ETV Bharat / city

'అప్పుడు బీమా ప్రీమియం కడతామంటే పరిహారం ఇస్తారా?'

author img

By

Published : Dec 7, 2020, 9:28 PM IST

చనిపోయాక.. బీమా ప్రీమియం కడతాం అంటే పరిహారం ఇస్తారా? అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్​ను నిలదీశారు. రైతులకు అండగా తెలుగుదేశం ఉండి వారి సమస్యలపై పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. విచ్చలవిడి అప్పులతో రాష్ట్రం ఏమవుతుందోనని ప్రశ్నించిన చంద్రబాబు దీనిపై ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. దేవుడిచ్చిన ఇసుకపై వైకాపా పెత్తనమేంటని ఆయన ధ్వజమెత్తారు.

'అప్పుడు బీమా ప్రీమియం కడతామంటే పరిహారం ఇస్తారా?'
'అప్పుడు బీమా ప్రీమియం కడతామంటే పరిహారం ఇస్తారా?'

వరుస విపత్తులతో రైతులు చితికిపోయి ఉన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 35 లక్షల ఎకరాల వరకు పంటలు దెబ్బతిని, 7,500 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి నష్టం జరిగిందని తెలిపారు. కనీసం బీమా అయినా కట్టి ఉంటే కొంతైనా న్యాయం జరిగేదని అభిప్రాయపడ్డారు. లక్షల మంది రైతుల గోడుకు కారణం ఎవరని మండిపడ్డారు. ప్రీమియంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే కట్టామని తప్పించుకుని, రాత్రికి రాత్రి నిధులు విడుదల చేస్తూ జీవో ఇచ్చారని దుయ్యబట్టారు.

బీమా ఎప్పుడు చెల్లిస్తారు?

ప్రభుత్వం కట్టిన సొమ్మును బీమా సంస్థలు, కేంద్రం అంగీకరించాయా? లేదా? చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బీమా ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. చనిపోయాక ప్రీమియం కడతాం, డబ్బివ్వండి అంటే ఇస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిపోయిన నష్టానికి బీమా ఇస్తామని మభ్యపెడుతూ చేతగాని సీఎం ఎదురుదాడి చేస్తున్నారే తప్ప ప్రజల్ని ఆదుకోవడంలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.

రైతుకు గిట్టుబాటు ధర దక్కాలి

మద్దతు ధరల్ని చట్టంలో పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాటిని కచ్చితంగా అమలు చేసే మెకానిజం ఉండాలన్నారు. మార్కెట్‌ కమిటీల కేంద్రంగా క్రయవిక్రయాలు జరగాలని స్పష్టం చేశారు. ఈ విషయంల్లో ఎప్పుడూ రాజీ పడేది లేదని తేల్చిచెప్పారు. రైతుకు గిట్టుబాటు ధర దక్కాలని, ప్రభుత్వాలకు బాధ్యత ఉండాలని చర్చల సమయంలోనే బిల్లులపై తెదేపా వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పామన్న చంద్రబాబు.., సెప్టెంబరులో ప్రధాని మోదీ కూడా ఎంఎస్‌పీని చట్టంలో పెడతామని ట్వీట్‌ చేశారని గుర్తుచేశారు. జిల్లాల్లోని తెదేపా నేతలంతా వీటన్నిటిపై కలెక్టర్లకు మెమోరాండం ఇస్తారని, రైతులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాడతామని తెల్చిచెప్పారు.

అప్పులు చేస్తే రాష్ట్రం ఏమైపోతుంది

విచ్చలవిడిగా అప్పులు చేస్తుంటే రాష్ట్రం ఏమైపోతుందని చంద్రబాబు నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ కూడా దేశంలో ఒక భాగమే అయినందున అందరూ స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు, కేంద్ర మాజీ మంత్రి సురేశ్‌ ప్రభు రాసిన లేఖల విషయంపై చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో పరిస్థితిపై కర్ణాటకకు చెందిన మోహనదాస్‌ పాయ్‌ గతంలో చేసిన ట్వీట్‌తోపాటు గత ప్రభుత్వాల ఒప్పందాలపై వెనక్కి తగ్గొద్దని కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) రాసిన లేఖలను గుర్తుచేశారు. ఏ భయం లేకుండా రాష్ట్రంలో వ్యాపారం, వ్యవసాయం చేసుకుంటామనే పరిస్థితి ఎవరికి లేదని విమర్శించారు.

రాష్ట్రంలో సిమెంటు బస్తా రూ.300 రూపాయలు ఉంటే, ఇసుక బస్తా రూ.150 పలుకుతోందని మండిపడ్డారు. కొత్త ఇసుక పాలసీతో నాలుగైదు నెలలు నాటకాలాడి..తర్వాత మరొక పాలసీ తెస్తారా? అని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: 'భారత్​ బంద్'పై​ రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.