ETV Bharat / city

తల్లికి పాజిటివ్‌ ఉన్నా బిడ్డకు పాలివ్వచ్చు.. ముప్పు తక్కువే!

author img

By

Published : May 20, 2021, 11:03 AM IST

breastfeed to kids
breastfeed to kids

తొలి, రెండో విడతలో నవజాత శిశువులతో పాటు పిల్లలకు కరోనా సోకినా ముప్పుగా మారకపోవడం పెద్ద ఊరట. మూడో విడతలో చిన్నారులపై తీవ్ర ప్రభావం ఉంటుందనే నిపుణుల సూచనలతో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నవజాత శిశువుల్లో కరోనా సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన తక్షణావసరం.

సాధారణంగా తల్లి కడుపులో ఉన్నప్పుడు శిశువుకు కరోనా సోకదు. ప్రసవం అనంతరం కొందరు చిన్నారులు దీని బారిన పడుతున్నారు. వారిలో వైరస్‌ తగ్గాక మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌(ఎంఐఎస్‌సీ) ఉత్పన్నమవుతోంది. దీనివల్ల జ్వరం, కళ్లు ఎర్రబడడం, పాలు తాగలేకపోవడం, నాలుక గులాబీ రంగులోకి మారడం, లింఫ్‌ నోడ్స్‌ వాపు, వాంతులు, విరేచనాలు తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులకు చూపించడం వల్ల ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. చికిత్సలో జాప్యం జరిగితే ప్రాణ హాని ఉంటుందని గుర్తించాలి. గతేడాది గాంధీ ఆసుపత్రిలో ఈ సమస్యతో 38 మంది చికిత్స తీసుకున్నారు. వీరిలో నెల రోజుల్లోపు చిన్నారులూ ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటి కేసులు నమోదు కాలేదని గాంధీ వైద్యులు తెలిపారు. అయితే నవజాత శిశువులు ఇంట్లో ఉంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కడుపులో ఉన్నప్పుడు కరోనా రాదు

కిం కర్తవ్యం?

అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లుల ద్వారా కరోనా సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... లక్షణాలు ఎలా గుర్తించాలి... తదితర విషయాలపై జాతీయ నియోనాటాలజీ విభాగం (తెలంగాణ చాప్టర్‌) తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో సాధారణ సందేహాలకు సమాధానాలు పొందుపరిచింది..అవి ఏంటంటే...

తెలంగాణ చాప్టర్ ప్రకారం

చంటిబిడ్డల్లో ఎంత శాతం మందిలో కరోనా సోకే అవకాశం ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 8-9 శాతం మందిలో వైరస్‌ కనిపిస్తోంది

నవజాత శిశువుల్లో లక్షణాలు ఎలా ఉంటాయి?
సుమారు 80 శాతం పిల్లలకు కరోనా సోకినా ఎలాంటి లక్షణాలు ఉండవు. కొందరిలో మాత్రం నిమోనియా తదితర సమస్యలు స్పల్పంగా బయటపడుతుంటాయి.

పాజిటివ్‌ తల్లులు తమ బిడ్డలకు వ్యాధి సోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
తల్లికి కరోనా నిర్థారణ అయినా ఆరోగ్యంగా ఉంటే చంటి బిడ్డను ఆమె సంరక్షణలోనే ఉంచాలి. తల్లి ఎన్‌95 లేదంటే డబుల్‌ మాస్క్‌ ధరించాలి. పాలు ఇవ్వని పక్షంలో బిడ్డని రెండు మీటర్ల దూరంలో పెట్టాలి.

తల్లి పాలు ఇవ్వవచ్చా?

కరోనా సోకిన తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వవచ్చా? శిశువులకు ఏ పాలు శ్రేయస్కరం?
తల్లిపాలలో కరోనా వైరస్‌ ఉన్నట్లు ఇంతవరకు రుజువు కాలేదు. నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేయస్కరం. వ్యాధి నిరోధక శక్తి పెంచి ఇన్‌ఫెక్షన్లను అరికడతాయి. ఒకవేళ తల్లి పాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆమె నుంచి సేకరించి వాటిని బిడ్డకు పట్టించాలి. ఐసీయూలో ఉంటే మదర్స్‌ మిల్క్‌ బ్యాంకు నుంచి తీసుకోవాలి. అక్కడా వీలుకాకపోతే ఫార్ములా మిల్క్‌ను ఆశ్రయించవచ్చు.

మంచి పుడ్ తీసుకోవాలి

కొవిడ్‌ పాజిటివ్‌ తల్లులు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?
పోషకాహారం తీసుకోవాలి, తాజా కూరగాయలు, పండ్లు, గుడ్డు, ఫ్యాట్‌ తక్కువ ఉండే చికెన్‌, చేపలు తీసుకోవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ పౌష్టికాహారం అవసరం.

