ETV Bharat / business

ఆ దేశాలు ఊ అంటే రూపాయల్లోనే వ్యాపారం.. భారత్​కు మేలు!

author img

By

Published : Jul 13, 2022, 6:47 AM IST

రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కీలక ప్రతిపాదన చేసింది. రష్యా సహా పొరుగు దేశాలతో రూపాయల్లో వ్యాపారం జరిపేలా పావులు కదుపుతోంది. ఈ దేశాలు అంగీకరిస్తే ప్రస్తుతం భారత్​ చేస్తున్న వాణిజ్యంలో 16.38 శాతాన్ని రూపాయల్లో చెల్లింపులకు మార్చుకోవచ్చు. దీని వల్ల డాలర్‌తో పోలిస్తే 79.59కు పతనమైన రూపాయి విలువ మరింత క్షీణించకుండా చూడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రూపాయల్లో అంతర్జాతీయ వ్యాపారం
రూపాయల్లో అంతర్జాతీయ వ్యాపారం

ప్రపంచవ్యాప్తంగా భారత్‌ మొత్తం వాణిజ్యం.. రూ.77.15 లక్షల కోట్లు ఇందులో రష్యా, పొరుగుదేశాలతో భారత్‌ వాణిజ్యమైన రూ.12.64 లక్షల కోట్లు 16.38 శాతానికి సమానం. దీని ప్రకారం చూస్తే.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రతిపాదించినట్లు రూపాయల్లో లావాదేవీలను పొరుగు దేశాలు, రష్యా అంగీకరిస్తే, భారత్‌ ప్రస్తుతం డాలర్లలో చేస్తున్న వాణిజ్యంలో 16.38 శాతాన్ని రూపాయల్లో చెల్లింపులకు మార్చుకోవచ్చు.

ఇదే జరిగితే..: దిగుమతుల కోసం మన దేశం విదేశీ మారకపు ద్రవ్యాన్ని ముఖ్యంగా డాలర్లను ఉపయోగించడం తగ్గుతుంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించాక, రూ.1 లక్ష కోట్లకు పైగా విలువైన భారత విదేశీ మారకపు నిల్వలు తగ్గాయి. ఫిబ్రవరిలో భారత విదేశీ మారకపు నిల్వలు రూ.47.52 లక్షల కోట్ల మేర ఉండగా, ప్రస్తుతం అవి రూ.46.43 లక్షల కోట్ల స్థాయికి దిగివచ్చాయి. అంతర్జాతీయంగా మాంద్యం నెలకొంటుందనే ఆందోళనల నేపథ్యంలో, దేశ స్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెద్దఎత్తున ఉపసంహరిస్తున్నారు. ఇందువల్ల డాలర్‌కు గిరాకీ పెరిగి, రూపాయి విలువ రికార్డు కనిష్ఠానికి పడిపోయింది. రూపాయి క్షీణతను నియంత్రించేందుకు, ఆర్‌బీఐ తన దగ్గర ఉన్న విదేశీ మారకపు నిల్వలను కొంతమేర వినియోగిస్తోంది. 'ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులతో పాటు, ఎగుమతులకూ కొంతైనా రూపాయల్లో లావాదేవీలు నిర్వహించే' విధానాన్ని ఆర్‌బీఐ సోమవారం ప్రకటించింది. ఇందువల్ల డాలర్‌తో పోలిస్తే 79.59కు పతనమైన రూపాయి విలువ మరింత క్షీణించకుండా చూడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రష్యాతో వాణిజ్యం మరింత భారీగా
భారత్‌- రష్యాల మధ్య మొత్తం వాణిజ్యం 2021-22లో రూ.98,000 కోట్లుగా ఉంది. మన దేశం ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న మొత్తం వాణిజ్యంలో ఇది 1.25 శాతం. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు, మన దేశం దిగుమతి చేసుకునే ముడిచమురులో రష్యా వాటా 0.2 శాతం కాగా, ఈ ఏడాది మార్చి నుంచి భారీగా పెరిగి మే నెలలో 10 శాతానికి చేరడంతో.. ఆమేర వాణిజ్య పరిమాణం మరింత అధికం కావచ్చు.

పొరుగు దేశాలతో ఇలా..
2021-22లో భారత మొత్తం వాణిజ్యంలో పొరుగు దేశాల వాటా 15.11 శాతమని కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మన దేశానికి పొరుగున ఉన్న చైనా, ఆఫ్ఘనిస్తాన్‌, శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవుల (పాకిస్తాన్‌ మినహా)తో లావాదేవీల విలువ రూ.11.66 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో సగానికి పైగా అంటే రూ.8.6 లక్షల కోట్ల మేర వాణిజ్యాన్ని చైనాతో మన దేశం జరుపుతోంది.

  • బంగ్లాదేశ్‌తో రూ.1.35 లక్షల కోట్లు, నేపాల్‌తో రూ.82 వేల కోట్ల మేర జరుగుతోంది.
  • శ్రీలంకకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశాల్లో మన దేశమూ ఒకటి. రూపాయల్లో వాణిజ్యం, సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థకూ ప్రయోజనమేననే మాట వినిపిస్తోంది. శ్రీలంకకు ఇప్పటికే రుణం కింద 3 బిలియన్‌ డాలర్ల విలువైన ఇంధనం, ఎరువులు, ఇతర నిత్యావసర ఉత్పత్తులను సహాయంగా అందించేందుకు మన దేశం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

డెట్‌ ఫండ్ల నుంచి రూ.92,248 కోట్లు వెనక్కి
వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో పాటు, స్థూల ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి వల్ల, ఈ ఏడాది జూన్‌లో డెట్‌ ఫండ్ల నుంచి రూ.92,248 కోట్ల నికర పెట్టుబడులను మదుపర్లు ఉపసంహరించుకున్నారు. కమొడిటీల ధరలు పెరగడం, ఆర్థిక వ్యవస్థ వృద్ది నెమ్మదించడమూ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మేలో రూ.32,722 కోట్లు, ఏప్రిల్‌లో రూ.54,756 కోట్ల నికర పెట్టుబడులు ఈ ఫండ్లలోకి వచ్చాయి. భారత మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఓవర్‌నైట్‌, లిక్విడ్‌, అల్ట్రాషార్ట్‌-టర్మ్‌ ఫండ్ల నుంచి ఎక్కువగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. పదేళ్ల గిల్ట్‌ ఫండ్లలో మాత్రం నికర పెట్టుబడులు పెరిగాయి.

ఇదీ చూడండి : 'వర్షాకాలం' వాహన డ్యామేజీతో జేబుకు చిల్లు.. ఈ బీమా తీసుకుంటే సరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.