ETV Bharat / city

BJP Bheem Deeksha: బండి సంజయ్​ మౌనదీక్ష.. మండల కేంద్రాల్లో 'భాజపా భీం దీక్ష'

author img

By

Published : Feb 3, 2022, 2:15 PM IST

BJP Bheem Deeksha
BJP Bheem Deeksha

BJP Bheem Deeksha : పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా భాజపా నిరసన దీక్ష చేపట్టింది. దిల్లీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మౌనదీక్ష చేపట్టగా.. రాష్ట్రంలో భాజపా భీం దీక్ష పేరిట నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాషాయ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

BJP Bheem Deeksha: బండి సంజయ్​ మౌనదీక్ష.. మండల కేంద్రాల్లో 'భాజపా భీం దీక్ష'

BJP Bheem Deeksha : తెలంగాణ సీఎం కేసీఆర్‌ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని కుట్ర చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్లీ తెలంగాణభవన్‌ వద్ద బీజేపీ భీం దీక్ష పేరుతో పేరుతో గంటన్నరపాటు దీక్ష చేపట్టారు. భాజపా ఎంపీలు అర్వింద్‌, బాపూరావు సహా నేతలు పాల్గొన్నారు. తన దోపిడీని వ్యవస్థీకృతం చేసుకోవడానికే కొత్త రాజ్యాంగం తేవాలని కేసీఆర్‌ భావిస్తున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబపాలనను భరించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని బండి స్పష్టంచేశారు.

Bandi Sanjay Comments ON KCR : 'ఒక సామాన్యుడు ప్రధాని అయ్యారంటే, అది అంబేడ్కర్‌ భిక్షే. అంబేడ్కర్‌ను సగౌరవంగా సత్కరిస్తున్న ప్రభుత్వం మాది. ఆయన రాసిన రాజ్యాంగం వద్దని కేసీఆర్‌ అంటున్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తానన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఇదే. అంబేడ్కర్ స్థానంలో తన విగ్రహం పెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.'

- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

రాజ్యాంగాన్ని అవమానించారు..

Bandi Sanjay Comments on CM KCR : మరోవైపు.. హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు కూడా భాజపా భీం దీక్ష చేపట్టారు. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి దీక్షలో కూర్చున్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో భీమ్‌ దీక్షలో ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్‌ రెడ్డి, తుల ఉమ పాల్గొన్నారు. సాయంత్రం 4గంటల వరకు భాజపా భీం దీక్ష కొనసాగనుంది. ఎంతో ముందు చూపుతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్న లక్ష్మణ్‌.. అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్‌ అవమానించారని ఆరోపించారు.

సమానత్వం కోసం కృషి..

Laxman About CM KCR Comments on Constitution : 'పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం పట్ల కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు యావత్ దేశం ఆశ్చర్యపోయింది. బడ్జెట్​పై నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యాంగం ప్రస్తావన ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాత.. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా భావి తరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. రెండేళ్లకు పైగా శ్రమించి రాజ్యాంగం రూపకల్పన చేశారు. అసమానతలు కూడిన దేశంలో సమానత్వాన్ని తీసుకువచ్చేందుకు మహనీయులు కృషి చేశారు.'

- లక్ష్మణ్, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే..

BJP Demands An Apology From CM KCR : చిన్న రాష్ట్రాలు ఏర్పడటం వల్ల పరిపాలన సులభం అవుతుందని అంబేడ్కర్ చెప్పారని లక్ష్మణ్ ఉద్ఘాటించారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని గౌరవించాల్సిన తెరాస.. ఆయన ప్రసంగాన్ని బహిష్కరించి అవమానపరించిందని ఆరోపించారు. కేసీఆర్.. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

సంబంధిత కథనాలు :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.