ETV Bharat / city

నత్తనడకన జగనన్న ఇళ్ల నిర్మాణం.. చాలా చోట్ల లేఅవుట్లు, సర్వే రాళ్లకే పరిమితం

author img

By

Published : Jun 13, 2022, 4:24 AM IST

YSR Jagananna Colonies
YSR Jagananna Colonies

YSR Jagananna Colonies: గత ప్రభుత్వాలన్నీ పేదలకు ఇళ్లు కట్టిస్తే.. తాము మాత్రం కాలనీలు నిర్మిస్తున్నామంటూ వైకాపా సర్కారు గొప్పలు చెప్పుకొంది. స్థలం ఇవ్వడం నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యేదాకా మొత్తం బాధ్యత తమదేనని ఘనంగా ప్రకటించింది. కాలనీలు కట్టేశాక.. కుడికాలు ముందుపెట్టి గృహప్రవేశం చేయడమే లబ్ధిదారుల వంతు అంటూ ఇంపుగా మాటలు చెప్పింది. దీంతో చిరకాల స్వప్నం సాకారమవుతుందని బడుగుజీవులు సంతోషించారు. కాలనీల శంకుస్థాపన హడావిడి అయ్యాకే అసలు కథ మొదలైంది. బేస్‌మెంట్‌ నుంచి శ్లాబ్‌ వరకు... ప్రతిదశలో ఎదురవుతున్న చిక్కులతో తలలు పట్టుకుంటున్నారు. ఈ గండం గట్టెక్కేదెలా డేవుడా అని బెంగ పడుతున్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం వీరిని మరింత ఇబ్బంది పెడుతోంది.

కరెంటు ఉండదు.. నీళ్లు రావు.. స్థలాలు కూడా ఊరికి దూరంగా ఎక్కడో ఇచ్చారు. కొన్ని స్థలాలైతే కొండలు, గుట్టల్లో ఉన్నాయి. పైపెచ్చు, ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నది రూ.1.80 లక్షలే. కేంద్రం ఇస్తున్న ఆ మొత్తానికి గ్రామాల్లో ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వట్లేదు. బయట మార్కెట్లో చూస్తే నిర్మాణ సామగ్రి ధరలు చుక్కల్లో ఉన్నాయి. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పేరుతో పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేసి ఏడాదిన్నర గడుస్తున్నా.. తొలివిడతలో చేపట్టిన 15.60 లక్షల ఇళ్లలో ఇప్పటివరకూ పూర్తయినవి 5 శాతమే! స్థలాలన్నీ ఊళ్లకు దూరంగా ఉన్నాయి. ఉన్న ఊళ్లో ఉపాధి వదులుకుని అక్కడకు వెళ్లి ఇల్లు కట్టుకోవడానికి, ఒకవేళ కట్టుకున్నా అక్కడకు వెళ్లి ఉండటానికి వీలుకాక చాలామంది నిర్మాణాలకు ముందుకు రావట్లేదు. బిల్లుల చెల్లింపులో జాప్యం వీరిని మరింత ఇబ్బంది పెడుతోంది.

ఇళ్లకు 35 కి.మీ దూరంలో స్థలాలు: తిరుపతి నగరపాలక సంస్థ, శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాలకు చెందిన 6,432 మంది పేదలకు ఏర్పేడు మండలం చిందేపల్లి లేఅవుట్‌లో స్థలాలు కేటాయించారు. ఇక్కడ 2,500 వరకు నిర్మాణాలు ప్రారంభమైనా పునాది దశలోనే 2,100 ఆగిపోయాయి. పునాది, ఆ తర్వాతి దశల్లో 375 నిర్మాణాలు ఉండగా 25 పూర్తయ్యాయి. తిరుపతి లబ్ధిదారులకు ఈ లేఅవుట్‌ సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతదూరం వెళ్లి కట్టుకోవడం కష్టమని, నగరంలో ఉపాధిని వదులుకుని అక్కడికి వెళ్లి ఎలా బతకాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

.

ఆప్షన్‌-3 లబ్ధిదారుల కుదింపు: 2020 డిసెంబరులో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి మూడు ఆప్షన్ల విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇళ్లు కట్టుకోలేనివారికి ప్రభుత్వమే కట్టించి (ఆప్షన్‌-3) తాళం ఇస్తుందని హామీ ఇచ్చారు. అధికారులు లబ్ధిదారులను ఆప్షన్లు అడిగితే.. ఎక్కువమంది మూడో ప్రత్యామ్నాయంవైపే మొగ్గుచూపారు. ఇది ప్రభుత్వానికి భారమని భావించిన అధికారులు.. క్రమంగా ఆ సంఖ్యలో కోత వేశారు. మొదట్లో దాదాపు 7.80 లక్షల మంది మూడో ఆప్షన్‌ అడిగితే, చివరకు ఆ సంఖ్యను 3.15 లక్షలకు కుదించారు.

