ETV Bharat / business

రూ.2 లక్షల ప్రమాద బీమా రూ.20కే.. అర్హులెవరు? ఎలా చేరాలో తెలుసా?

author img

By

Published : May 19, 2023, 12:44 PM IST

pmsby-scheme-details-pmsby-scheme-eligibility-and-other-details
పీఎమ్​ఎస్​బీవై పాలసీ వివరాలు

సామాన్యులకు బీమా ప్రయోజనాలు అందాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేవలం 20 రూపాయలతోనే రూ.రెండు లక్షల ప్రమాద బీమా అందుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఈ స్కీంలో ఎలా చేరాలి? దానికి కావల్సిన అర్హతలు ఏంటి? తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి మరణించినా లేదా వైకల్యం పొందినా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు.. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అతి తక్కువ ప్రీమియం చెల్లింపుతోనే 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడమే ఈ స్కీం ప్రధాన ఉద్దేశం. ఈ పథకాన్ని 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 34.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. అందులో 1.15 లక్షల కుటుంబాలు 2,302 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధిని పొందాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ పథకం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • అర్హత..
  • PMSBY Scheme Eligibility : ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో చేరేందుకు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు అర్హులు.
  • బ్యాంకు/ పోస్టాఫీసులో సేవింగ్స్​ అకౌంట్​ ఉన్న వారెవరైనా ఈ స్కీంలో చేరొచ్చు.
  • ఇందుకోసం బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించాలి. ఒక వేళ అనుసంధానం చేయకపోతే కేవైసీ చేయించడం తప్పనిసరి.
  • ఒక వేళ వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉన్నట్లయితే.. ఏదైనా ఒక సేవింగ్స్​ అకౌంట్​ ఉన్న బ్యాంకు నుంచి మాత్రమే స్కీంకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
  • రెండింటి ద్వారా నమోదు చేసుకుని ప్రీమియం చెల్లించినప్పటికీ.. ఒకదాన్ని మాత్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.
  • ఉమ్మడి ఖాతా తీసుకున్న వారు సైతం ఈ స్కీంలో చేరవచ్చు. ఇద్దరూ విడివిడిగా ప్రీమియం సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది.
  • భారత్​లో సేవింగ్​ అకౌంట్​ ఉన్న ఎన్నారైలు కూడా ఈ పథకంలో చేరేందుకు అర్హులు.

నమోదు కాలవ్యవధి..
ఈ స్కీం ఏడాది కాలపరిమితితో వస్తుంది. జూన్‌ 1 నుంచి మే 31 వరకు అమలులో ఉంటుంది. ప్రతి సంవత్సరం జూన్‌ 1లోగా ప్రీమియం మొత్తం ఆటో డెబిట్‌ ద్వారా రెన్యువల్‌ అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్‌ చేసుకోవాలనుకుంటే.. రద్దు చేయాల్సిందిగా బ్యాంకును కోరాల్సి ఉంటుంది. కొత్తగా ఈ స్కీంలో చేరే వారికి జూన్‌ 1 నుంచి మే 31 వరకు కవరేజీ లభిస్తుంది.

నామమాత్రపు ప్రీమియమే..
PMSBY Scheme Time Period : సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. ఈ సురక్షా బీమా పథకాన్ని నామమాత్రపు ప్రీమియంతోనే తీసుకొచ్చింది. పథకాన్ని ప్రారంభించిన మొదట్లో కేవలం 12 రూపాయల ప్రీమియంతోనే పాలసీని అందించేవారు. గతేడాది నుంచి ఈ ప్రీమియంను 20 రూపాయలకు పెంచారు. ఆటోడెబిట్‌ ద్వారా బ్యాంకు/పోస్టాఫీసు అకౌంట్​ నుంచి ఒకే వాయిదాలో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది జూన్‌ 1లోగా పాలసీని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీంలో చేరేవారు ప్రీమియం మొత్తాన్ని ఏటా ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా తీసుకునేందుకు బ్యాంకులను అనుమతించాలి.

