ETV Bharat / business

'నోట్ల రద్దు​ తర్వాత పెరిగిన నగదు చలామణి'

author img

By

Published : Nov 7, 2021, 5:38 PM IST

Updated : Nov 8, 2021, 6:25 AM IST

డీమానిటైజేషన్​ తర్వాత డిజిటల్​ చెల్లింపులు పెరిగినప్పటికీ.. కరెన్సీ నోట్ల చలామణి కూడా పెరిగిందని ఆర్​బీఐ తాజాగా నివేదికలో వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ప్రజలు నగదు నిల్వలకు ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణమని పేర్కొంది.

notes in circulation
కరెన్సీ నోట్ల చెలామణి

పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలకు (డిజిటల్​ చెల్లింపులు) విపరీతంగా ఆదరణ పెరిగింది. ఫలితంగా కరెన్సీ నోట్ల చలామణి కొంతమేర తగ్గిందనే చెప్పొచ్చు. అయితే కరోనాతో ప్రజల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ నగదు నిల్వలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో గతేడాది డిజిటల్​ లావాదేవీలు పెరిగినప్పటికీ.. నోట్ల చలామణి కూడా నెమ్మదిగా పెరిగిందని భారతీయ రిజర్వే బ్యాంకు(ఆర్​బీఐ) పేర్కొంది.

ఆర్​బీఐ నివేదిక ప్రకారం.. 'నెట్​ బ్యాంకింగ్​, ప్లాస్టిక్​ కార్డులు, యూనిఫైడ్​ పేమెంట్స్ ఇంటర్​ఫేస్​ (యూపీఐ) సహా పలు విధానాల్లో డిజిటల్​ లావాదేవీలు భారీ స్థాయిలో పెరిగాయి. యూపీఐ.. దేశంలో లావాదేవీల ప్రధాన మాధ్యమంగా అభివృద్ధి చెందుతోంది. అయితే నోట్ల చలామణి కూడా క్రమంగా వృద్ధి చెందుతోంది'.

ఆర్​బీఐ నివేదికలోని ముఖ్యాంశాలు

  • 2016 నవంబరు 4న రూ.17.74 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉండగా.. 2021 అక్టోబరు 29 నాటికి రూ.29.17 లక్షల కోట్లకు పెరిగాయి.
  • 2020 అక్టోబరు 30 నాటికి రూ.26.88 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉండగా.. 2021 అక్టోబరు 29 నాటికి రూ.2,28,963 కోట్లకు పెరిగాయి.
  • 2019 అక్టోబరు 30 నుంచి 2020 అక్టోబరు 29 నాటికి రూ.4,57,059 కోట్ల విలువైన నోట్లు చలామణీలో పెరిగాయి.
  • 2021-21లో చలామణిలో ఉన్న నోట్ల(ఎన్​ఐసీ) విలువ, పరిమాణం వరుసగా 16.8శాతం, 7.2 శాతం పెరిగాయి. ఇది 2019-20లో 14.7 శాతం, 6.6 శాతంగా ఉంది.
  • ఎన్​ఐసీ అక్టోబరు 2014 నుంచి అక్టోబరు 2016 వరకు సగటున 14.51 శాతం పెరిగాయి.
  • యూపీఐని 2016లో ప్రారంభించారు. అప్పటి నుంచి నెలనెలా డిజిటల్​ లావాదేవీలు పెరుగుతూ వస్తున్నాయి.
  • 2021 అక్టోబరులో 421 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.7.71 లక్షల కోట్లు.

డిసెంబరు 2018-జనవరి 2019 మధ్య ఆరు నగరాల్లోని వ్యక్తుల రిటైల్ చెల్లింపు అలవాట్లపై ఆర్​బీఐ​ పైలట్​ సర్వే నిర్వహించింది. దీని ఫలితాలను 2021 ఏప్రిల్​లో ప్రచురించింది. దీని ప్రకారం రూ.500 అంతకన్నా తక్కువ చెల్లింపులకు నోట్లను ఉపయోగిస్తున్నట్లు తేలింది.

అనంతరం.. రీ-మానిటైజేషన్‌లో భాగంగా ప్రభుత్వం కొత్త రూ.2,000, రూ.500 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత రూ.200 కొత్త డినామినేషన్ కూడా జోడించింది.

2021 మార్చి 31నాటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో(విలువపరంగా) రూ.500, రూ.2,000 నోట్లు వాటా 85.7 శాతానికి పెరిగింది. ఇది 2020లో 83.4 శాతంగా ఉంది.

నల్లధనం వెలికి తీత, డిజిటల్​ లావాదేవీలు ప్రోత్సాహం ప్రధాన ఉద్దేశంతో 2016 నవంబర్​ 8న ప్రధాని నరేంద్ర మోదీ.. 1000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదీ చూడండి: పెట్రోల్, డీజిల్​పై పన్నులు ఎంత శాతం తగ్గాయంటే..

Last Updated : Nov 8, 2021, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.