ETV Bharat / business

'పెరుగుతున్న గిరాకీ.. ఎంఎన్​సీల చూపు భారత్​ వైపు.. 2030 నాటికి అలా..'

author img

By

Published : Jul 17, 2022, 7:11 AM IST

భారత్​లో ఫార్మాస్యూటికల్ మార్కెట్ దూసుకెళ్లోందని అన్నారు పరాక్సెల్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ వ్యాస్‌. ప్రస్తుతం 44 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ 2030 నాటికి 130 డాలర్లుకు చేరుకుంటుందని తెలిపారు. దీని వల్ల దేశీయంగా కాంట్రాక్టు పరిశోధనా సేవలకు గిరాకీ ఎంతగానో పెరుగుతుందని వెల్లడించారు. పరాక్సెల్ ఎండీ సంజయ్ వ్యాస్ 'ఈనాడు'తో పలు విషయాలు ముచ్చటించారు. వాటి గురించి తెలుసుకుందాం.

PARAXEL INDIA MD INTERVIEW
పరాక్సెల్‌

మనదేశంలో ఫార్మాస్యూటికల్‌ మార్కెట్‌ ఇప్పుడున్న 44 బిలియన్‌ డాలర్ల నుంచి 2030 నాటికి 130 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుందని, దీనివల్ల దేశీయంగా కాంట్రాక్టు పరిశోధనా సేవలకు (సీఆర్‌ఓ) గిరాకీ ఎంతగానో పెరుగుతుందని పరాక్సెల్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ వ్యాస్‌ అన్నారు. దీనికి అనుగుణంగా ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించబోతున్నామని 'ఈనాడు' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. యూఎస్‌కు చెందిన పరాక్సెల్‌ కాంట్రాక్టు పరిశోధన రంగంలో ప్రపంచంలోని తొలి మూడు సంస్థల్లో ఒకటిగా ఉంది. దీన్ని గత ఏడాది నవంబరులో గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌, ఈ-క్యూటీ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు 8.5 బిలియన్‌ డాలర్ల విలువకు కొనుగోలు చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా 120 కి పైగా ఉన్న పరాక్సెల్‌ కార్యాలయాల్లో 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో మనదేశంలో 6,000 మంది ఉన్నారు. ఔషధ మార్కెట్‌ తీరుతెన్నులు, పరిశోధనలు, భవిష్యత్తు అంచనాలపై ఆయన మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలు..

కాంట్రాక్టు పరిశోధన సేవల విభాగంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి?

ప్రపంచ వ్యాప్తంగా కాంట్రాక్టు పరిశోధనా సేవలకు 50 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఉంది. ఈ విభాగంలో భారతదేశం ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషించబోతోంది. వాస్తవానికి దశాబ్దకాలం క్రితం వరకూ ఇక్కడ క్లినికల్‌ పరీక్షలు, ఔషధ పరిశోధనలు పెద్దఎత్తున జరిగాయి. తదుపరి నిబంధనల్లో వచ్చిన మార్పులతో పరిశోధనా కార్యకలాపాలు మందగించాయి. కానీ కొవిడ్‌-19 తర్వాత కాంట్రాక్టు పరిశోధనలను పెద్దఎత్తున నిర్వహించేందుకు వీలుకల్పిస్తూ, యూఎస్‌ఎఫ్‌డీఏ, యూకేఎంసీఏ నిబంధనలను అనుసరించాలని భారత ఔషధ నియంత్రణ వర్గాలు నిర్ణయించాయి. దీనివల్ల మళ్లీ ఇక్కడ కాంట్రాక్టు పరిశోధనలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 100కు పైగా మాలిక్యూల్స్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయి. సమీప భవిష్యత్తులో దాదాపు 300- 400 మాలిక్యూల్స్‌పై ప్రయోగాలు- పరీక్షలు నిర్వహించే స్థాయికి భారతదేశంలో కాంట్రాక్టు పరిశోధనా సేవల మార్కెట్‌ విస్తరించవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి వ్యాధులకు సంబంధించి ఔషధ పరిశోధనలు అధికంగా జరుగుతున్నాయి?

