ETV Bharat / city

murder case: స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

author img

By

Published : Aug 7, 2021, 12:31 PM IST

Updated : Aug 7, 2021, 3:43 PM IST

murder
murder

12:28 August 07

నలుగురు నిందితులు అరెస్ట్​

స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

ఏపీలోని నెల్లూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్టు చేసి.. రిమాండ్​కు తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు...  కారు నంబర్ ఆధారంగా నిందితులు మల్లేశ్, సుధాకర్, కృష్ణంరాజుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు నిర్ధరించారు.  

ఇదీ జరిగింది..

 నెల్లూరుకు చెందిన గడ్డం విజయ్‌భాస్కర్‌రెడ్డి (63) హైదరాబాద్‌లో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి కేపీహెచ్‌బీ ఠాణా వెనక వైపు అడ్డగుట్టలోని నెస్ట్‌ అవే అనే హాస్టల్‌లో ఉంటున్నారు. గత నెల 20 నుంచి చరవాణి స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండటంతో ఆయన అల్లుడు జయసృజన్‌రెడ్డి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్‌ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో.. అదే రోజు రాత్రి విజయ్‌భాస్కర్‌రెడ్డిని కారులో తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మాజీ సైనికోద్యోగి మల్లేశ్‌, స్థిరాస్తి వ్యాపారి సుధాకర్‌, కృష్ణంరాజుతోపాటు ఓ వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో హత్య కుట్ర బహిర్గతమైంది. విజయ్‌భాస్కర్‌రెడ్డిని అంతమొందించేందుకు సినీఫక్కీలో పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది.

మంచూరియాలో మత్తు మందు కలిపి..

  కుట్రలో భాగంగా ఆయన ఉండే హాస్టల్‌లోనే చేరిన మల్లేశ్‌ కుమారుడు నమ్మకంగా మెలుగుతూ మంచూరియాలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు తేలింది. అది తిని స్పృహ తప్పి పడిపోయిన విజయ్‌భాస్కర్‌రెడ్డిని మల్లేశ్‌, సుధాకర్‌, కృష్ణంరాజు కారులో తీసుకెళ్లారు. ఆయనను బాగా కొట్టడంతో కారులోనే మృతిచెందారు. అనంతరం మృతదేహాన్ని నిందితులు శ్రీశైలంలోని సున్నిపెంటకు తీసుకెళ్లారు. ‘తమ బంధువు చనిపోయాడు దహనం చేయాలంటూ కాటికాపరిని నమ్మించారు. అతడికి రూ.11 వేల నగదు, గూగుల్‌ పే ద్వారా మరో రూ.4 వేలు చెల్లించారు. వీరి తీరుపై అనుమానంతో మృతదేహాన్ని చితిపై ఉంచిన సమయంలో కాటికాపరి తన సెల్‌ఫోన్‌తో ఫొటో తీసి ఉంచుకున్నాడు. శవదహనం అనంతరం నిందితులు ఆ రోజంతా అక్కడే గడిపి తిరిగి వచ్చేశారు.

వెలుగులోకి విస్తుపోయే విషయాలు..

 హత్యకు కారణాలను పోలీసులు లోతుగా ఆరా తీయడంతో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ గురూజీ ప్రధాన సూత్రధారిగా తేలింది. ప్రకృతివైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తానంటూ బెంగళూరులో ఆశ్రమం తెరిచిన అతడికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో భక్తులున్నారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు నిజాంపేట ప్రాంతంలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీ సమీపంలో మకాం వేసేవాడు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ ప్రముఖుడి స్థలంలో విలువైన లోహాల్ని వెలికితీసేందుకు సహకరించాడనే ప్రచారం ఉంది. వాటిని విదేశీ కంపెనీకి విక్రయించడం ద్వారా భారీమొత్తంలో డబ్బు రాబట్టాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలిసింది. ఆ సాకుతో అవసరాల కోసం పలువురు భక్తుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని, విజయ్‌భాస్కర్‌రెడ్డి (63), ఆయనకు తెలిసిన వారు కూడా పెద్దమొత్తంలో డబ్బులిచ్చారని సమాచారం. 

 విదేశాల నుంచి నిధులొస్తాయంటూ కాలయాపన చేస్తున్నాడనే అనుమానంతో విజయ్‌భాస్కర్‌రెడ్డి తన డబ్బు కోసం గురూజీపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. దీనికితోడు తన కార్యకాలాపాలపై పలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు పంపి, అప్రతిష్ఠపాలు చేస్తున్నాడని విజయ్‌భాస్కర్‌రెడ్డిపై గురూజీ కోపం పెంచుకుని హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కోసం గాలిస్తున్నారు.  

మా మామ నాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లరు. ఫోన్​ స్విచ్​ఆఫ్​ రావడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశాను. జులై మొదటి వారంలో ఇంటికొచ్చి ఇద్దరు వ్యక్తులు బెదిరించారు. సుధాకర్​, మల్లేశ్​ ఇంటికొచ్చి బెదిరించారు. ఆ సమయంలో నేను కూడా ఉన్నాను. అప్పుడు పెద్దగా భయపడలేదు. తర్వాత వాళ్లు ప్లాన్​ చేసి ఇలా చేశారు. రెండు రోజుల ముందుగా ఈ ఇంట్లోకి వాళ్ల మనిషిని పంపించి.. అతను తినే ఆహారంలో మత్తు మందు కలిపి.. ఆ రాత్రి వచ్చి తీసుకెళ్లి కారులో కొట్టి చంపారు. ఆ తర్వాత శ్రీశైలం దగ్గర సున్నిపెంట శ్మశానవాటికకు తీసుకెళ్లి అక్కడ కాల్చేశారు.  -జయసృజన్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి అల్లుడు

ఇదీ చదవండి: Madhureddy murder case: మధురెడ్డి హత్యకు కారణాలివే..!

Last Updated :Aug 7, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.