ETV Bharat / city

సాంకేతిక లోపంతో సొమ్ము ఉపసంహరణ... ప్రభుత్వం అఫిడవిట్​

author img

By

Published : Jul 13, 2022, 8:14 AM IST

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్​ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరణ సాంకేతికలోపం కారణంగానే జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఉపసంహరించిన నగదును ఇతర అవసరాలకు మళ్లించలేదని పేర్కొంది. ట్రెజెరీ నిబంధనల మేరకు మార్చి 31నాటికి పెండింగ్‌ బిల్లులన్నీ రద్దవుతాయని, ఆ తరువాత వాటిని డీడీవోలు తిరిగి సమర్పిస్తారని తెలిపింది. ఏజీ దాఖలు చేసిన అదనపు కౌంటర్‌ అఫిడవిట్‌ కోర్టు రికార్డుల్లో లేకపోవడంతో విచారణను జూలై 22కి వాయిదా వేసింది.

GPF accounts
ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరణ సాంకేతిక లోపంతోనే జరిగిందని, ఆ నగదును ఇతర అవసరాలకు బదిలీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. డీడీవోలు తిరిగి సమర్పించిన బిల్లులను ట్రెజరీ శాఖ క్లియర్‌ చేయగానే డెబిట్‌ అయిన నగదు మళ్లీ ఉద్యోగుల ఖాతాల్లోకి వెళుతుందని పేర్కొంది. ఈ మేరకు ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు మంగళవారం హైకోర్టులో అఫిడవిట్‌ వేశారు. బిల్లులను తిరిగి సమర్పించడం, క్లియర్‌ చేసే ప్రక్రియ మొదలైందన్నారు.

ట్రెజరీ నిబంధల ప్రకారం మార్చి 31 నాటికి పెండింగ్‌లో ఉన్న బిల్లులన్ని రద్దువుతాయని, ఆ తర్వాత బిల్లుల్ని తిరిగి సమర్పిస్తారన్నారు. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జీపీఎఫ్‌ సొమ్ము ఉపసంహరణపై పిటిషనర్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌కు సమాధానంగా (రిప్లై) ప్రభుత్వం వేసిన ఈ కౌంటర్‌ రికార్డుల్లోకి చేరకపోవడంతో విచారణను హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ప్రభుత్వం వింత కారణాలు చెబుతోంది..
జనవరి 17న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ (వేతన సవరణ) ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఛైర్మన్‌ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఏ ఉద్యోగి సొమ్మునూ రికవరీ చేయవద్దని ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మంగళవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు రాగా.. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.రవితేజ వాదనలు వినిపిస్తూ.. జీపీఎఫ్‌ సొమ్ము ఉపసంహరణపై ప్రభుత్వం చెబుతున్న కారణం వింతగా ఉందన్నారు. భవిష్యత్తులో పిటిషనర్‌కు రెండోసారి సొమ్ము క్రెడిట్‌ అవుతుందనే అనుమానంతో డబ్బులు ఉపసంహరించినట్లు కౌంటర్లో పేర్కొన్నారని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.