ETV Bharat / business

మస్క్​ చేతికి ట్విట్టర్​.. భారత ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Oct 28, 2022, 5:20 PM IST

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. యజమానులతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమ సంస్థలు అనుసరించాల్సిన నిబంధనలు, చట్టాలు అలాగే కొనసాగుతాయని ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

elon musk twitter deal
elon musk twitter deal

ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్.. ట్విట్టర్​ను హస్తగతం చేసుకున్న తరుణంలో కీలక వ్యాఖ్యలు చేసింది కేంద్రం. యాజమాన్యం మారినా.. చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​. "ఎవరు, ఏ సంస్థను కొన్నా ప్రభుత్వానికి సంబంధం లేని విషయం. సామాజిక మాధ్యమాలన్నీ చట్టాలు, నిబంధనలను పాటించాలి. సంస్థలన్నింటికీ ఒకే నిబంధనలు ఉంటాయి" అని చెప్పారు.

మరోవైపు.. భావ ప్రకటనా స్వేచ్ఛను అనుమతిస్తానని మస్క్ చేసిన వ్యాఖ్యలపై అనేక మంది స్పందించారు. విద్వేషపూరిత ప్రసంగం, నిబంధనలు అతిక్రమించారన్న కారణంతో బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ఖాతాను బ్యాన్ చేశారు. మస్క్ ప్రకటనతో.. ఆమె ఖాతాను పునరుద్ధరించాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. ఇన్​స్టాలో ఓ అభిమాని చేసిన పోస్ట్​ను ఆమె షేర్ చేశారు.

హస్తగతం.. వారిపై వేటు
అంతకుముందు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన అనంతరం టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థలో కీలక పదవుల్లో ఉన్న వారిపై అనూహ్యంగా వేటు వేశారు. సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు సీఎఫ్​ఓ నెడ్‌ సెగల్‌, జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌, లీగల్‌ పాలసీ విభాగాధిపతి విజయ గద్దె సహా మరికొంత మందిని మస్క్‌ తొలగించారు. ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందంలో వెనక్కి తగ్గిన మస్క్‌ను కోర్టుకు లాగడంలో ఆ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే వారికి మస్క్‌ ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. అయితే వారి తొలిగింపు మస్క్‌పై మరింత ఆర్థిక భారాన్ని మోపింది. బోర్డుతో ఆయా ఉద్యోగులు కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు మస్క్ మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో జాక్‌ డోర్సే స్థానంలో ట్విట్టర్‌ సీఈఓ బాధ్యతలు చేపట్టిన పరాగ్ 12 నెలల్లోగా తొలిగిస్తే 42 మిలియన్ డాలర్లు చెల్లించాలని బోర్డు ఒప్పందం చేసుకున్నారు. ఆ వ్యవధి పూర్తి కాకుండానే పరాగ్‌ను మస్క్‌ తొలిగించడం వల్ల ఇప్పుడు సుమారు రూ. 345 కోట్లు మస్క్ చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది.

మిగిలిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగుల తొలగింపు కూడా మస్క్‌కు ఆర్థిక భారం కానుంది. మాజీ సీఎఫ్‌వో నెడ్ సెగల్‌కు 25.4 మిలియన్‌ డాలర్లు, చీఫ్ లీగల్ ఆఫీసర్ తెలుగు మహిళ విజయ గద్దె 12.5 మిలియన్‌ డాలర్లు అందుకోనున్నారు. ప్రస్తుతం కంపెనీలో అత్యధిక వేతనం తీసుకుంటున్న వారిలో విజయ ఒకరు. అభ్యంతరకరమైన పదాలు, పోస్టులు, వాక్‌స్వాతంత్ర్యంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సమయంలో విజయ.. ట్విట్టర్‌ను ఓ గాడిన పెట్టేందుకు తీవ్రంగా కృషి చేశారు. వివాదాస్పద ట్వీట్లతో ప్రజల అసహనానికి కారణమవుతున్న వారిని వేదిక నుంచి నిషేధించేందుకు ఆమె ఏమాత్రం వెనుకాడలేదు. అలా ట్విటర్‌ నుంచి బహిష్కరణకు గురైన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నారు.

మస్క్‌ నుంచి ట్విట్టర్‌ కొనుగోలు ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి కింది స్థాయి ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతూ వచ్చింది. కంపెనీ మస్క్‌ వశమైన తర్వాత భవిష్యత్తు ఏంటన్న సందేహం వారిని ఒత్తిడికి గురిచేసింది. మరోవైపు వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యలో కోత ఉంటుందని మస్క్‌ పలుసార్లు సంకేతాలు ఇచ్చారు. రుణాల కోసం బ్యాంకర్లతో జరిపిన చర్చల్లో కంపెనీని లాభాల్లోకి తీసుకురావడానికి దాదాపు 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తామని చెప్పినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దాన్ని ఆయన గురువారం ఉద్యోగులతో మాట్లాడుతూ తోసిపుచ్చినప్పటికీ.. వారిలో ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికే స్వచ్ఛందంగా సంస్థ నుంచి పక్కకు జరిగినట్లు సమాచారం.

ఇవీ చదవండి: ఎలాన్​ మస్క్​ చేతికి 'ట్విట్టర్​'.. పరాగ్ అగర్వాల్, గద్దె విజయపై వేటు

'శుక్రవారం నాటికి ట్విట్టర్​ను కొనేస్తా'.. బ్యాంకర్లకు మస్క్‌ హామీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.