గత రెండేళ్లలో కొవిడ్‌-19 టీకాలు, ఔషధాలపై పరీక్షలు అధికంగా జరిగాయి. ఇది కాకుండా ఆంకాలజీ, హీమటాలజీ, ఇమ్యూనోమాడ్యులార్‌ విభాగాల్లో కొత్త మాలిక్యూల్స్‌ను ఆవిష్కరించటంపై ఫార్మా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అందువల్ల ఈ విభాగాలకు సంబంధించిన మాలిక్యూల్స్‌పై ప్రయోగాలు అధికంగా జరుగుతున్నాయి. ఇంకా సెల్‌జీన్‌ థెరపీ, పర్సనలైజ్డ్‌ మెడిసిన్‌ విభాగాల్లోనూ పెద్దఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి.

భారత ఔషధ మార్కెట్‌పై మీ అంచనాలు ఏమిటి?

ఏటా దాదాపు 12 శాతానికి పైగా వృద్ధితో భారత ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమ 2030 నాటికి 130 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చు. అంతేగాక 2047 నాటికి ఇది 600 బిలియన్‌ డాలర్ల పరిశ్రమ అవుతుంది. దీని వల్ల పరిశోధన- అభివృద్ధి, డేటా మేనేజ్‌మెంట్‌, డోసియర్ల తయారీ.. వంటి పలు రకాలైన అనుబంధ కార్యకలాపాలపై పెట్టుబడులు పెరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఔషధ కంపెనీలు (ఎంఎన్‌సీలు) భారతదేశంలో డేటా మేనేజ్‌మెంట్‌, క్లినికల్‌ రీసెర్చ్‌ విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.

భారతదేశంలో 'పరాక్సెల్‌' ప్రస్థానం ఎలా ఉండబోతోంది..

దాదాపు 16 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో ఆరుగురు సిబ్బందితో 'పరాక్సెల్‌' కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బెంగుళూరు, మొహాలీలో పరాక్సెల్‌ కార్యాలయాలు ఉన్నాయి. దాదాపు 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరాక్సెల్‌కు సంబంధించిన హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ కార్యకలాపాలతో పాటు ఎన్నో కీలకమైన పరిశోధనా ప్రాజెక్టులను ఇప్పుడు మేం భారతదేశం నుంచి నిర్వహిస్తున్నాం. పరాక్సెల్‌ భవిష్యత్‌ వృద్ధిలో భారతదేశం కీలకమైన పాత్ర పోషిస్తుంది. త్వరలోనే ఇక్కడ సిబ్బంది సంఖ్య 10,000 మందికి చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోనే ఉద్యోగుల సంఖ్య 3,000- 4,000 మందికి పైగా పెరుగుతుంది.

ఫార్మా పరిశోధనలకు నైపుణ్యాల కొరత ప్రధాన సమస్యగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు?

కొంత 'స్కిల్‌ గ్యాప్‌' ఉన్న మాట వాస్తవమే. దాన్ని అధిగమించేందుకు మా తరఫున పలు ప్రాజెక్టులు చేపట్టాం. బీఫార్మసీ లేదా జీవ శాస్త్రాల విభాగంలో విద్యార్ధులకు బోధించే అంశాలకు, వాస్తవానికి క్లినికల్‌ పరీక్షలు- ఔషధ పరిశోధనల్లో అవసరమైన నైపుణ్యాలకు పొంతన ఉండటం లేదు. దీన్ని భర్తీ చేసేందుకు కొన్ని యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. స్కిల్లింగ్‌, ఇంటర్న్‌షిప్‌ ప్రాజెక్టులు అమలు చేస్తున్నాం. హైదరాబాద్‌లోనూ కొన్ని యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకునే ఆలోచన ఉంది.

ఇవీ చదవండి: సామాన్యుడిపై మరో పిడుగు.. నిత్యావసర ధరలు పైపైకి.. పాలు, పెరుగు సహా..

పెరిగిన విదేశీ డిపాజిట్​ రేట్లు.. రూపాయి పతనానికి చెక్​ పెట్టే దిశగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.