ETV Bharat / city

ఎన్టీఆర్​.. 3 అక్షరాలు తెలుగుజాతికి అపూర్వశక్తి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

author img

By

Published : Jun 9, 2022, 3:27 PM IST

Updated : Jun 9, 2022, 10:09 PM IST

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

నందమూరి తారక రామారావు ఓ సమున్నత మానవతామూర్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగు ప్రజలు.. పార్టీలు, రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా కృషి చేయాలని కోరారు. ఎన్టీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్​.. 3 అక్షరాలు తెలుగుజాతికి అపూర్వశక్తి

Justice NV Ramana: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే సంవత్సరం మే 28 వరకు ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు.. ఎన్టీఆర్ కుమార్తె, భాజపా నేత పురందేశ్వరి తెలిపారు. 12 నెలలపాటు 12 ప్రాంతాల్లో 12 రంగాలను ప్రతిబింబించే రీతిలో ఉత్సవాలను జరపుతామని వెల్లడించారు. అవధాన ప్రక్రియ ద్వారా తిరుపతిలో తొలి వేడుక నిర్వహిస్తున్నట్లు.. పురందేశ్వరి వివరించారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవ సమితి, నందనం అకాడమీ సంయుక్తంగా చేపట్టిన ఈ వేడుకల్లో పంచ సహస్ర అవధాని మేడసాని మోహన్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందించిన 18 మందిని సత్కరించారు. పంచ సహస్ర అవధాని మేడసానమి మోహన్‌ అవధాన ప్రక్రియ నిర్వహించారు. సీజేఐ తొలి ప్రశ్న వేసి అవధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎన్టీఆర్ మనిషిగా తనపై ముద్రపడటాన్ని గర్వంగా భావిస్తానని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఎన్టీఆర్‌ రాజకీయపార్టీ పెట్టిన తొలినాళ్లలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని గుర్తుచేసుకున్నారు. ఆయనతో తనకున్న అనుబంధాలను వివరిస్తూ ఓ పుస్తకం రాస్తానని జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. తెలుగు భాష, సంస్కృతి కోసం పోరాడిన ఎన్టీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించేలా అందరూ పోరాడాలని సీజేఐ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి దీని కోసం కృషి చేయాలని సూచించారు.

తెలుగు భాష, సంస్కృతిని కాపాడుకోవడానికి సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యమం జరగాలని సీజేఐ జస్టిస్ రమణ సూచించారు. అదే ఎన్టీఆర్‌కు మనమిచ్చే ఘనమైన నివాళి అని ఉద్ఘాటించారు.

అనంతరం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు సందర్శించారు. సీజేఐకి తుడా కార్యాలయ కూడలి నుంచి.. అమ్మవారి వారి ఆలయం వరకు.. అధికారులు మేళతాళాలతో స్వాగతం పలికారు. గంగమ్మకు సీజేఐ దంపతులు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం సీజేఐ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ప్రాచీన సంప్రదాయం ప్రకారం.. భక్తులు గంగమ్మను దర్శించిన తర్వాత.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారని సీజేఐ గుర్తు చేశారు. ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తే బాగుంటుందని ఆకాంక్షించారు.

ఇవీ చూడండి

Last Updated :Jun 9, 2022, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.