ETV Bharat / city

ఈనెల 31 వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దు: సీఎం

author img

By

Published : Mar 22, 2020, 7:32 PM IST

Updated : Mar 22, 2020, 10:49 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్రమంతటా లాక్​డౌన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 తేదీ వరకూ లాక్​డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు. పరిస్థితులను అంచనా వేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నామని చెప్పారు. ప్రైవేటు సంస్థలు కూడా మూసి వేయాలని స్పష్టం చేశారు.

lockdown-in-state-till-31st-this-month-due-to-caroona-affect
lockdown-in-state-till-31st-this-month-due-to-caroona-affect

ఈనెల 31 వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దు: సీఎం

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అన్ని కార్యకలాపాలకూ లాక్​డౌన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి ప్రకటించారు. అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులు మినహా మిగతా అన్ని కార్యకలాపాలు మార్చి 31 తేదీ వరకూ నిలిపివేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసరం కాని దుకాణాలు, మాల్స్ ఇతర వాణిజ్య సంస్థలన్నీ మూసివేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అలాంటి వారిపై కఠిన చర్యలు

నిత్యావసరాలు ఎక్కువ ధరలకు విక్రయించొద్దని సీఎం జగన్ హెచ్చరించారు. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంచి విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుంటామని హెచ్చరించారు. ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీని కోసం ధరల పట్టికను విడుదల చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబరు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు.

దర్శనాల నిలిపివేతకు ఆదేశాలు

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు నిర్వహణకు అవసరమైన స్కెలిటన్ స్టాఫ్​ మాత్రమే హాజరుకావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మందిరాలు, మసీదులు, చర్చిల్లోనూ 31 తేదీ వరకూ దర్శనాల నిలిపివేతకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్రాల మధ్య ప్రజా, ప్రైవేటు రవాణా నిలిపివేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అంతర్గత రవాణా కోసం వినియోగించే ఆటోలు, ట్యాక్సీలను నిలిపివేయాల్సిందిగా సూచించారు. ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పరీక్షలు యధాతథం

మరోవైపు విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకూడదనే యధావిథిగా పదో తరగతి పరీక్షల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా చర్యలు చేపడతామని కనీసం 2 మీటర్ల దూరం ఉంచి పరీక్ష రాయించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తప్పని పరిస్థితుల్లోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. సమావేశ పరిచే రోజులను తగ్గిస్తామని సీఎం జగన్ తెలిపారు.

పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ప్రజలు మరికొన్ని రోజులు తమ ఇళ్లలో ఉండటం ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించే అవకాశముందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. పదిమంది కంటే ఎక్కువ గుమిగూడవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే దీనికి సంబధించి నిషేధాజ్ఞలు జారీ చేయాలని నిర్ణయించామన్నారు.

ఇదీ చదవండి :

రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. వెయ్యి నగదు: సీఎం జగన్

Last Updated :Mar 22, 2020, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.