ETV Bharat / city

CORONA PRECAUTIONS: కర్రకు కెమెరా కట్టి.. కరోనాను దూరం కొట్టి..!

author img

By

Published : Aug 12, 2021, 4:18 PM IST

corona precautions by a ration dealer
corona precautions by a ration dealer

ఆమె ఓ రేషన్ డీలర్. కరోనా రెండోదశలో మహమ్మారి బారినపడ్డారు. కోలుకున్నాక ఓ చక్కటి ఉపాయాన్ని ఆలోచించారు. బియ్యం కోసం దుకాణానికి వచ్చే వినియోగదారులకు, తనకు మధ్య భౌతిక దూరం పాటిస్తూ వివరాలు సేకరించేలా ఓ ఏర్పాటు చేశారు. ఆమె చేసిన ఈ ఆలోచనకు ప్రజలూ సహకరిస్తూ.. కరోనా జాగ్రత్తల నడుమ రేషన్​ తీసుకెళుతున్నారు.

కరోనా మహమ్మారి పౌర సమాజానికి పాఠాలే కాదు.. గుణపాఠాలూ నేర్పించింది. అప్రమత్తంగా ఉండకపోతే వైరస్​ బారిన పడక తప్పదని గ్రహించిన ప్రజలంతా ఎక్కడికక్కడ జాగ్రత్తలు పాటిస్తూ తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండోదశ ఉద్ధృతిలోనూ లక్షలాది మంది ప్రజలు కరోనా కాటుకు గురయ్యారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. మహమ్మారి ప్రజలను వదలడం లేదు.

ఈ క్రమంలోనే తెలంగాణలోని హైదరాబాద్ సింగరేణి కాలనీలో గత 23 ఏళ్లుగా రేషన్ దుకాణం నిర్వహిస్తోన్న పద్మ.. తన స్వీయ అనుభవం నుంచి చక్కటి ఆలోచన చేశారు. రేషన్ కోసం వచ్చే ప్రజలకు-తనకు కనీసం 5 అడుగుల భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. రేషన్ బియ్యం పంపిణీ చేయాలంటే ఐరిష్ లేదా మొబైల్ నెంబర్​ ఓటీపీ కావాలి. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చే వినియోగదారుల నుంచి వాటిని సేకరించేందుకు కర్రకు ఐరిష్ కెమెరా ఏర్పాటు చేశారు. దాని ద్వారా భౌతిక దూరం పాటిస్తూ వినియోగదారుల వివరాలు సేకరించి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.

CORONA PRECAUTIONS
కర్రకు కెమెరాతో వివరాలు సేకరిస్తూ..

తండ్రి ఇచ్చిన సలహా..

పద్మ గతంలో కరోనా బారినపడ్డారు. ఆమెతో పాటు ఆమె తండ్రీ మహమ్మారి కోరల్లో చిక్కుకున్నారు. ఇద్దరూ కొన్ని రోజులు హోం ఐసోలేషన్​లో ఉండి కోలుకున్నారు. దీంతో తండ్రి ఇచ్చిన సలహా మేరకు మళ్లీ వైరస్ బారినపడకుండా ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తనతో పాటు దుకాణానికి వచ్చే ప్రజలకూ కరోనా సోకకుండా ఉండాలంటే ఐరిష్ సేకరణకు భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని భావించారు. వినియోగదారులను కౌంటర్​కు 5 అడుగుల దూరంలో ఉంచి కర్రకు ఏర్పాటు చేసిన కెమెరా ద్వారా ఐరిష్ నమోదు చేసి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. రోజుకు సుమారు 150 నుంచి 200 మందికి ఈ పద్ధతిలోనే బియ్యం పంపిణీ చేస్తున్నారు.

CORONA PRECAUTIONS
భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు

స్థానికుల హర్షం..

ఈ రేషన్ దుకాణం ప్రధాన రహదారిపైనే ఉండటంతో అటువైపుగా వెళ్లేవారు పద్మ చేపట్టిన జాగ్రత్త చర్యలను చూసి అభినందిస్తున్నారు. సింగరేణి కాలనీవాసులతో పాటు బస్తీవాసులూ పద్మ సూచనలను పాటిస్తూ.. రేషన్ తీసుకెళ్తున్నారు. ఇలా నగరంలో మిగిలిన చోట్ల కూడా కరోనా జాగ్రత్త చర్యలను పాటించేలా ఏర్పాట్లు చేయాలని పలువురు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రెండోదశ కరోనా సమయంలో నేను వైరస్​ బారినపడ్డాను. కోలుకున్నాక ప్రజల నుంచి భౌతిక దూరం పాటించేందుకు మా నాన్న సలహా మేరకు ఇలా కర్రకు ఐరిష్​ కెమెరా ఏర్పాటు చేసి వివరాలు సేకరిస్తున్నాను. వినియోగదారులు కూడా మంచిగ సహకరిస్తున్నారు. ఇలా కొవిడ్​ జాగ్రత్తలు పాటిస్తూనే రోజూ 150 నుంచి 200 మందికి రేషన్​ ఇస్తున్నాం. -పద్మ, రేషన్​ డీలర్

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.