ETV Bharat / city

ఇంకోసారి ప్యాకేజీ అని మాట్లాడితే.. వైకాపాపై పవన్‌ ఘాటు వ్యాఖ్యలు

author img

By

Published : Oct 18, 2022, 2:43 PM IST

Updated : Oct 18, 2022, 7:12 PM IST

Pawan Kalyan Fires on YSRCP: ఇంకోసారి ప్యాకేజీ స్టార్‌ అంటే తీవ్ర పరిణామాలు తప్పవని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. వైకాపాలో నీచుల సమూహం ఎక్కువన్న పవన్‌.. కులాల పేరు పెట్టి విమర్శలు చేయడం సభ్యతా అని నిలదీశారు. జనసేన కార్యకర్తల సమావేశంలో వైకాపా నేతలపై జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan Fires on YSRCP
Pawan Kalyan Fires on YSRCP

వైకాపాపై పవన్​ కల్యాణ్​ ఆగ్రహం

Pawan Kalyan Fire on YSRCP: ఈసారి ప్యాకేజీ అని ఎవరైనా మాట్లాడితే దవడ వాచిపోయేలా కొడతానని జనసేన అధినేత పవన్​కల్యాణ్​ ధ్వజమెత్తారు. ఇంతకాలం తన సహనమే వైకాపాను కాపాడిందని జనసేన కార్యకర్తల సమావేశంలో అన్నారు. 'బాపట్లలో పుట్టా.. గొడ్డు కారం తిని పెరిగా.. ఒంగోలు గోపాలనగరంలో వీధి బడిలో చదివా' అని వ్యాఖ్యానించారు. ఇంకోసారి ప్యాకేజీ అని మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభ్యత, సంస్కారం ఉన్నవాళ్లం కాబట్టే మౌనంగా ఉన్నామన్నారు. జనసేనల్ని తిట్టే ప్రతి వ్యక్తి తోలు ఒలిచేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేటి నుంచి యుద్ధమే.. మీరు సిద్దమా??: వైకాపాతో యుద్ధానికి తాను సై అని పవన్​ అన్నారు. రాడ్లు.. హాకీ స్టిక్కులు.. దేంతో వస్తారో రండి తేల్చుకుందామంటూ సవాల్​ విసిరారు. ఇప్పటివరకు తన సహనం చూశారన్న పవన్​.. ఇవాళ్టి నుంచి యుద్ధమే.. మీరు రెడీనా అంటూ ఛాలెంజ్​ చేశారు. 3 పెళ్లిళ్లు చేసుకున్నానని పదేపదే మాట్లాడుతున్నారే.. విడాకులు ఇచ్చిన తర్వాతే ఇంకొకరిని చేసుకున్నానని స్పష్టం చేశారు. చట్టప్రకారం వారికి భరణం చెల్లించానని.. మొదటి భార్యకు రూ.5 కోట్లు, రెండో భార్యకు ఆస్తి రాసిచ్చానని చెప్పారు.

వైకాపాలో నీచుల సమూహం ఎక్కువ : వైకాపాలో అంతా నీచులని అనడం లేదని.. నీచుల సమూహం ఎక్కువ అని మండిపడ్డారు. కులాల పేరు పెట్టి విమర్శలు చేయడం సభ్యతా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి నాకు పోరాట పటిమ వచ్చిందని పవన్‌ అన్నారు. కడుపు కాలితే చేసే పోరాటమే యుద్ధం అని.. తన గుండె చప్పుడైన తెలంగాణ నుంచి వచ్చిందే ఈ పోరాటం అని తేల్చిచెప్పారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని తాము ఊరికే చెప్పలేదని.. పల్నాడు బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకుని చెప్పానని పవన్​ అన్నారు. మాల కులానికి చెందిన కన్నమనాయుడుని సైనికాధిపతిగా చేశారని గుర్తు చేశారు. అన్ని కులాలు సమానమని చెప్పేందుకు చాపకూడు సిద్ధాంతం తెచ్చారన్నారు.

అధికారం అనేది ఒకటి, రెండు కులాలకే పరిమితమైందన్న పవన్‌.. అణగారిన, వెనుకబడిన వర్గాలకు అధికారం రావాలని అభిప్రాయపడ్డారు. చాలా కులాలు.. జనాభా ఉండి అధికారం రాలేదని బాధపడుతున్నారని చెప్పారు. వైకాపాలోని కాపు నేతలు జగన్‌కు ఊడిగం చేస్తే సరిపోతుంది కానీ.. కాపులను మాత్రం లోకువ చేయవద్దని హెచ్చరించారు.

