రాష్ట్రం  ఖర్చు చేసిన ఆ డబ్బును.. కేంద్రం నుంచి రాబట్టాలి: సీఎం జగన్

author img

By

Published : May 10, 2022, 8:38 PM IST

Updated : May 11, 2022, 5:36 AM IST

రాష్ట్రం ప్రభుత్వం ఖర్చు చేసిన ఆ డబ్బును కేంద్రం నుంచి రాబట్టాలి

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2,559 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి రాబట్టాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సత్వరమే రాబట్టేలా చర్యలు తీసుకోవాలని.. అధికారులకు సూచించారు. జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. పోలవరం సహా పలు సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై చర్చించారు.

జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా పలు సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2 వేల 559 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి రాబట్టాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సత్వరమే రాబట్టేలా చర్యలు తీసుకోవాలని.. అధికారులకు సూచించారు. పోలవరం దిగువ కాఫర్‌ డ్యాం పనులు జులై 31 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుని.., ఆ దిశగా పనులు చేస్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. దిగువ కాఫర్‌ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఇసుకతో నింపేందుకు అన్నిరకాల ప్రయత్నాలు మొదలు పెట్టామన్నారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణ డిజైన్లపై ఇన్వెస్టిగేషన్‌ పూర్తయ్యిందని.. ఈనెలాఖరు నాటికి డిజైన్లపై స్పష్టత వస్తుందని వివరించారు.

నెల్లూరు, సంగం బ్యారేజీ పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సకాలంలో ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. అవుకు టన్నెల్‌ పనులపైనా సీఎం జగన్ సమీక్షించారు. అవుకు టన్నెల్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయని.., ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంతో చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం వెలిగొండలో నెలకు 500 మీటర్లపైన పనిచేస్తున్నామని తెలిపారు.సెప్టెంబరులో టన్నెల్‌–1 ద్వారా నీటి విడుదల చేస్తామన్నారు. టన్నెల్‌–1 ద్వారా నీటిని పంపిస్తున్న సందర్భంలోనే టన్నెల్‌–2లోనూ పనులు కొనసాగుతాయన్నారు. జూన్ 2023 నాటికి టన్నెల్‌ –2 పనులు పూర్తిచేస్తామని తెలిపారు. ఈలోగా పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపైనా ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షించారు. వంశధార నిర్వాసితుల కోసం అదనపు ఎక్స్​గ్రేషియా కూడా పైన సీఎం అధికారులతో చర్చించారు. దాదాపు రూ.226.71 కోట్లు దీనికోసం ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు ఈ చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్‌ పెట్టి.. దాని ద్వారా హీరమండలం రిజర్వాయర్‌ నింపే ప్రతిపాదనకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనిపై పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. నేరడి బ్యారేజీ నిర్మాణం అంశంపైనా దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్, తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టులకు సంబంధించి పనులు వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రాయలసీమ ప్రాజెక్టులపైనా సమీక్షించిన సీఎం జగన్.. తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఉన్న కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. నీటి కొరత కారణంగా ఈ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయని..,వాటిని నివారించాలన్నారు. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. చిత్తూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు తాగు, సాగునీటిని అందించాలని, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. భైరవానితిప్ప ప్రాజెక్టు, మడకశిర బైపాస్‌ కెనాల్, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌ –2 (కోడూరు వరకు), జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ లిప్ట్‌ స్కీం, ఎర్రబాలి లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీం నుంచి యూసీఐఎల్‌ సప్లిమెంట్, రాజోలి, జలదిరాశి రిజర్వాయర్లు(కుందూ నది), రాజోలి బండ డైవర్షన్‌ స్కీం, వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం – 5 లిప్ట్‌ స్కీంలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి అధికారులను ఆదేశించారు.

అధికారులు ఏమన్నారంటే...
* పోలవరం దిగువ కాఫర్‌డ్యాం పనులు జులై 31కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం 68% పూర్తయ్యాయి.

* దిగువ కాఫర్‌డ్యాంలో కోత పడిన ప్రాంతాన్ని ఇసుకతో నింపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే 76% జియోబ్యాగులను నింపాం.

* దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ నిర్మాణ డిజైన్లపై పరిశోధన పూర్తయింది. నెలాఖరుకు స్పష్టత వస్తుంది.

* అవుకు టన్నెల్‌ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేస్తాం.

* వెలిగొండ ప్రాజెక్టులో 2014-19 మధ్య అప్పటి ప్రభుత్వ హయాంలో మొదటి టన్నెల్‌ పనులు 4.33 కిలోమీటర్లు జరిగాయి. అంటే అప్పట్లో రోజుకు 2.14 మీటర్ల పని మాత్రమే జరిగింది. 2019-22 మధ్య ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 2.8 కిలోమీటర్ల పని చేశాం. రోజుకు 4.12 మీటర్ల టన్నెల్‌ పనులు జరిగాయి.

* రెండో టన్నెల్‌కు సంబంధించి పాత ప్రభుత్వ హయాంలో రోజుకు 1.31 మీటర్ల పనిచేయగా ఈ ప్రభుత్వంలో రోజుకు 2.46 మీటర్ల పని చేస్తున్నాం.

* వెలిగొండలో ప్రస్తుతం నెలకు 500 మీటర్ల పని చేస్తున్నాం. సెప్టెంబరులో మొదటి టన్నెల్‌ నుంచి, 2023 జూన్‌ నాటికి రెండో టన్నెల్‌ నుంచి నీళ్లు విడుదల చేస్తాం.

ఇవీ చూడండి

Last Updated :May 11, 2022, 5:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.