శంకుస్థాపనలు చేసి వదిలేసినవే అధికం : ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు గతేడాది జూన్‌లో శంకుస్థాపన వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 10 లక్షల ఇళ్లకు లబ్ధిదారులతో భూమిపూజ చేయించి నిర్మాణాలు ప్రారంభింపజేశారు. ఆ తర్వాత అడుగులు వేగంగా ముందుకు పడలేదు. క్షేత్రస్థాయి అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించి లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చినా, వారు అంతగా స్పందించలేదు. వాలంటీర్ల నుంచి.. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది, ఎంపీడీవో, తహసీల్దారు, గృహనిర్మాణ అధికారులు, జిల్లాస్థాయి అధికారుల్ని లబ్ధిదారుల వద్దకు పంపి ఇళ్లు కట్టుకోకపోతే పట్టా రద్దుచేస్తామని చెప్పినా మొక్కుబడిగానే కదులుతున్నారు.

బాపట్ల పట్టణం బేతనీకాలనీ వద్ద ఏర్పాటుచేసిన లేఅవుట్‌ లబ్ధిదారులకు పట్టా రద్దుచేస్తామని కలెక్టర్‌ పేరుమీద నోటీసులు ఇచ్చారు. అక్కడ 567 ఇళ్లను కేటాయిస్తే ఇంకా 250 ఇళ్లు ప్రారంభం కాలేదు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పరిధిలోనూ పట్టా వెనక్కి తీసుకుంటామని అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కృష్ణా జిల్లా బందరు మండలం మేకవానిపాలెం లేఅవుట్‌లోనూ ఇదే పరిస్థితి. మొత్తంగా పునాదికి ముందు దశలో ఉన్న 8.18 లక్షల ఇళ్లలో శంకుస్థాపన చేసి వదిలేసినవే ఎక్కువ. ఇప్పటికీ చాలా లేఅవుట్లలో సరిహద్దు రాళ్లే కనిపిస్తున్నాయి.

.

డబ్బే ప్రధాన సమస్య : ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడానికి డబ్బు లేకపోవడమే ప్రధాన సమస్య. రాష్ట్రప్రభుత్వం 30 లక్షల మందికి స్థలాలు ఇచ్చి ఊరుకుంది. ఇళ్ల నిర్మాణానికి గ్రామాల్లో అదనంగా ఒక్క రూపాయీ ఇవ్వలేదు. పట్టణాల్లో ఒక్కో ఇంటిపై రూ.30వేలే ఖర్చుచేస్తోంది. కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్రప్రభుత్వం మరో రూ.2 లక్షలు ఇస్తే ఇళ్ల నిర్మాణాలు వేగంగా ముందుకు సాగుతాయి. కానీ ప్రభుత్వం స్థలాన్ని ఉచితంగా ఇస్తున్నామన్న మాటనే చెబుతోంది. చివరకు కొందరు డబ్బులున్నవారు ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా.. అధికారుల ఒత్తిడితో మరికొందరు వడ్డీలకు అప్పులు తెచ్చి, బంగారం తాకట్టు పెట్టి తిప్పలు పడుతున్నారు. చాలామంది పేదలు డబ్బుల్లేక ఇళ్లు కట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు.

.

సరిహద్దు రాళ్లే కనిపిస్తున్నాయి: విశాఖజిల్లా భీమిలి మండలం తాటితూరుకు చెందిన 200 మందికి వారి నివాస ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని ఆనందపురం సరిహద్దుల్లో ఇళ్లస్థలాలు కేటాయించారు. పైగా కొండపైన లేఅవుట్‌ను ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఇక్కడ ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి పురోగతీ లేదు. మొదట్లో అధికారుల ఒత్తిడితో ఆరుగురు పునాదులు తవ్వినా, అక్కడితోనే వదిలేశారు. ఈ లేఅవుట్‌లో ఎటుచూసినా సరిహద్దు రాళ్లే కనిపిస్తున్నాయి. ఇక్కడికి వెళ్లేందుకు రోడ్డు కూడా లేదు. విద్యుత్తు స్తంభాలు, నీటివసతి, అంతర్గత రహదారులు.. ఏవీ లేవు. తాముండే ప్రాంతానికి దూరం కావడంతో పాటు, ప్రభుత్వ రాయితీ చాలా తక్కువగా ఉండటంతో ఇళ్లు కట్టలేకపోతున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు.

