ETV Bharat / state

ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

author img

By

Published : Apr 28, 2022, 3:32 PM IST

Updated : Apr 29, 2022, 4:19 AM IST

పేదలకు మంచి చేద్దామంటే ప్రతిపక్షాలు, మీడియా అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి జగన్‌ మండిపడ్డారు. పేదల ఇళ్లు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, మూడు రాజధానులు సహా అన్నింటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. 'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో లే అవుట్లను పరిశీలించిన జగన్.. ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం

ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. 'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో లే అవుట్లను జగన్ పరశీలించారు. అగ్రహారంలో పార్కును ప్రారంభించి.., ల్యాండ్‌ పూలింగ్‌కు భూమి ఇచ్చిన రైతులతో ఫొటో సెషన్ నిర్వహించారు. లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు, హౌసింగ్‌ స్కీమ్‌ పత్రాలను అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు.

ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో సుమారు 30.7 లక్షల మందికి ఇళ్లు కట్టి ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఒక్క కాలనీలోనే 10,228 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. పైడివాడ అగ్రహారంలో లక్షా 23 వేల మందికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి మహిళకు రూ.10 లక్షల విలువైన ఇల్లు ఇస్తున్నామని అన్నారు. స్థలాలు, ఇళ్లకు మొత్తం రూ.55 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే 15.6 లక్షల ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు వస్తున్నాయని అన్నారు. త్వరలో రెండోదశ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. ఇళ్లు లేనివారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పూర్తి చేస్తామన్న జగన్‌.. పథకం పూర్తి చేసి శ్రీకాకుళం వరకు నీళ్లు తీసుకెళ్తామన్నారు.

"పేదలకు మంచి చేద్దామంటే ప్రతిపక్షాలు, మీడియా అడ్డుకుంటున్నాయి. పేదల ఇళ్లు, ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలు, మూడు రాజధానులు సహా అన్నింటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు కూడా రానివ్వకుండా అడ్డు తగులుతున్నారు. ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా మూడు రాజధానుల్లో ఒకటి విశాఖకు ఇస్తానంటే ఆటంకాలు కల్పిస్తున్నారు. వాళ్ల రాజధాని అని చెప్పుకుంటున్న అమరావతిలోనైనా పేదలకు 54వేల ఇళ్ల పట్టాలు ఇస్తానంటే కోర్టుకు వెళ్లారు. వారు కోర్టులో ఏం చెప్పారో తెలుసా.. డెమోగ్రాఫిక్‌ ఇమ్‌బ్యాలెన్స్‌ వస్తుందట. అంటే వాళ్ల మధ్య పేదవాడు ఉంటే సమతుల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు అక్కడ న్యాయ రాజధాని తీసుకొస్తానంటే దాన్నీ అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలోని పేదలకు ఏ మంచి జరిగినా కూడా వీరికి కడుపుమంటగా ఉంది"- జగన్‌, ముఖ్యమంత్రి

దేశ జీడీపీ పెంచే కార్యక్రమం

రాష్ట్రంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణం దేశ జీడీపీని పెంచే కార్యక్రమమని జగన్‌ అన్నారు. ‘ఈ ఇళ్ల నిర్మాణం కోసం 83.84 లక్షల టన్నుల సిమెంటు, 8.94 లక్షల టన్నుల స్టీలు, 3.76 కోట్ల టన్నుల ఇసుక ఉపయోగిస్తున్నాం. కార్మికులకు 25.92 కోట్ల పనిదినాలు వస్తున్నాయి. ఈ విధంగా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం. గత ప్రభుత్వం ఎలా పనిచేసిందీ, ఎంతమందికి ఇళ్లు ఇచ్చిందో ఆలోచించాలి. అప్పుడూ ఇప్పుడూ అదే ప్రజలు.. అదే అధికారులు. అయితే సీఎం పేరు చంద్రబాబు బదులు జగన్‌మోహన్‌రెడ్డిగా మారింది. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి మనసు రాలేదు’ అని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నిస్తుంటే కొన్ని మీడియా సంస్థలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. అయినా అక్కచెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో జగన్‌ అనే వ్యక్తి రాజీపడడని స్పష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్‌, ఆదిమూలపు సురేష్‌, విడదల రజని, అమర్‌నాథ్‌, బూడి ముత్యాలనాయుడు, విశాఖ, అనకాపల్లి కలెక్టర్లు మల్లికార్జున, రవి సుభాష్‌, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సభ ప్రారంభానికి ముందే వెనక్కి!

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సభకు వచ్చిన ప్రజలు అవస్థలు పడ్డారు. సభా ప్రాంగణం సరిపోకపోవడంతో వెనక వచ్చిన వారు సభ ప్రారంభానికి ముందే వెళ్లిపోయారు. కొందరు ఎండ వేడిమి తాళలేక తిరుగు ప్రయాణమయ్యారు.

ఇదీ చదవండి: Lokesh: సీఎం జగన్​కు నారా లోకేశ్​ లేఖ..ఎందుకంటే..!

Last Updated :Apr 29, 2022, 4:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.