కొవిడ్‌ వచ్చిన తల్లి శిశువులకు ఎక్కడ చికిత్స అందిస్తారు?
ప్రభుత్వ ఆసుపత్రులు నిలోఫర్‌, గాంధీ ఇతర మెడికల్‌ కళాశాలల అనుబంధ ఆసుపత్రుల్లో ఎస్‌ఎన్‌సీయూలు, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. పాజిటివ్‌తో వచ్చిన చంటి పిల్లలకు గాంధీలో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. తల్లికి సీరియస్‌గా ఉండి చూసుకునే వారు ఎవరూ లేకపోతే అలాంటి చంటి బిడ్డలను యూసఫ్‌గూడలోని శిశు విహార్‌లోని ట్రాన్సిట్‌ హోంలో సంరక్షిస్తారు. తల్లికి వ్యాధి తగ్గిన తర్వాత తిరిగి అప్పగిస్తారు.

గర్భిణులు, పాలిచ్చే తల్లులు కరోనా నియంత్రణ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా?
ప్రస్తుతం గర్భిణులకు ఈ వ్యాక్సిన్‌ ఇవ్వటానికి అనుమతులు లేవు. అయితే పాలిచ్చే తల్లులు కరోన టీకా తీసుకోవచ్చు. వ్యాక్సిన్‌ వల్ల తల్లికి వచ్చే యాంటిబాడీలు తల్లిపాల ద్వారా బిడ్డకు చేరి వ్యాధి నిరోధకత పెరిగే అవకాశం ఉంది.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు..

చిన్న పిల్లల విభాగాధిపతి

* పిల్లల్లో కరోనా మరణాల రేటు చాలా తక్కువ. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం 0.01% మాత్రమే. కాబట్టి తల్లిదండ్రులు అనవసర ఆందోళనకు గురి కావద్దు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంఐఎస్‌సీ లక్షణాలు గుర్తించినప్పుడు మాత్రం ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* పిల్లల్లో కరోనా వచ్చి తగ్గింది కదా...ఇక ఎంఐఎస్‌సీ ముప్పు తప్పదనే ఆందోళన అక్కర్లేదు. వంద మంది పిల్లల్లో ఒక్కరిలోనే ఈ సమస్య కనిపిస్తుంది. అది కూడా ముందే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చు.
* కొవిడ్‌ ఉంటే తల్లికి సిజేరియన్‌ చేయడం తప్పనిసరి కాదు. ఇబ్బంది ఉంటే మాత్రమే చేయాలి.

* డెలివరీ సమయంలో శిశువుకు, తల్లికి అనుసంధానమైన బొడ్డుతాడును 1-3 నిమిషాల తర్వాత కట్‌ చేయాలి. ఫలితంగా శిశువుకు మరింత రక్త ప్రసరణ జరిగి, ఆరోగ్యంగా ఉండడానికి సాయపడుతుంది.

-డాక్టర్‌ తోట ఉషారాణి, చిన్న పిల్లల విభాగాధిపతి, నిలోఫర్‌ ఆసుపత్రి

పుట్టిన 24 గంటల తర్వాత ఆర్టీపీసీఆర్‌ టెస్టు

చిన్న పిల్లల వైద్య నిపుణులు


* శిశువు పుట్టిన 24 గంటల తర్వాత చిన్నారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేస్తారు. ఒకవేళ తల్లితో పాటు శిశువుకు పాజిటివ్‌ ఉంటే తల్లికి సమీపంలోనే కొంచెం దూరంలో ఉంచుతారు.
* తల్లి మాస్క్‌ ధరించడంతో పాటు చేతి శుభ్రత పాటించి పాలు ఇవ్వాలి. పాలిచ్చే సమయంలో తల్లి శ్వాస పిల్లలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* పిల్లలకు కొవిడ్‌ ఉంటే సొంత వైద్యం పనికిరాదు. వైద్యుల సూచనలతోనే తీసుకోవాలి. కొన్నిసార్లు పరిస్థితి తీవ్రంగా ఉంటే ఇమ్యూనోగ్లోబులిన్‌(ఐవీఐజీ), స్టిరాయిడ్స్‌ వాడతారు. కొంచెం పెద్ద పిల్లల్లో ఆయాసం, దగ్గు లాంటివి ఉంటే ఆక్సిజన్‌ స్థాయిలు చూడాలి. తగ్గితే వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి.

- డాక్టర్‌ మంచుకొండ రంగయ్య, చిన్న పిల్లల వైద్య నిపుణులు

ఇదీ చూడండి:

కరోనా సోకిందా.. కంగారుపడొద్దు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.