బీమా హామీ..
PMSBY Insurance Amount : పాలసీదారుడు మరణించినా లేదంటే శాశ్వత వైకల్యం చెందినా 2 లక్షల రూపాయలు, పాక్షిక వైకల్యానికి గురైతే 1 లక్ష రూపాయల సొమ్ము బీమా పరిహారంగా లభిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ స్కీం వర్తించదని గుర్తుంచుకోవాలి. ఇలాంటి సమయాల్లో పాలసీదారుల కుటుంబానికి ఎలాంటి బీమా ప్రయోజనమూ లభించదు. అదే పాలసీదారుడు హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజీ లభిస్తుంది.

ఎప్పుడు రద్దవుతుందంటే?..

  • ప్రీమియం డబ్బును ఆటోమేటిక్‌గా బ్యాంకులు తీసుకొనేందుకు పాలసీదారులు అనుమతించాలి. ఒకవేళ డెబిట్‌ అయ్యే సమయంలో తగినంత బ్యాలెన్స్.. అకౌంట్​లో లేనప్పుడు బీమా పాలసీ రద్దు అవుతుంది.
  • బ్యాంక్‌/పోస్టాఫీసులలో సేవింగ్స్ అకౌంట్​​ రద్దు అయినప్పుడు లేదంటే మూసివేసిన సందర్భాల్లో పాలసీ క్యాన్సిల్​ అవుతుంది.
  • పాలసీదారుని వయసు 70 ఏళ్లు దాటిన తర్వాత ఈ బీమా వర్తించదు.

క్లెయిమ్‌ ఎలా?
PMSBY Claim Process : పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ చనిపోతే.. దాన్ని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించాలి. అప్పుడే ఈ స్కీం కింద క్లెయిమ్‌ మంజూరవుతుంది. ఆత్మహత్య మినహా.. రోడ్డు ప్రమాదం, హత్యకు గురికావటం లేదా ఏ ఇతర కారణాల వల్ల మరణాలు జరిగితే.. దాన్ని పోలీసులు ధ్రువీకరించాలి. క్లెయిమ్ ఫారానికి ఒరిజినల్ ఎఫ్‌ఐఆర్, పోస్ట్ మార్టం నివేదిక, డెత్ సర్టిఫికెట్‌ లేదా వైకల్యం ఉంటే సివిల్ సర్జన్ జారీ చేసే వైకల్య సర్టిఫికేట్​ తప్పనిసరిగా జత చేయాలి. కొన్నింటికి డిశ్చార్జి సర్టిఫికెట్ సైతం కూడా జతచేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీ తీసుకున్న సమయంలో నామినీ తెలపకపోతే.. పాలసీదారు వారసుడు క్లెయిమ్‌ కోసం దాఖలు చేసుకోవచ్చు. పూర్తి చేసిన క్లెయిమ్ ఫారమ్‌ను ప్రమాదం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు బ్యాంకు శాఖకు సమర్పించాలి.

ఇలా చేరండి..
PMSBY Claim Process : ఈ పథకంలో చేరేందుకు http://www.jansuraksha.gov.in/ వెబ్‌సైట్‌ నుంచి ఓ అప్లికేషన్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో అడిగిన వివరాలన్నింటిని రాసి బ్యాంకు లేదా పోస్టాఫీసులో అందించాలి. నెట్‌ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ స్కీంలో చేరవచ్చు. ఇందుకోసం మీ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్ ఖాతాలో లాగిన్‌ అవ్వాలి. అందులో ఉన్న ఇన్స్​రెన్స్​ ఆప్షన్​పై క్లిక్‌ చేయాలి. తర్వాత ప్రీమియం చెల్లించేందుకు మీ బ్యాంక్‌ ఖాతాను ఎంచుకోవాలి. అన్ని వివరాలూ తనిఖీ చేసి.. అనంతరం నిర్ధారించుకొని కన్​ఫార్మ్​పై క్లిక్‌ చేయాలి. తరువాత డౌన్​లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ పాలసీ రశీదును తీసుకోకవచ్చు. భవిష్యత్‌లో రిఫరెన్స్‌ కోసం ఈ పాలసీ రశీదును భద్రపరచుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.