ETV Bharat / city

సమాచారం లేక జనం అవస్థలు.. కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా దొరకని టీకా

author img

By

Published : May 4, 2021, 11:18 AM IST

second dose
రెండవ డోసు టీకాలు

రాష్టంలో టీకాల పంపిణీపై స్పష్టత లేకపోవటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో వ్యాక్సిన్​ సమాచారంపై రోడ్ల వెంట తిరగాల్సిరావటం ఇబ్బందిగా మారింది. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు వేసుకున్నవారికి రెండవ డోసు తీసుకునేందుకు.. ఆ టీకాలు ఏ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయో తెలియటం లేదు.

రాష్ట్రంలో టీకా పంపిణీపై అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లో ఏది ఎక్కడ వేస్తున్నారన్న విషయమై స్పష్టత లేనందున లబ్ధిదారులు గందరగోళపడుతున్నారు. ప్రతి జిల్లాలో కనీసం 100 నుంచి 170 చొప్పున టీకా కేంద్రాలు ఉన్నా... కొన్నింటిలో టీకాల పంపిణీ జరగడంలేదు. ఈ విషయం తెలియక కేంద్రాల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో టీకా కోసం రోడ్ల వెంట తిరగాల్సి వస్తుండడం... ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న వారికి ఇబ్బందికరంగా మారింది. అలాగే రెండో డోసు టీకా వేయించుకోవాలని చరవాణులకు వస్తోన్న సంక్షిప్త సమాచారాన్ని అనుసరించి కొందరు ఆయా పంపిణీ కేంద్రాలకు వెళ్తున్నా అక్కడ టీకా ఉండడంలేదు. మరో రోజు రావాలని ఒకసారి... ఎప్పుడు వేస్తామో తెలియదని మరోసారి అక్కడి సిబ్బంది చెబుతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఒంగోలు నగరానికి చెందిన ఇందుర్తి కోటేశ్వరరావు దంపతులకు ఏప్రిల్‌ 29న రెండో డోసు వేయించుకోవాలని చరవాణికి మెసేజ్‌ వచ్చింది. ఆ మేరకు సంబంధిత కేంద్రానికి వెళ్లగా అక్కడ ఎవరూ లేరు. మరో కేంద్రానికి వెళ్లగా రెండో డోసు ఇవ్వడంలేదని, వారు వేయించుకున్న కంపెనీ టీకా పంపిణీ జరగడంలేదని చెప్పడంతో వెనక్కి వచ్చారు. ఇలాంటి పరిస్థితులు విజయవాడతోపాటు ఇతరచోట్ల కూడా నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీలోగా సుమారు లక్ష మందికి రెండో డోసు కింద టీకాల పంపిణీ జరగాల్సి ఉంది. జిల్లా టీకాల పంపిణీ పర్యవేక్షక అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘టీకా డోసులు అరకొరగా వస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మేము ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చిన డోసులను అనుసరించి కొన్నిచోట్లకు మాత్రమే పంపిణీ చేయగలుగుతున్నాం. దీనివల్ల కొన్ని కేంద్రాల్లో తాకిడి ఎక్కువగా ఉంటోంది. సాధ్యమైనంత వరకు ముందురోజే టీకా పంపిణీ వివరాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బంద్‌
ప్రభుత్వ కేంద్రాల్లోనే కాకుండా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నిర్ణీత రుసుముతో టీకా వేయించడాన్ని ఈనెల 1 నుంచి వైద్య ఆరోగ్య శాఖ నిలిపేసింది. దీనివల్ల కూడా కొందరు ఇబ్బంది పడుతున్నారు.

పడకల కోసమే కాకుండా...
పలుచోట్ల పడకల కోసమే కాకుండా... టీకాల కోసం కూడా సిఫార్సులు అనివార్యం అవుతున్నాయి. కొందరు స్థానిక నాయకులు టీకాల కోసం ఒత్తిడి తెస్తున్నారని ఓ వైద్యుడు తెలిపారు. జిల్లాల్లో టీకా పంపిణీ కేంద్రాల గురించి సమాచారం ఉన్నా...ఎప్పుడు? ఏ రకం టీకా వేస్తారన్న సమాచారం లబ్ధిదారులకు ఉండడంలేదు. తొలి డోసు కింద కొవిషీల్డ్‌ మాత్రమే ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. అయితే....దీని గురించి కొందరికి తెలియడంలేదు. యథావిధిగా వారు కేంద్రాలకు వెళ్తుండగా వారు కోరుకున్న టీకా లేదని చెబుతున్నారు. రెండు, మూడు గంటలపాటు వేచి ఉన్న తర్వాత ఈ సమాచారం వస్తుండడంతో ఆవేదన చెందుతున్నారు. తొలి డోసు కింద కొవాగ్జిన్‌ తీసుకున్న వారు రెండో డోసు కోసం కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొన్నిచోట్ల ఆ వ్యాక్సిన్‌ లేదని తెలిసి ఆందోళన చెందుతున్నారు. ‘‘కేంద్రం నుంచి వచ్చిన డోసులను వెంటనే జిల్లాలకు పంపిస్తున్నాం. రెండో డోసు పంపిణీకి ప్రాధాన్యం ఇస్తున్నాం. స్థానికులకు పూర్తి సమాచారం తెలియచేయాలని సమావేశాల ద్వారా చెబుతూనే ఉన్నాం’’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఈ నెల 3వ తేదీ ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి 66,95,265 మందికి టీకా వేశారు.

ఇదీ చదవండి: కొవిడ్‌-19 చికిత్సకు నాట్కో ఔషధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.