.

కంపచెట్లకు ఆవాసంగా పోణంగి లేఅవుట్‌: ఏలూరు నగర పరిధిలోని వన్‌టౌన్‌, టూటౌన్‌ ప్రాంతాలతోపాటు విలీన గ్రామాలకు చెందిన 8వేల మందికి ఏలూరుకు 5 కిలోమీటర్ల దూరంలోని పోణంగిలో స్థలాలు కేటాయించారు. అందులో 20 ఇళ్లను ప్రారంభించినా పునాది దశలోనే 16 ఆగిపోయాయి. మూడిళ్లు శ్లాబ్‌ దశకు చేరగా ఒక్కటే పూర్తయింది. అంతర్గత రహదారులు అరకొరగానే ఉన్నాయి. విద్యుత్తు సౌకర్యం పూర్తిగా కల్పించలేదు. నిర్మాణాలు మొదలుకాక, లేఅవుట్‌లో కంపచెట్లు మొలిచాయి.

అనకాపల్లిలో ఒక్కశాతమే పూర్తి: రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల పరిధిలో ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలిస్తే అనకాపల్లి అట్టడుగున ఉంది. ఈ జిల్లాకు 50 వేల గృహాలు మంజూరైతే పూర్తయినవి 409 (1%) మాత్రమే. 2% పూర్తితో పల్నాడు జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వైయస్‌ఆర్‌ జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధికంగా 1,05,966 ఇళ్లు కేటాయించినా పూర్తయినవి 2,241 మాత్రమే. అంటే 3%. మిగిలిన వాటిలోనూ పునాదులు దాటినవి 25,968. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో కేటాయించిన గృహాల్లో 11% (7,060 ఇళ్లు) పూర్తయ్యాయి. కృష్ణా జిల్లాలో ఇంకా 27 వేల ఇళ్లు, అన్నమయ్య జిల్లాలో 25వేలు, ఎన్టీఆర్‌, ప్రకాశం జిల్లాల్లో 23 వేల ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు ప్రారంభించలేదు.

బంగారం తాకట్టు పెట్టా: ‘నా భర్త, నేను కూలిపనులకు వెళ్తాం. ఏడాది నుంచి ఇంటి పునాది పనులకే నానాతిప్పలు పడుతున్నాం. ఇసుక, కంకర, ఇతర నిర్మాణ సామగ్రిని మేమే మోస్తున్నాం. ఎవరినైనా పెడదామన్నా.. కూలీలు, మేస్త్రీలకు అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటోంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోక ఇంట్లోని బంగారం తాకట్టుపెట్టి రూ.60వేలు తీసుకున్నాం. వడ్డీకి మరో రూ.1.50 లక్షలు తీసుకొచ్చాం.’ జుత్తిగ పద్మావతి, పాలకోడేరు, పశ్చిమగోదావరి జిల్లా

పునాదుల వరకు తవ్వి నిలిపివేశా: ‘నా భార్య పేరుతో స్థలం మంజూరైంది. పునాదులు తవ్వుకుని రాళ్లు, ఇసుక, ఇతర సామగ్రి సిద్ధం చేసుకున్నాం. ఇప్పటికే రూ.70వేలకు పైగా ఖర్చయ్యింది. రాయి ట్రిప్పు రూ.5వేలు నడుస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఏమాత్రం సరిపోదు. నిర్మాణం పూర్తిచేయాలంటే అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు. అందుకే పునాదుల వరకు తవ్వి వదిలేశా.’ - ఇమాములు, మద్దికెర, కర్నూలు జిల్లా

రూ.5 లక్షలు అవుతుందంటున్నారు: ‘పోణంగిలో స్థలం ఇచ్చారు. మేముండే ప్రాంతానికి ఇది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నీటి సదుపాయం లేదు. నిర్మాణ సామగ్రి దూరం నుంచి తెచ్చుకొవాలి. అన్నీ సమస్యలే కనిపిస్తున్నాయి. రూ.1.80 లక్షలతో ఇల్లు పూర్తికాదు. కనీసం రూ.5 లక్షలు అవుతుందని మేస్త్రి చెబుతున్నారు. రోజుకూలీలుగా పనిచేసుకునే మాలాంటి వాళ్లకు ఇల్లు కట్టుకునే స్థోమత లేదు. ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలి.’ - తుంపాల ప్రసన్నకుమారి, ఏలూరు

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.