వరకు వచ్చాయి. సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ప్రభుత్వాలు పని చేయాలి. పోలవరం వల్లే తెలంగాణ గ్రామాలు మునుగుతున్నాయా ? అనేది సీడబ్ల్యూసీని తెలంగాణ అడగాలి. నిజంగా సమస్య ఉంటే ముఖ్యమంత్రులు ఉన్నారు కదా.. వారు చూసుకుంటారు" -అంబటి రాంబాబు, మంత్రి

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.