గండికోట పరిహారం చెల్లింపులో వైకాపా అవినీతిని బయటపెట్టారనే కక్షతోనే సీఆర్పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డి హత్య జరిగిందంటూ డీజీపీ గౌతం సవాంగ్కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పేదలను హింసించి హతమార్చటం రాష్ట్రంలో సర్వసాధారణమవ్వటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
అవినీతి కుంభకోణాన్ని వెలికి తీసినందుకు జరిగిన ఈ హత్యను ఫ్యాక్షన్ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశం కోసం సీఆర్పీఎఫ్లో పని చేసినప్పటికీ, రాష్ట్రంలో అవినీతిపై పోరాడుతూ గురుప్రతాప్ రెడ్డి హత్యకు గురయ్యాడన్నారు. ఈ తరహా విజిల్ బ్లోయర్స్ (సమాచారం ఇచ్చేవారు)ను హతమార్చడం రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా(చట్టబద్ద పాలన)పై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి గండి కొట్టడమేనని లేఖలో ప్రస్తావించారు. శాంతిభద్రతలు క్షీణించి నేరాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా.. ప్రభుత్వం దృష్టి సారించకపోవటం గర్హనీయమన్నారు. హింస, అల్లకల్లోలం సృష్టించే యాంత్రాంగాన్ని వైకాపా నెలకొల్పినట్లుగా రాష్ట్రంలో పరిస్థితులున్నాయని చంద్రబాబు మండిపడ్డారు.
ఇదీ చదవండి
ముంపు పరిహారంపై వైకాపాలో భగ్గుమన్న పాత కక్షలు.. కార్యకర్త హత్య