ETV Bharat / city

GRMB subcommittee meeting : 'ఆ ప్రాజెక్టులపై ఏపీ వాదన సరికాదు.. గోదావరి బోర్డు భేటీలో తెలంగాణ'

author img

By

Published : Jan 24, 2022, 8:00 PM IST

Godavari River Management Board Subcommittee Meeting over
పెద్దవాగు మినహా ఇతరప్రాజెక్టులు బోర్డుకు అప్పగించం

GRMB subcommittee meeting : పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించబోమని గోదావరి యాజమాన్య బోర్డ్​కు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునే విషయంపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమావేశమైంది.

GRMB subcommittee meeting : పెద్దవాగుమినహా ఇతర ప్రాజెక్టులను గోదావరి నదీయాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్రప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. బోర్డు సభ్యకార్యదర్శి బీపీపాండే నేతృత్వంలో సోమవారం జరిగిన జీఆర్​ఎంబీ ఉపసంఘ సమావేశంలో.. రాష్ట్రప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ సమావేశానికి తెలంగాణ తరపున ఉపసంఘం సభ్యుడు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఈ సుబ్రమణ్య ప్రసాద్.. ఆంధ్రప్రదేశ్‌ తరపున గోదావరి డెల్టా సిస్టమ్ సీఈ పుల్లారావు హాజరయ్యారు.

'కేంద్రం స్పందన లేదు'

తెలంగాణకు చెందిన మేడిగడ్డ, కన్నేపల్లి పంపుహౌజ్, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వెంకటనగరం పంపింగ్ స్కీమ్‌ను.. బోర్డు పరిధిలోకి తీసుకోవడంపై సమావేశంలో చర్చించారు. అక్టోబర్‌లో జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లాకు చెందిన పెద్దవాగును జీఆర్​ఎంబీ పరిధిలోకి తీసుకునేందుకు.. తెలంగాణ అంగీకరించిందని దేశ్‌పాండే గుర్తుచేశారు. ఇతర ప్రాజెక్టులను ప్రస్తుతం బోర్డ్ పరిధిలోకి తీసుకురావాల్సిన.. అవసరం లేదని స్పష్టంచేశారు. గెజిట్ నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూల్లో 5 ప్రాజెక్టులను తొలగించాలని.. కొన్ని కాంపొనెంట్లను రెండు నుంచి మూడో షెడ్యూల్‌లోకి మార్చాలని.. గతంలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి బోర్డుకు లేఖలు రాసినా స్పందన రాలేదని తెలిపారు.

ఏకపక్షం నివేదికపై అభ్యంతరం

ఈ తరుణంలో మిగతా ప్రాజెక్టులను.. జీఆర్​ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం.. ప్రస్తుతం పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మొదటి బోర్డు సమావేశంలో చర్చించి, అనుమతి తీసుకున్నాకే ప్రాజెక్టులను సందర్శించాలని, స్వాధీన నివేదిక తయారీలో ఉపసంఘం సభ్యుల ప్రమేయం కూడా ఉండాలని అన్నారు. బోర్డు అనుమతి లేకుండా ఏకపక్షంగా ప్రాజెక్టుల్ని సందర్శించి స్వాధీన నివేదిక తయారుచేయడంపై.. అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయా ప్రాజెక్టులపై ఉపసంఘం సమావేశంలో చర్చించలేమని తెలిపారు. గత సబ్ కమిటీ సమావేశంలో తమ అభిప్రాయాలను అసంపూర్ణంగా రికార్డు చేశారని.. ఇవాళ్టి భేటీలో తమ అభిప్రాయాలను పూర్తిగా రికార్డు చేయాలని కోరారు.

'ఆంధ్రప్రదేశ్ వాదన సరికాదు'

తెలంగాణకు చెందిన అన్ని కాంపొనెంట్లను జీఆర్​ఎంబీ పరిధిలోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ సీఈ కోరారు. ఇందుకు తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టినవేనని తెలిపిన తెలంగాణ సభ్యుడు.. అవన్ని రాష్ట్ర ఆయకట్టుకు మాత్రమే నీటిసరఫరా చేసే ప్రాజెక్టులని వివరించారు. గోదావరి అవార్డ్ నాలుగో క్లాజ్ ప్రకారం రాష్ట్రాలకు తమ వాటా నీళ్లను ఎక్కడికైనా తరలించుకునే అధికారం ఉందని గుర్తు చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులు కాని వాటిని గోదావరి బోర్డు పరిధిలోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ కోరడం సమంజసం కాదని తెలంగాణ సభ్యులు వ్యాఖ్యానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: పీఆర్సీపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.