బిల్​ కౌంటర్​లో మొబైల్​ నంబర్​ అడుగుతున్నారా?​.. ఇవ్వొద్దన్న కేంద్రం

author img

By

Published : May 25, 2023, 6:21 PM IST

govt-issued-new-orders-to-shopkeepers-ask-for-customer-mobile-numbers-before-generating-bill

షాపింగ్​ అనంతరం మిమ్మల్ని మొబైల్​ నంబర్ ఇవ్వమని​ అడుగుతున్నారా? ఆ తరువాత మీకు తరుచూ స్పామ్​ కాల్స్​, అనవసర మెస్సేజ్​లతో వేధిస్తున్నారా? వీటన్నింటికీ చెక్​ పెట్టేలా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మెడికల్​ షాపుల్లో ట్యాబ్లెట్ల కొనుగోళ్లపై కూడా కేంద్రం కొత్త విధానాలు తీసుకువస్తుంది. అవేంటో తెలుసుకోండి.

షాపింగ్​ చేసిన తరువాత వ్యాపార సంస్థలు మీ మొబైల్ నంబర్​ను అడుగుతున్నాయా? నంబర్​ ఇస్తే గానీ బిల్​ చేయమని చెబుతున్నాయా? ఆ తర్వాత స్పామ్​ కాల్స్​, అనవసర మెస్సేజ్​లతో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారా? ఇకపై వాటి నుంచి మీకు విముక్తి కలిగినట్లే. వీటన్నింటికీ చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. బిల్​ చెల్లించేటప్పుడు, ఇతర సమయాల్లో షాపుల్లో.. మొబైల్​ నంబర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కస్టమర్​లకు సేవలు అందించేందుకు.. వ్యక్తిగత వివరాల కోసం వారిపై ఎలాంటి ఒత్తిడి చేయవద్దని వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

"కస్టమర్​ల మొబైల్​ నంబర్​లు ఇస్తే గానీ వినియోగదారులకు.. వ్యాపారస్తులు సేవలు అందించడం లేదు. ఇలాంటి ఫిర్యాదులు కస్టమర్ల నుంచి మాకు చాలానే అందాయి. విక్రయదారులకు.. కస్టమర్​ల వ్యక్తిగత మొబైల్​ నంబర్​ ఇస్తే తప్ప వారు బిల్​ ఇవ్వడం లేదు. ఈ పద్ధతి మంచిది కాదు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం.. కస్టమర్​ల వివరాలను విక్రేతలకు చెప్పాల్సిన అవసరం లేదు." అని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు.

వీటివల్ల మొబైల్​ నంబర్​లు లీక్ అవుతాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. విక్రయదారులకు మొబైల్​ నంబర్లు ఇచ్చిన తరువాత.. వారికి స్మామ్​ కాల్స్​, ఇతర అనవసర మెస్సేజ్​లు వస్తున్నాయని.. వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన వివరించారు. దీంతో రిటైల్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ ఛాంబర్స్​ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI)కి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు రోహిత్ కుమార్ వెల్లడించారు. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భారత్​లో బిల్​ ఇచ్చేందుకు మొబైల్​ నంబర్​ అవసరం లేదని రోహిత్ కుమార్ మరోసారి సృష్టం చేశారు.

మెడికల్​ షాపుల్లో ట్యాబ్లెట్ల కొనుగోళ్లపై కేంద్రం కొత్త విధానాలు..
మెడికల్​ షాపుల్లో మొత్తం టాబ్లెట్​ స్ట్రిప్​ను కొనుగోలు చేయాలని కస్టమర్​లపై ఒత్తిడి పెరుగుతున్న వేళ.. దీనిపై కూడా చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. టాబ్లెట్స్​, క్యాప్సూల్స్​ల మొత్తం స్ట్రిప్ కొనుగోలు చేయాలని ఔషధాల విక్రయదారులు.. కస్టమర్​లపై ఒత్తిడి తెస్తున్నారనే ఫిర్యాదులు తమకు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వినియోగదారుల రక్షణ కోసం.. అందుకు పరిష్కారం దిశగా ఫార్మా ఇండస్ట్రీతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రం తెలిపింది.

కస్టమర్​లపై ఒత్తిడి చేసి మొత్తం స్ట్రిప్​ను కొనిపించేలా చేయడం మెడికల్​ వేస్టేజ్​కు దారితీస్తుందని.. దీంతో పాటు వినియోగదారులపై అనవసర ఆర్థిక భారం పడుతుందని కేంద్రం వివరించింది. దీనిపై ఫార్మా, వైద్య పరికరాల పరిశ్రమకు చెందిన వివిధ సీనియర్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపిన కేంద్రం.. ఔషధాల ప్యాకింగ్​కు కొత్త టెక్నాలజీని తీసుకువచ్చే విధంగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

స్ట్రిప్‌ను కత్తిరించేందుకు పెర్ఫరేషన్ టెక్నాలజీని అవలంభించాలని పరిశ్రమలకు కేంద్రం సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రతి స్ట్రిప్‌పై తయారీ, గడువు తేదీని ముద్రించాలని, క్యూఆర్​ కోడ్‌ను కూడా ఉపయోగించాలని కేంద్ర సిఫార్సు చేసినట్లు వర్గాలు తెలిపాయి. కాాగా కస్టమర్​లు స్ట్రిప్​ మొత్తాన్ని కొనుగోలు చేయకపోతే.. వాటిని అమ్మేందుకు విక్రయదారులు నిరాకరిస్తున్నారన్న ఫిర్యాదులు తమకు అందినట్లు కేంద్రం తెలిపింది. దీనిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.