ETV Bharat / city

దర్భంగా పేలుడు ఘటనలో ఇద్దరు హైదరాబాదీలు అరెస్ట్​

author img

By

Published : Jun 30, 2021, 10:32 PM IST

Darbhanga blast incident
దర్భంగా పేలుడు ఘటన

బిహార్‌లో జరిగిన దర్భంగా పేలుడు ఘటనలో.. హైదరాబాద్​కి చెందిన ఇద్దరు సోదరులను ఎన్​ఐఏ అరెస్టు చేసింది. వీరు లష్కరే తొయిబా ఉగ్రవాదులుగా తేల్చింది. ఈ పేలుడు ఘటనలో సికింద్రాబాద్ నుంచి పార్సిల్ వెళ్లినట్లు ఎన్​ఐఏ గుర్తించింది.

దర్భంగా పేలుడు కేసులో ఇద్దరు హైదరాబాద్ సోదరులను ఎన్​ఐఏ అరెస్టు చేసింది. హైదరాబాద్​ నాంపల్లికి చెందిన ఇమ్రాన్ ఖాన్, నసీర్ ఖాన్​ను అరెస్టు చేసినట్లు ధ్రువీకరించింది. ఇమ్రాన్ ఖాన్, నసీర్ ఖాన్ లష్కరే తొయిబా ఉగ్రవాదులుగా తేల్చింది. దర్భంగా రైల్వే స్టేషన్‌లో జూన్ 17న పార్సిల్ బాంబు పేలుడు జరిగింది. సికింద్రాబాద్ నుంచి పార్సిల్ వెళ్లినట్లు గుర్తించింది. దేశవ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తినష్టం చేసేలా ఎల్‌ఈటీ కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది.

మహ్మద్ నసీర్ ఖాన్ 2012లో పాకిస్థాన్ వెళ్లి ఎల్ఈటీలో శిక్షణ పొందాడని ఎన్ఐఏ తెలిపింది. రసాయనాలతో ఐఈడీ తయారు చేయడంలో నసీర్ శిక్షణ పొందాడని, సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి ఐఈడీ తయారు చేశాడని వెల్లడించింది. వస్త్రాల్లో ఐఈడీ పెట్టి సికింద్రాబాద్-దర్భంగా రైల్‌లో పార్సిల్ పంపారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. రైలులో పేలి మంటలు వ్యాపించి ప్రాణ నష్టం జరిగేలా కుట్ర చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. నసీర్, ఇమ్రాన్ పాక్‌లో లష్కరేతొయిబా ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నారని, నిందితులను లోతుగా ప్రశ్నించి భారీ కుట్రను ఛేదించాల్సి ఉందని ఎన్ఐఏ స్పష్టం చేసింది.

నకిలీ చిరునామాతో...

55 కిలోల బరువున్న చీరల పార్శిల్ మధ్యలో పేలుడు స్వభావం ఉన్న రసాయన సీసాను నిందితులు ఉంచారు. ఈ నెల 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో పార్శిల్​ను దర్బాంగాకు సుఫియాన్ అనే వ్యక్తి పేరుతో నకిలీ పాన్​కార్డు చూపించి పంపించారు. దర్బాంగాలో పార్శిల్ తీసుకునే వ్యక్తి పేరు కూడా సూఫియాన్ అనే రాసి ఉంచారు. ఫోన్​ నంబర్ కూడా నకిలీదే ఇచ్చారు. 17న దర్బాంగాలో పార్శిల్​ను రైల్లోంచి తీసిన తర్వాత స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్​కు...

ఉత్తరప్రదేశ్​లోని ఖైరానాకు చెందిన నసీర్ రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్​కు వచ్చి ఆసీఫ్​నగర్​లో స్థిరపడ్డాడు. వస్త్ర వ్యాపారం చేస్తూ హైదరాబాద్​కు చెందిన యువతినే పెళ్లి చేసుకున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. ఏడాది క్రితం నసీర్ సోదరుడు ఇమ్రాన్ కూడా హైదరాబాద్​కు వచ్చి ఆసిఫ్​నగర్​లోనే మరో గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయితే వీళ్లిద్దరూ... ఓ ఉగ్రవాది ఆదేశాలు పాటిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: YSR Bima: రేపు వైఎస్​ఆర్​ బీమా పథకం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.