ట్విట్టర్​కు పోటీగా కొత్త యాప్.. రంగంలోకి దిగుతున్న మెటా!​

author img

By

Published : Mar 11, 2023, 3:10 PM IST

meta build a new app for twitter

ట్విట్టర్‌కు పోటీగా కొత్త సామాజిక మాధ్యమాన్ని రూపొందిస్తోంది ఫేస్​బుక్ మాతృసంస్థ మెటా. అంతర్జాతీయంగా ట్విట్టర్‌కు ఉన్న ప్రజాదరణతోపాటు, ఇప్పుడు ఆ సంస్థ ఎదుర్కొంటున్న గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని సిద్ధం చేస్తోంది.

దిగ్గజ సామాజిక మాధ్యమాల మాతృసంస్థ మెటా.. ట్విట్టర్‌కు పోటీగా కొత్త సామాజిక మాధ్యమాన్ని రూపొందిస్తోంది. అంతర్జాతీయంగా ట్విట్టర్‌కు ఉన్న ప్రజాదరణతోపాటు.. ఇప్పుడు ఆ సంస్థ ఎదుర్కొంటున్న గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని సిద్ధం చేస్తోంది. ఉద్యోగుల తొలగింపుతో అప్రతిష్ఠ పాలైన ట్విట్టర్​కు ప్రత్యామ్నాయం కోసం యూజర్లు వెతుకున్నారు. ఇదే సరైన సమయంగా భావిస్తున్న మెటా ట్విట్టర్‌కు పోటీ ఇచ్చేందుకు ఓ యాప్​ను తయారుచేసేందుకు సిద్ధమైంది.

ట్విట్టర్‌కు పోటీగా తయారు చేస్తున్న వేదిక వివరాలపై మెటా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇది అభివృద్ధి దశలో ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు కొన్ని తెలిపాయి. ఈ ప్రాజెక్టుకు పీ-92 అనే కోడ్‌నేమ్‌ పెట్టినట్లు వివరించాయి. సరికొత్త సామాజిక మాధ్యమాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌ పేరుతో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపం, ఖాతాల తొలగింపు చర్యలతో ట్విట్టర్​ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో మెటా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఉన్న యూజర్‌లు పీ-92లో రిజిస్టర్‌ కావచ్చనీ.. లేదా స్వతంత్రంగా కొత్త ఖాతాను తెరవొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఖాతా తెరిచే యూజర్లు వేరే సోషల్‌ సైట్లలోనూ పోస్టులు పంచుకోవచ్చని తెలిపాయి. యూజర్‌ బయో, బ్యాడ్జెస్‌ వంటి అన్ని ఫీచర్‌లు ఇందులో ఉంటాయని వివరించాయి. ట్విట్టర్​లో ఉన్నట్లు రీషేర్‌ ఫీచర్‌ ఇందులో ఉంటుందా లేదా అనేదానిపై ఇంకా పూర్తి స్పష్టత లేదని తెలిపాయి. ప్రస్తుతం దీనిలో ఉండబోతున్న అన్ని అంశాలను, ఇది ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అన్న.. పూర్తి వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొన్నాయి.

గతేడాది ఎలాన్​ మస్క్‌ 44 బిలియన్​ డాలర్లతో ట్విట్టర్​ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత అధికార బాధ్యతలు చేపట్టిన మస్క్​ ట్విట్టర్​లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఖర్చును తగ్గించే ప్రక్రియలో భాగంగా.. సంస్థ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌తో సహా 4,700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. కొత్తగా బ్లూటిక్‌కు చందా తీసుకొచ్చారు. దీంతో వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడింది. చాలా మంది ట్విట్టర్​ వినియోగదారులు దీనిపై వ్యతిరేకత తెలిపారు. దీంతో పాటుగా ఎప్పటికప్పుడు ట్విట్టర్​లో సాంకేతిక లోపాలు తలెత్తున్నాయి. దీంతో చాలా మంది యూజర్లు దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వివిధ కంపెనీలు ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే మాస్టోడాన్‌, పోస్ట్‌న్యూస్‌, టీ2 వంటి వేదికలు వెలిశాయి. దీనిలో భాగంగానే మెటా సంస్థ కూడా ట్విట్టర్​కు ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.