ETV Bharat / business

రాయితీలు ఇవ్వకపోతే కట్టేదెలా? అమ్మేదెలా?

author img

By

Published : May 15, 2020, 12:10 PM IST

లాక్​డౌన్ కారణంగా ఆగిపోయిన భవన నిర్మాణ పనులు ఇప్పడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం, వాటిని విక్రయించడం తమకొక సవాల్​ అని నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం రాయితీలు కల్పించి ఆదుకోవాలని, కొనుగోలుదారులకు చేయూతనిచ్చేలా పన్నులు, వడ్డీ రేట్లు తగ్గించాలని కోరుతున్నారు.

Advice from construction industry experts to central government
రాయితీలు ఇవ్వకుంటే... కట్టేదెలా? అమ్మేదెలా?

కరోనా ప్రభావంతో కుదేలైన భవన నిర్మాణాల పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. దీనికి అనుబంధంగా ఉండే దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించడంతో కార్యకలాపాలు మొదలవుతున్నాయి. కానీ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న స్థితిలో ప్రాజెక్టులు పూర్తి చేయడం, విక్రయించడం తమకు సవాలేనని నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రంగం మళ్లీ పుంజుకోవడానికి సుమారు రెండేళ్లు పట్టవచ్చని నిపుణుల అంచనా. కొనుగోలుదారులకు ఊతమిచ్చేలా ప్రభుత్వాలు పన్నులు, వడ్డీ రేట్లను తగ్గిస్తేనే కొంత కోలుకుంటుందని వారు సూచిస్తున్నారు.

కీలక మార్కెట్‌కు గడ్డు కాలం

నివాస గృహాలు, కార్యాలయ భవన నిర్మాణాలకు దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ కీలక మార్కెట్టు. రెండు విభాగాల్లో ఏటా రూ. 30-40 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతాయని అంచనా. అనుబంధ పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఇందులో సుమారు 30 శాతం వరకు ఆదాయం లభిస్తుంది. ఇంత పెద్ద రంగానికి ప్రభుత్వ చేయూత చాలా అవసరమని ఆ రంగం ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

పుంజుకోవడానికి మరింత సమయం

"ఆర్థిక మాంద్యాన్ని మించిన ఉపద్రవం ఇది. నిర్మాణ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కొనుగోలుదారుడిని ఎంతగా ప్రోత్సహిస్తే అంత త్వరగా ఈ రంగం కోలుకుంటుంది. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీలతో ముందుకు రావాలి. వినియోగదారుడి దగ్గర నగదు చలామణి పెరగాలి. బ్యాంకుల రుణ విధానం సరళతరం కావాలి."

- జి.రాంరెడ్డి, క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు

మార్పులకు అవకాశం

"నిర్మాణ రంగం ఎప్పటికి కోలుకుంటుందో ఇప్పుడే అంచనా వేయలేం. దీనికి అనుబంధంగా సుమారు 250 రకాల పరిశ్రమలు ఉన్నాయి. నిర్మాణ రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దీపన పథకాన్ని ప్రకటించాలి. కరోనా నేపథ్యంలో గృహాలు, కార్యాలయాల్లో భౌతిక దూరం పాటించటం అనివార్యం. దీంతో నిర్మాణాల్లో మార్పుల రూపంలో అవకాశాలు పెరుగుతాయి. ఇకపై ప్రీకాస్ట్‌ విధానం కీలకపాత్ర పోషించనుంది."

- సి.శేఖర్‌రెడ్డి, సీఐఐ ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ ఛైర్మన్‌

నిపుణుల సూచనలిలా...

  • ఇంటి రుణాలపై వడ్డీ రేటు ఆరు శాతానికి తగ్గించాలి.
  • నివాస గృహాలకు రిజిస్ట్రేషన్‌ పన్ను నామమాత్రంగా ఉండాలి.
  • ఇంటి రుణాలపై ఆదాయపన్ను మినహాయింపును మరింత పెంచాలి.
  • నిర్మాణ ముడిసరకులపై జీఎస్టీ రెండు శాతానికి పరిమితం చేయాలి.
  • నిర్మాణదారులకు ఇచ్చిన అప్పులపై కనీసం ఏడాది పాటు మారటోరియం ప్రకటించాలి. అదనపు రుణ సౌకర్యం కల్పించాలి.

ఇదీ చూడండి: భారత్​కు భారీ సాయం ప్రకటించిన ప్రపంచ బ్యాంకు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.