వైకాపా ప్రభుత్వ పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 6 నెలల పాలనను 6 ముక్కల్లో చెప్పాలంటే... విధ్వంసం, దుందుడుకుతనం, కక్ష సాధింపు, మానసిక ఆవేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం అంటూ ధ్వజమెత్తారు. కూల్చివేత పర్వంతో మొదలైన వారి పాలన... ఉద్దేశపూర్వక వరద రాజకీయాలు చేసేవరకూ వెళ్లిందన్నారు.
కోడెలను ఆత్మహత్యకు పురిగొల్పారు...
పోలవరం కాంట్రాక్టు, విద్యుత్ ఒప్పందాల రద్దు, రాజధాని అమరావతి నిర్మాణం నిలుపుదల, సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం రద్దు, ఆర్బిట్రేషన్లను పవన్ ప్రస్తావించారు. విపక్ష నాయకులు, కార్యకర్తలను కేసుల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. మాజీ స్పీకర్ కోడెలను ఆత్మహత్యకు పురిగొల్పారని... జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేలా జీవో తెచ్చారని వ్యాఖ్యానించారు.
కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తారా?
గ్రామ వాలంటీర్ల పేరిట 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి... 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు బతుకు లేకుండా చేశారని జనసేనాని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ తీరుతో 65 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్తు గాల్లో దీపంలా మారిందన్నారు.
మానసిక వేదనకు గురి చేస్తారా..?
ఆంగ్ల మాధ్యమం పేరిట 90 వేల మంది తెలుగు ఉపాధ్యాయులను మానసిక వేదనకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఆంగ్ల బోధనతో తెలుగు భాష, సంస్కృతి విచ్ఛిన్నానికి సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. అమరావతి నిర్మాణం జరుగుతుందా, నవరత్నాలకు నిధులు ఉన్నాయా, కేంద్రం నిధులు ఇస్తుందా, ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుందా అనే అనిశ్చితి కొనసాగుతోందని పవన్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: