ప్రభుత్వ ఉద్యోగులకు బలవంతపు బదిలీలు ఉండబోవని, అభ్యర్థనలు, ఖాళీ పోస్టులకు మాత్రమే బదిలీలుంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సజ్జలను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల కార్యవర్గ సభ్యులు ఒకేచోట పనిచేసే కాలాన్ని తొమ్మిదేళ్ల నుంచి ఆరేళ్లకు తగ్గిస్తూ ఇచ్చిన మెమో రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వాలని సీఎం జగన్ గతంలో ఆదేశించారని వివరించారు. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు త్వరగా ఇప్పించాలని సజ్జలను కోరగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.