ETV Bharat / business

హిందూజా సంస్థ అధినేత కన్నుమూత

author img

By

Published : May 17, 2023, 7:04 PM IST

Updated : May 17, 2023, 9:18 PM IST

ప్రముఖ వ్యాపార సంస్థ హిందూజా గ్రూప్​ ఛైర్మన్​ ఎస్​పీ హిందూజా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లండన్​లో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Hinduja Group Chairman SP Hinduja Died
హిందూజా సంస్థ అధినేత శ్రీచంద్ పర్మానంద్​ హిందూజా కన్నుమూత

ప్రముఖ వ్యాపార సంస్థ హిందూజా గ్రూప్​ ఛైర్మన్​ శ్రీచంద్ పర్మానంద్​ హిందూజా(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం లండన్​లో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హిందూజా సోదరుల్లో శ్రీచంద్ పర్మానంద్​ హిందూజా పెద్దవారు. గోపీచంద్​, ప్రకాశ్​​, అశోక్​ హిందూజాలు ఈయన సోదరులు. ఎస్పీ హిందుజా మరణంపట్ల ఆయన సోదరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భారత సంతతికి చెందిన హిందూజా కుటుంబం బ్రిటన్​​లో స్థిరపడింది. వాణిజ్య పరంగా బ్రిటన్​, భారత్​ మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో ఎస్పీ హిందూజా కీలకంగా వ్యవహరించారని కుటుంబంలోని ఓ వ్యక్తి తెలిపారు.

ఎస్పీ హిందూజా 1935 నవంబర్ 28న బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్‌లోని కరాచీలో ఒక వ్యాపార కుటుంబంలో జన్మించారు. 1952లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అనంతరం ఎస్పీ హిందూజా గ్రూప్ వ్యవస్థాపకుడైన తన తండ్రి పరమానంద్ దీప్‌చంద్​ హిందుజాతో కలిసి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. హిందూజాకు ఇద్దరు కుమార్తెలు షాను, వినూ ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ఎస్పీ హిందూజా సతీమణి మధు (82) మరణించారు.

Hinduja Group Chairman SP Hinduja Died
శ్రీచంద్ పర్మానంద్​ హిందూజా

హిందూజా వ్యాపార సామ్రాజ్యం!
ఆటోమోటివ్, ఆయిల్​, స్పెషాలిటీ కెమికల్స్, బ్యాంకింగ్​ అండ్​ ఫైనాన్స్, ఐటీ అనుబంధ రంగాలు, సైబర్ సెక్యూరిటీ, హెల్త్‌కేర్, ట్రేడింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్, మీడియా అండ్​ఎంటర్‌టైన్‌మెంట్, పవర్​ అండ్​ రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది హిందూజా గ్రూప్​.

బోఫోర్స్ స్కామ్​లో ఆరోపణలు!
సోదరులు గోపీచంద్​, ప్రకాష్​లు స్వీడిష్ గన్‌మేకర్​ అయిన AB బోఫోర్స్​ కంపెనీకి భారత ప్రభుత్వ తరఫున కాంట్రాక్ట్‌ రావడంలో వీరిద్దరి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో దాదాపు రూ.64 కోట్ల ముడుపులు వీరికి అందాయని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు 2005లో వీరిని నిర్దోషులుగా ప్రకటించింది.

అత్యంత ధనవంతుల్లో ఒకరిగా!
1964లో రాజ్​ కపూర్​ నటించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'సంగం' చిత్రానికి సంబంధించి అంతర్జాతీయంగా డిస్ట్రిబ్యూషన్​ హక్కులతో హిందూజా వ్యాపార విజయ ప్రస్థానం ప్రారంభమైంది. ఈ సినిమా ఆయనకు మిలియన్​ డాలర్ల సంపాదనను తెచ్చేపెట్టింది. దీంతో ఆయన బ్రిటన్‌లోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. అయితే బోఫోర్స్ స్కామ్​ శ్రీచంద్ పర్మానంద్ హిందూజాను అపఖ్యాతి పాలయ్యేలా చేసింది. 2006లో హిందూజా సోదరులు లండన్‌లోని కార్ల్‌టన్ హౌస్ టెర్రేస్ స్ట్రీట్‌లో 25 పడక గదుల భవనం కోసం ఏకంగా 58 మిలియన్​ డాలర్లు ఖర్చు చేశారు.

Last Updated :May 17, 2023, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.