విష జ్వరాలు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఒక్కసారిగా ఆస్పత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. నెల రోజుల చిన్నారి మెుదలు వృద్ధుల వరకు డెంగ్యూ లక్షణాలు, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. నిర్లక్ష్యంతో కొంత మంది ప్రాణాలు కోల్పోతుంటే... మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిస్తున్నారు. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని పెద్ద నగరాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు ఆలస్యం అవుతాయన్న కారణంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నాయి.
ఈ ఏడాదే అధికం..
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జ్వర పీడితుల సంఖ్య బాగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. అతి తక్కువ మందిలో కనబడే టైఫాయిడ్ వైరల్ జ్వరాల సంఖ్య పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం ఎక్కువగా ఉండి... మూడు రోజులుగా తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కొంత మంది పరిస్థితి చేదాటిపోయిన తర్వాత తమ వద్దకు తీసుకువస్తున్నారని... ఫలితంగా రోగి ప్రాణాలు కాపాడలేకపోతున్నామని చెప్పారు.
వేలల్లో ఖర్చులు ..
ప్రైవేట్ ఆస్పత్రుల్లో జ్వర పీడితులకు వైద్యం ఆర్థికంగా భారంగా మారుతోంది. విష జ్వరంతో ఆస్పత్రికెళ్తే రూ. 20 వేల వరకు ఖర్చు అవుతోంది. డెంగ్యూ జ్వరం వస్తే రూ.50 వేల 2 లక్షల వరకూ డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో అప్పులు చేసి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో గత 8 నెలల్లోనే మలేరియా , టైఫాయిడ్ , డెంగీ సహా అన్ని రకాల జ్వరాలు కలిపి 8500 వరకూ అధికారికంగా నమోదయ్యాయి. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ప్రస్తుతం 150 నుంచి 400 మంది వరకూ వస్తున్నారు.
జాగ్రత్త పడండిలా..
జ్వరాలు రాకుండా ఉండేందుకు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదని చెప్పారు. చిన్నారులకు కాచి వడబోసిన నీటిని తాగించాలని తెలిపారు. నిల్వ ఉన్న ప్రాంతాల్లో డెంగీ కారక దోమలుంటాయని వాటితో వైరల్ జ్వరాలు సోకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: