ETV Bharat / city

అసమర్థ పాలనతో సీఎం జగన్ ఎప్పుడో జీరో అయ్యారు: చంద్రబాబు

author img

By

Published : Apr 28, 2022, 7:45 PM IST

Updated : Apr 29, 2022, 5:33 AM IST

వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సీఎం జగన్​కు అర్థమైందని.., దాన్ని కప్పిపుచ్చేందుకే 175 సీట్లు గెలుస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అసమర్థ పాలనతో జగన్ ఎప్పుడో జీరో అయ్యారని.. మళ్లీ గెలవటానికి ఏం సాధించారని నిలదీశారు.

అసమర్థ పాలనతో సీఎం జగన్ ఎప్పుడో జీరో అయ్యారు
అసమర్థ పాలనతో సీఎం జగన్ ఎప్పుడో జీరో అయ్యారు

అసమర్థ పాలనతో ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో జీరో అయ్యారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మళ్లీ గెలవటానికి జగన్ ఏం సాధించారని నిలదీశారు. పన్నులతో ప్రజలను బాధపెట్టి.. ఇరిగేషన్, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసినందుకు జగన్​ను మళ్లీ గెలిపించాలా ? అని ప్రశ్నించారు. తన వైఫల్యాలతో పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్టులను బలిచేసినందుకు తిరిగి అధికారం కట్టబెట్టాలా ? అని నిలదీశారు. వైకాపాకు వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనని ఎద్దేవా చేశారు. పార్టీ నేతలతో ఆన్​లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు..వైకాపా ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెత్తిన పెట్టుకున్న వైకాపా కుంపటిని ఎప్పుడు దించాలా అని జనం ఎదురుచూస్తున్నారన్నారు. నాడు నేడుపై ఏ రంగంలోనైనా చర్చకు తెలుగుదేశం సిద్దమని సవాల్‌ విసిరారు. ప్రభుత్వ అసమర్థ పాలనపై తెదేపా నిరసనలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనతో జగన్ ఉలిక్కి పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్​కు అర్థమైందని.., దాన్ని కప్పిపుచ్చేందుకే 175 సీట్లు గెలుస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

"అసమర్థ పాలనతో సీఎం జగన్ ఎప్పుడో జీరో అయ్యారు. ఏం సాధించారని జగన్ మళ్లీ గెలుస్తారు. వైకాపాకు ఈసారి సింగిల్ డిజిట్ వస్తేనే గొప్ప. వైకాపా కుంపటిని ఎప్పుడు దించాలా అని జనం చూస్తున్నారు. ఏ రంగంలో అయినా నాడు-నేడుపై చర్చకు తెదేపా సిద్ధం. తెదేపా నిరసనలు, ప్రజల స్పందనతో జగన్ ఉలిక్కిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌కు అర్థమైంది. కప్పిపుచ్చేందుకే 175 సీట్లు గెలుస్తామని నమ్మబలికే యత్నం." -చంద్రబాబు

ఇతర నియోజకవర్గాల్లో జోక్యం వద్దు
నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పార్టీ నాయకులు నడుచుకోవాల్సిన విధానం, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేపట్టడంపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఒక నియోజకవర్గ ఇన్‌ఛార్జి మరో నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. వేరే నియోజకవర్గాల్లో అనుచరులు, బంధువులు ఉంటే దాన్ని వ్యక్తిగత పరిచయం వరకే పరిమితం చేయాలన్నారు. ఇతర నియోజకవర్గాల నాయకులకు ఇబ్బందులు సృష్టించినా, నియోజకవర్గ ఇన్‌ఛార్జికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టినా సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు పని చేయకపోతే కచ్చితంగా తొలగిస్తామని, అలాంటివారిని నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కాపాడలేరని ఆయన తెలిపారు. మండల, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీలో ఎవరైనా సమాంతర వ్యవస్థలు నడిపితే ఊరుకోనన్నారు. గత మూడేళ్లలో బయటకురాని పార్టీనాయకులు కొందరు.. తెదేపా గెలుపు ఖాయమని తెలిసి క్రియాశీలంగా మారుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

Last Updated :Apr 29, 2022, 5:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.