ETV Bharat / business

నీరవ్ మోదీకి బ్రిటన్ హైకోర్టు షాక్.. భారత్​కు అప్పగించాలని ఆదేశం

author img

By

Published : Nov 9, 2022, 4:22 PM IST

Updated : Nov 9, 2022, 6:58 PM IST

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్​కు అప్పగించాలని బ్రిటన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అభ్యర్థనను సవాల్ చేస్తూ నీరవ్ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది.

Nirav Modi extradition
Nirav Modi extradition

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ హైకోర్టులో చుక్కెదురైంది. తనను భారత్​కు అప్పగించకూడదన్న నీరవ్ అప్పీలును యూకే హైకోర్టు కొట్టివేసింది. మనీలాండరింగ్ కేసుల విచారణ నిమిత్తం నీరవ్ మోదీని భారత్​కు అప్పగించాలని బ్రిటన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నీరవ్ మోదీ ప్రస్తుతం.. ఆగ్నేయ లండన్​లో ఉన్న వాండ్స్​వర్త్​ జైలులో ఉన్నారు. భారత్​కు అప్పగింతపై నీరవ్​కు వ్యతిరేకంగా జిల్లా జడ్జి గత ఫిబ్రవరిలోనే తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు నీరవ్ మోదీ. తనకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని కోర్టులో ఆయన వాదించారు. ఈ నేపథ్యంలో తనను భారత్​కు అప్పగించొద్దని అభ్యర్థించారు. వీటన్నింటినీ పరిశీలించిన లండన్ హైకోర్టు.. కింది కోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. నీరవ్​ను భారత్​కు అప్పగించాల్సిందేనని స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల ఎగవేత సహా మోసం, మనీలాండరింగ్ కేసుల్లో విచారణ కోసం నీరవ్​ను భారత్​కు అప్పగించాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జెరేమీ స్టువర్ట్ స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే తీర్పుచెప్పారు.

నీరవ్ మోదీ మానసిక పరిస్థితి తీవ్రస్థాయిలో లేదని, దాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన్ను భారత్​కు అప్పగించకుండా అడ్డుకోవడం అన్యాయం అవుతుందని తీర్పులో న్యాయమూర్తులు స్పష్టం చేశారు. నీరవ్ ఇప్పటివరకు ఆత్మహత్యకు ప్రయత్నించడం కానీ, తనకు తాను హాని చేసుకునేందుకు ప్రయత్నించడం కానీ చేయలేదని గుర్తుచేశారు. ఆయన కోసం ముంబయి ఆర్థర్ రోడ్​లోని పన్నెండో నెంబర్ జైలుగదిలో అన్నిరకాల ఏర్పాట్లు చేసిన విషయాన్ని న్యాయమూర్తులు ప్రస్తావించారు. ఆయనపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. నీరవ్ మోదీ పట్ల భారత ప్రభుత్వం తగిన రీతిలో వ్యవహరిస్తుందని తాము భావిస్తున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. లేదంటే బ్రిటన్​తో చేసుకున్న ఒప్పందాలపై ప్రభావం పడుతుందనే విషయం భారత్​కు తెలుసని అన్నారు.

నీరవ్ మోదీపై భారత్​లో క్రిమినల్ నేరారోపణలు ఉన్నాయి. తప్పుడు లోన్ అగ్రిమెంట్లను సమర్పించి పీఎన్​బీ బ్యాంకు నుంచి వేల కోట్ల రుణం తీసుకున్న కేసుపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ రుణం తీసుకొని మనీలాండరింగ్​కు పాల్పడ్డారనే కేసుపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఆధారాల ధ్వంసం, సాక్షులను బెదిరించడం వంటి ఆరోపణలపైనా.. నీరవ్​పై కేసులు నమోదయ్యాయి.

Last Updated : Nov 9, 2022, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.