ETV Bharat / city

Darbhanga blast: దర్భంగ పేలుళ్ల ఘటనలో మరో ఇద్దరు తీవ్రవాదులు అరెస్టు

author img

By

Published : Jul 2, 2021, 10:49 PM IST

దర్భంగా పేలుళ్ల(DARBHANGA BLAST) కేసులో ఎన్ఐఏ అధికారులు మరో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్​లోని ఖైరనాకు చెందిన హాజి సలీం, కాఫీల్​ను అరెస్టు చేశారు.

(Darbhanga blast) దర్భంగ పేలుళ్ల ఘటనలో మరో ఇద్దరు తీవ్రవాదులు అరెస్టు
దర్భంగ పేలుళ్ల ఘటనలో మరో ఇద్దరు తీవ్రవాదులు అరెస్టు

బిహార్​లోని దర్భంగా పేలుళ్ల(DARBHANGA BLAST) కేసు విచారణలో ఎన్​ఐఏ వేగం పెంచింది. హైదరాబాద్​లో ఇద్దరిని అరెస్ట్​ చేయగా తాజాగా ఉత్తరప్రదేశ్​లో మరో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులను అదుపులోకి తీసుకుంది. ఉత్తరప్రదేశ్​లోని ఖైరానాకు చెందిన హాజి సలీం, కాఫీల్​ను ఎన్​ఐఏ అధికారులు అరెస్టు చేశారు. పీటీ వారెంట్​పై ఇద్దరు నిందితులను పాట్నా తీసుకెళ్లారు. దర్భంగా పేలుళ్ల కేసులో ఇద్దరు నిందితులు కీలకంగా వ్యవహరించినట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది.

ఫిబ్రవరిలో కుట్ర

ఫిబ్రవరి నెలలో హజి సలీం ఇంట్లో పేలుళ్లకు సంబంధించి కుట్రపన్నారు. రైల్లో పేలుడు జరపడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేలా చేయాలని నిందితుల కుట్రపన్నారు. పాకిస్థాన్​లో తలదాచుకుంటున్న లష్కరే తోయిబా తీవ్రవాది ఇక్బాల్ ఖానా ఆదేశాల మేరకు పేలుళ్లకు కుట్ర పన్నారు. ఇక్బాల్ ఖానా పంపించిన నిధులను హజీ సలీం పేలుళ్లకు ఉపయోగించారు. ఈ కేసులో హైదరాబాద్​కు చెందిన ఉగ్రవాద సోదరులను ఎన్​ఐఏ అరెస్టు చేసింది. నాంపల్లికి చెందిన ఇమ్రాన్ ఖాన్, నసీర్ ఖాన్‌ అరెస్టు చేసి పీటీ వారెంట్​పై పాట్నాకు తీసుకెళ్లింది.

జూన్ 17న పార్సిల్ బాంబు పేలుడు

దర్భంగా రైల్వే స్టేషన్‌లో జూన్ 17న పార్సిల్ బాంబు పేలుడు జరిగింది. సికింద్రాబాద్ నుంచి పార్సిల్ వెళ్లినట్లు అధికారులు గుర్తించి విచారణ ప్రారంభించారు. మహ్మద్ నసీర్ ఖాన్ 2012లో పాకిస్థాన్ వెళ్లి ఎల్ఈటీలో శిక్షణ పొందాడని ఎన్ఐఏ తెలిపింది. రసాయనాలతో ఐఈడీ తయారు చేయడంలో నసీర్ శిక్షణ పొందాడని, సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి ఐఈడీ తయారు చేశాడని వెల్లడించింది. వస్త్రాల్లో ఐఈడీ పెట్టి సికింద్రాబాద్-దర్భంగా రైల్‌లో పార్సిల్ పంపారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. నసీర్, ఇమ్రాన్ పాక్‌లో లష్కరేతొయిబా ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నారని తెలిపింది. ఈ నెల 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో పార్శిల్​ను దర్భంగాకు సుఫియాన్ అనే వ్యక్తి పేరుతో నకిలీ పాన్​కార్డు చూపించి పంపించారు. దర్భంగాలో పార్శిల్ తీసుకునే వ్యక్తి పేరు కూడా సూఫియాన్ అనే రాసి ఉంచారు. ఫోన్​ నంబర్ కూడా నకిలీదే ఇచ్చారు.

ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్​కు...

ఉత్తర్​ప్రదేశ్​లోని ఖైరానాకు చెందిన నసీర్ రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్​కు వచ్చి ఆసిఫ్​నగర్​లో స్థిరపడ్డాడు. వస్త్ర వ్యాపారం చేస్తూ హైదరాబాద్​కు చెందిన యువతినే పెళ్లి చేసుకున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఏడాది క్రితం నసీర్ సోదరుడు ఇమ్రాన్ కూడా హైదరాబాద్​కు వచ్చి ఆసిఫ్​నగర్​లోనే మరో గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయితే వీళ్లిద్దరూ.. ఓ ఉగ్రవాది ఆదేశాలు పాటిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:High Court : 'సీఆర్పీసీ సెక్షన్ 41ఏ మార్గదర్శకాలను పాటిస్తూ విచారణ జరపండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.