ETV Bharat / business

EPFO వడ్డీ రేటు ఫిక్స్.. ఈసారి ఎంతంటే..

author img

By

Published : Mar 28, 2023, 10:22 AM IST

Updated : Mar 28, 2023, 10:56 AM IST

ఉద్యోగుల భవిష్య నిధి- ఈపీఎఫ్​ ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15శాతం వడ్డీ ఇవ్వాలని ట్రస్టీల బోర్డు నిర్ణయించింది. 2021-22లో ఇచ్చిన 8.1శాతంతో పోల్చితే ఇది 0.05శాతం అధికం.

epfo interest rate
epfo interest rate

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్​) ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15శాతం వడ్డీ ఇవ్వాలని ట్రస్టీల బోర్డు నిర్ణయించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2021-22లో ఇచ్చిన 8.1శాతంతో పోల్చితే ఇది 0.05శాతం అధికం.
ఈపీఎఫ్ డిపాజిట్ల వడ్డీ రేట్లపై సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ (సీబీటీ) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ తుది అనుమతులు ఇస్తే.. వడ్డీ రేటు అమలవుతుంది. అందుకు అనుగుణంగా ఐదు కోట్ల చందాదారుల ఖాతాల్లోకి వడ్డీ జమ చేస్తారు.

2022 మార్చిలో ఈపీఎఫ్​పై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించింది సంస్థ. 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2021-22 ఏడాదికి 8.1 శాతానికి తగ్గించింది. 1977-78 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వడ్డీ ఇవ్వగా.. ఆ తర్వాత 2021-22 ఏడాదిదే అత్యంత తక్కువ వడ్డీ రేటు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.8 శాతం ఉండగా.. అప్పటి నుంచి ఒక్క ఏడాది మినహా వడ్డీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2016-17 ఏడాదికి 8.65 శాతం వడ్డీ చెల్లించిన ఈపీఎఫ్ఓ.. 2017-18లో దాన్ని 8.55 శాతానికి తగ్గించింది. 2018-19లో 8.65 శాతానికి పెంచి.. 2019-20లో 8.5శాతానికి పరిమితం చేసింది. అప్పటికి అది ఏడేళ్ల కనిష్ఠ స్థాయి. 2013-14లో 8.75 శాతం, 2014-15లో 8.5 శాతం వడ్డీని చెల్లించింది.

ఈపీఎఫ్​పై ఈసారి వడ్డీరేటు పెంచాలని కార్మిక సంఘాలు ఇదివరకే డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు సీబీటీ సమావేశంలోనూ తమ గళాన్ని వినిపించాయి. వడ్డీ రేటుతో పాటు తమ సమస్యలపై కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశంలో మాట్లాడారు. అధిక పింఛనుపై సుప్రీంకోర్టు తీర్పు అమలులో భాగంగా ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు విషయంలో ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల్లో అనేక సందేహాలున్నాయని, వాటికి పరిష్కారం చూపించాలని కోరారు. ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితి కంటే అధికంగా వేతనం పొందుతున్న ఉద్యోగులు.. అధిక చందా చెల్లించే విషయంపై సమస్యలు ఉన్నాయని ప్రస్తావించారు. ఆ అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించాలంటే.. యజమానితో కలిసి పేరా నంబర్ 26 (6) ప్రకారం ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలని పెట్టిన నిబంధన వల్ల చాలా మంది కార్మికులు నష్టపోతున్నారని కార్మిక సంఘాల ప్రతినిధులు వివరించారు. అయితే, వీటికి సంబంధించి ఎలాంటి మార్పులు చేయడం లేదని కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓ ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అధిక పింఛనుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా అమలు చేస్తున్నామని, ఏమైనా మార్పులు చేస్తే తీర్పు ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నట్లు సమాచారం.

Last Updated :Mar 28, 2023, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.