ETV Bharat / business

'అలా జరిగితేనే అదుపులోకి ద్రవ్యోల్బణం'

author img

By

Published : Jun 20, 2022, 6:55 AM IST

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్​బీఐ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపటం సహా.. సాధారణ వర్షపాతానికి తోడు వ్యవసాయ దిగుబడులు బాగుండాలని అభిప్రాయపడ్డారు పలువురు ఆర్థిక వేత్తలు. నగదు లభ్యత మరీ సులభం కాకుండా చూడటం వల్ల ఆహార, ఇంధన ధరల్ని అదుపులోకి తీసుకురావచ్చని తెలిపారు.

controlling of inflation
ద్రవ్యోల్బణం

సాధారణ వర్షపాతానికి తోడు వ్యవసాయ దిగుబడులు బాగుండి, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తదుపరి పరపతి విధాన సమావేశాల్లోనూ మరిన్ని రేట్ల పెంపునకు మొగ్గు చూపితే.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వ్యవస్థలో నగదు లభ్యత మరీ సులభం కాకుండా చూడటం వల్ల ఆహార, ఇంధన ధరల్ని అదుపులోకి తీసుకురావచ్చని, తద్వారా ద్రవ్యోల్బణం ఏళ్ల గరిష్ఠాల నుంచి దిగి వస్తుందని వారు చెబుతున్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు.

  • రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 8 ఏళ్ల గరిష్ఠమైన 7.79 శాతానికి చేరగా, మేలో 7.04 శాతానికి తగ్గింది. అయితే టోకు ద్రవ్యోల్బణం మాత్రం మేలో 15.88 శాతంతో రికార్డు స్థాయికి చేరింది. ఇందులో 3/4 వంతు ఆహార వస్తువుల వల్లే పెరిగింది. సాధారణ వర్షపాతం నమోదై, పంటలు బాగా పండి, దిగుబడులు బాగుంటే ధరలు అదుపులోకి వచ్చి ద్రవ్యోల్బణం దిగి వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
  • ఆర్‌బీఐ ఇప్పటికే రెండు దఫాల్లో కలిపి 90 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును పెంచడంతో వ్యవస్థలో నగదు లభ్యతను తగ్గించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచేందుకు మరో 80 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును పెంచే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
  • వంట నూనెల ధరలు ఇటీవలి వరకు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. దిగుమతి సుంకాల తగ్గింపుతో పాటు అంతర్జాతీయంగా సరఫరాలు మెరుగైనందున, పలు సంస్థలు వంట నూనెల ధరల్ని తగ్గించడం మొదలుపెట్టాయి. ఇంధన, ఆహార వస్తువుల ధరలతోనే ద్రవ్యోల్బణం అధికమైందని, వచ్చే నెలల్లో ఇది తగ్గుముఖం పడుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ ఇటీవల వెల్లడించారు.
  • 2022-23లో మిగిలిన కాలానికి మరో 50-75 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును ఆర్‌బీఐ పెంచే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేస్తోంది. ఈ ఏడాదిలోనే మరో 60-80 బేసిస్‌ పాయింట్లమేర రెపో రేటును పెంచొచ్చని మూడీస్‌ అనలిటిక్స్‌ పేర్కొంది.
  • కొవిడ్‌ సమయంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ పలు దఫాలుగా రెపో రేటును తగ్గించడంతో, గృహ రుణ రేట్లు బాగా దిగివచ్చాయి. దీంతో అనేక మంది ఇళ్లను కొనుగోలు చేశారు. ఇటీవల రెపో రేటు 90 బేసిస్‌ పాయింట్లు పెరగడంతో గతంలో 6.5 శాతంగా ఉన్న రుణ రేట్లు ఇప్పుడు 7.3-7.5 శాతానికి పెరిగాయి. దీంతో రుణ చెల్లింపు కాలవ్యవధి పెరుగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు ఇప్పటికీ భారంగానే ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: డెబిట్, క్రెడిట్ కార్డులకు ఆర్​బీఐ కొత్త రూల్స్​.. పేమెంట్స్ ఇక భద్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.