పదవుల గురించి నేను తాపత్రయ పడట్లేదు : విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాయలసీమలో ప్రాణత్యాగాలు చేశారని.. మరి వైకాపా నేతలు ఏం చేశారని దుయ్యబట్టారు. కనీసం ఆ త్యాగధనుల చరిత్ర వైకాపా నాయకులకు తెలుసా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర కోసం వైకాపా నేతలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. కనీసం ఉక్కు కర్మాగారం కోసం గనులు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. 'కార్మికులారా మీరు నిలబడతారా.. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా మేం బాధ్యత తీసుకుంటాం' అని పవన్​ హామీ ఇచ్చారు. మీరు ఇంట్లో కూర్చుని మమ్మల్ని పోరాటం చేయమంటే చేయలేమని పవన్​ అన్నారు. పటేల్ తర్వాత అత్యంత బలమైన అమిత్​ షాతో తాను ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడానని చెప్పారు. పదవుల గురించి నేను తాపత్రయం పడటం లేదని.. ముఖ్యమంత్రి అయితే మొదటగా అభివృద్ధి కోసమే పని చేస్తానని పవన్​ హామీ ఇచ్చారు.

మహా చైతన్యవంతమైన నేల తెలంగాణ : తెలంగాణ మహా చైతన్యం ఉన్న నేల అని పవన్‌కల్యాణ్‌ కొనియాడారు. 1947లో కర్నూలులో మనం జెండా ఎగురవేశామని.. తెలంగాణకు 1948లో స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. రజాకార్ల దాష్టీకాలతో తెలంగాణ ప్రజలు నలిగిపోయారన్నారు. ఆనాటి తెలంగాణ ప్రజల్లో ఇంకా ఉందన్న పవన్‌.. శ్రీకాంతాచారి సహా వెయ్యిమంది బలిదానాలు చేశారని గుర్తు చేశారు. త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందన్న పవన్‌.. ఆంధ్రాలో మాదిరిగానే తెలంగాణలో అన్నీ కులాలు ఉన్నాయని.. అన్నీ కులాల్లోనూ తెలంగాణ అనే భావన ఉంది అని స్పష్టం చేశారు.

మారనున్న రాజకీయ చిత్రం: జనసేన పార్టీ సిద్ధంగా ఉందన్న పవన్​.. ఇవాళ్టి నుంచి రాష్ట్ర రాజకీయ చిత్రం మారుతుందని ఉద్ఘాంటించారు. గవర్నర్ వద్దకు మా పార్టీ బృందం వెళ్తుందని తెలిపారు. నేను భాజపా వద్దకు వెళ్లి రోడ్‌మ్యాప్‌ అడగడంపై కొందరు విమర్శించారని.. ఎవరి వద్దకు వెళ్లినా ఆత్మాభిమానం మాత్రం చంపుకోనని స్పష్టం చేశారు. భాజపా అంటే గౌరవం ఉంది కానీ ఊడిగం చేయనని తేల్చిచెప్పారు. భాజపాతో పొత్తు ఉన్నా.. ఎందుకో పూర్తిస్థాయిలో కలిసి వెళ్లలేకపోతున్నామన్నారు. ఈ విషయం భాజపా రాష్ట్ర నాయకత్వానికి తెలుసన్న పవన్​.. ప్రధాని, భాజపా నాయకత్వం అంటే నాకు గౌరవమే అన్నారు.

కొండగట్టు నుంచే రాజకీయం : తెలంగాణలో పోటీపై కూడా పవన్​ మాట్లాడారు. తెలంగాణలో 7 నుంచి 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీకి జనసేన సిద్దంగా ఉందని పవన్‌ తెలిపారు. తెలంగాణలో కొండగట్టు నుంచి రాజకీయం మొదలుపెడతానని ప్రకటించారు. జనసేన నుంచి అందరూ టీవీ డిబేట్లకు వెళ్లండి.. వాళ్లు విధానాలు మాట్లాడితే మీరూ విధానాలు మాట్లాడండి.. వాళ్లు తిడితే మాత్రం జనం ముందే కుమ్మేయండని పిలుపునిచ్చారు.

చావో.. రేవో రాజకీయాల్లోనే. సినిమాలు చేస్తా.. పార్టీని బతికించాలి కదా. గూండాలు బెదిరిస్తే.. చూస్తూ ఊరుకునేది లేదు. భారతమ్మను ఎవరో ఏదో అన్నారని వైకాపా నేతలు బాధపడ్డారే.. మరి నా కన్నతల్లిని ఇష్టానుసారంగా తిట్టించారన్నారు. -పవన్​కల్యాణ్​

ఇవీ చదవండి:

Last Updated :Oct 18, 2022, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.