ETV Bharat / business

చైనాను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్రం పావులు!

author img

By

Published : Jun 22, 2020, 5:05 AM IST

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగంపై కన్నేసి కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాను.. ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. చౌక వస్తువులు, నాణ్యతలేని చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించి.. భారత స్వావలంబనను ప్రమోట్‌చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పరిశ్రమవర్గాల నుంచి సమాచారం కోరిన కేంద్రం.. చైనాను కోలుకోలేని దెబ్బతీయాలని వ్యూహరచన చేస్తోంది.

Sources
ఆ చైనా ఉత్పుత్తుల దిగుమతి తగ్గింపునకు కేంద్రం చర్యలు

దేశీయ ఉత్పత్తులకు ఊతమిచ్చేలా.. తక్కువ నాణ్యత కలిగిన వస్తువుల దిగుమతుల నియంత్రణ.. ముఖ్యంగా చైనా ఉత్పత్తులను తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. దేశీయ ధరలు, పన్ను ప్రతికూలతలను పరిగణనలోకి తీసుకొని వస్తువులవారీగా చౌక వస్తువుల దిగుమతుల వివరాలు సమర్పించాలని పరిశ్రమవర్గాలను కోరినట్లు తెలుస్తోంది. చైనా నుంచి దిగుమతులు తగ్గించటం సహా భారత్‌ స్వావలంబనను ప్రమోట్‌చేసే అంశంపై ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులు, ముడిసరుకులు ప్రధానంగా చేతి గడియారాలు, గోడ గడియారాలు, గాజు బుడ్డీలు, గాజు, రాడ్లు, ట్యూబ్‌లు, హెయిర్‌క్రీమ్స్‌, షాంపులు, పౌడర్లు, సౌందర్య ఉత్పత్తులు, ప్రింటింగ్‌ఇంక్‌, పెయింట్స్‌, వార్నిషెస్‌, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి పరిశ్రమవర్గాల అభిప్రాయాలతోపాటు సలహాలు కోరినట్లు తెలుస్తోంది.

2014-15, 2018-19 మధ్య చైనా దిగుమతుల్లో పెరుగుదల, దేశీయంగా తయారైన అలాంటి వస్తువుల ధరల వివరాలు, దేశీయ ఉత్పత్తి సామర్థ్యం, స్వేచ్ఛావర్తక ఒప్పందాల్లో భాగంగా దిగుమతులు, విలోమ పన్నుల అంశాలపై పరిశ్రమవర్గాల నుంచి.. కేంద్ర ప్రభుత్వం సమాచారం కోరింది. ప్రభుత్వం కోరిన అన్నిఅంశాలకు సంబంధించిన వివరాలను సిద్ధంచేసి త్వరలోనే వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు పంపనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో.. డ్రాగన్‌దేశం నుంచి దిగుమతుల నియంత్రణ, తగ్గింపుపై కేంద్రం దృష్టి సారించటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌ దిగుమతుల్లో చైనా వాటా 14 శాతంగా ఉంది. చరవాణులు, టెలికం, విద్యుత్తు, ప్లాస్టిక్‌బొమ్మలు, ఫార్మా మిశ్రమ పదార్థాలకు చైనా ప్రధాన సరఫరాకు నిలుస్తోంది.

టైర్ల దిగుమతులపై ఇప్పటికే ఆంక్షలు విధించిన కేంద్రం.. భారత్‌తో సరిహద్దు కలిగిన దేశాల పెట్టుబడులను దేశీయ సంస్థల్లో నియంత్రించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. కరోనా నేపథ్యంలో.. ఈ నిర్ణయం చైనా పెట్టుబడులకు అడ్డుకట్ట వేయనుంది. 2019 ఏప్రిల్‌ - 2020 ఫిబ్రవరి మధ్యకాలంలో చైనా నుంచి దిగుమతుల విలువ 62.4బిలియన్‌ డాలర్లు కాగా.. అదేకాలంలో భారత్‌నుంచి ఆ దేశానికి ఎగుమతైన వస్తువుల విలువ 15.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గోడ గడియారాలు, చేతి గడియారాలు, సంగీత పరికరాలు, బొమ్మలు, ఆట వస్తువులు, ఫర్నీచర్‌, పరుపులు, ప్లాస్టిక్‌, విద్యుత్తు యంత్రాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, రసాయనాలు, ఇనుము, ఉక్కు వస్తువులు, ఎరువులు, ఖనిజ ఇంధనం, లోహాపు వస్తువులు

చైనా నుంచి ప్రధానంగా దిగుమతి అవుతున్నాయి. 2019-20ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య కాలంలో చైనాతో వాణిజ్యలోటు 47బిలియన్‌ డాలర్లకు పెరగటంపై భారత్‌ ఆందోళన చెందుతోంది.

ఇదీ చూడండి: భారత్​- చైనా సరిహద్దు సమస్యకు అసలు కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.